క్రికెట్ సర్వనాశనం: సచిన్ టెండూల్కర్ మండిపాటు
వన్డే క్రికెట్ మ్యాచులో రెండు కొత్త బంతులు ఉపయోగించాలనే విధానాన్ని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తప్పు పట్టారు.
ముంబై: వన్డే క్రికెట్ మ్యాచులో రెండు కొత్త బంతులు ఉపయోగించాలనే విధానాన్ని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తప్పు పట్టారు. క్రికెట్ సర్వనాశనానికి ఇది పరిపూర్ణమైన విధానమని ఆయన మండిపడ్డారు. ఇటీవల అస్ట్రేలియాపై ఇంగ్లాండు జట్టు 481 పరుగులతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన నేపథ్యంలో టెండూల్కర్ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.
వన్డే మ్యాచులో రెండు కొత్త బంతులు వాడడం అనేది సర్వనాశనానికి ఉత్తమమైన మార్గమని, రివర్స్ స్వింగ్ కు అనుకూలించే విధంగా బంతి పాతబడేందుకు సమయం ఉండదని, రెండు బంతుల విధానం వల్ల రివర్స్ స్వింగ్ ను చూసే అవకాశం ఉండదని ఆయన అన్నారు.
వన్డేల్లో రెండు కొత్త బంతులను వాడే విధంగా ఐసిసి 2011 అక్టోబర్ లో నిబంధనలను సవరించింది. దాని ప్రకారం ఒక ఓవరు వేసేటప్పుడు ఒక అంపైర్ ఒక బంతిని వాడితే, మరో ఓవరుకు రెండో అంపైర్ తన దగ్గర ఉన్న మరో బంతిని వాడుతాడు. నిర్ణీత యాభై ఓవర్లో ఒక్కో బంతిని 25 ఓవర్లకు వాడుతారు.
సచిన్ వ్యాఖ్యలతో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్ ఏకీభవించాడు. ఈ కారణంతోనే ఎక్కువ మంది అటాకింగ్ ఫాస్ట్ బౌలర్లను తయారు చేయలేకపోతున్నామని, రెండు బంతులు వాడడం వల్ల బౌలర్లు ఆత్మరక్షణలో పడిపోతున్నారని, లైనప్ మారుస్తున్నారని అన్నాడు.