కరాచీలోని గడ్డాఫీ స్టేడియంలో పూర్ లైటింగ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ స్టేడియంలో పాకిస్తాన్‌తో జరిగిన వన్డేలో న్యూజిలాండ్ ఆటగాడు రాచిన్ రవీంద్ర తలకు గాయమైంది. స్టేడియంలో లైటింగ్ సరిగ్గా లేకపోవడంతో క్యాచ్ తీసుకునే క్రమంలో బంతి తలకు తగిలింది.

శనివారం పాకిస్తాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో క్యాచ్ తీసుకునే ప్రయత్నంలో న్యూజిలాండ్ క్రికెటర్ రాచిన్ రవీంద్రకు నుదిటిపై గాయమైంది. 38వ ఓవర్‌లో జరిగిన ఈ సంఘటన లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలోని ఫ్లడ్‌లైటింగ్‌పై తీవ్ర ఆందోళన కలిగించింది. ఈ ప్రమాదానికి లైటింగ్ సరిగ్గా లేకపోవడమే కారణమని చాలామంది ఆరోపించారు.  

న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు చెబుతున్న దాని ప్రకారం, రవీంద్ర నుదిటిపై గాయమైంది, వెంటనే వైద్య సహాయం అందించారు. హెడ్ ఇంజరీ అసెస్‌మెంట్ (HIA) కూడా చేశారు. దీన్ని ఆయన మొదట పాస్ అయ్యారు. అయితే, ప్రామాణిక కంకషన్ ప్రోటోకాల్స్ ప్రకారం ఆయనను పర్యవేక్షణలో ఉంచారు.  పాకిస్తాన్‌కు చెందిన ఖుష్‌దిల్ షా బలంగా షాట్ కొట్టడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్‌లో ఉన్న రవీంద్రకు బంతి తగిలింది. స్టేడియం లైట్ల కింద బంతి ఎక్కడికి వెళ్తుందో సరిగ్గా అంచనా వేయలేకపోవడంతో ఆయన నుదిటికి బంతి తగిలింది. దీంతో రక్తం కారింది. వైద్య సిబ్బంది వెంటనే మైదానంలోకి వచ్చి ప్రథమ చికిత్స అందించారు.  

ఈ సంఘటన తర్వాత, స్టేడియంలో సరైన లైటింగ్ ఏర్పాట్లు చేయనందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై అభిమానులు సోషల్ మీడియాలో మండిపడ్డారు. ముఖ్యంగా పాకిస్తాన్‌లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో లైటింగ్‌ను మెరుగుపరచాలని చాలామంది క్రికెట్ అభిమానులు డిమాండ్ చేశారు.  

X (ట్విట్టర్)లో ఓ అభిమాని ఇలా రాశాడు, "పీసీబీ స్టేడియంలో లైటింగ్‌ను మెరుగుపరచాలి. లైట్లు సరిగ్గా లేకపోవడంతో రాచిన్ రవీంద్ర బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. దీంతో ఆయనకు తీవ్ర గాయమైంది. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను!"  

మరో అభిమాని ఇలా వ్యాఖ్యానించాడు, "రాచిన్ రవీంద్ర చాలా మంచి ఫీల్డర్, అయినా ఆయన బంతిని చూడలేకపోయాడు? గడ్డాఫీ స్టేడియంలో ఫ్లడ్‌లైట్లు ఎంత దారుణంగా ఉన్నాయో ఇది రుజువు చేస్తుంది!"  

కొంతమంది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)ని కూడా ప్రశ్నించారు. "ఐసీసీ ఇక్కడ అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఎలా అనుమతించింది? ఆటగాళ్ల భద్రతకు ప్రాధాన్యతనివ్వాలి. పాకిస్తాన్ సరైన సౌకర్యాలు కల్పించలేకపోతే, ఛాంపియన్స్ ట్రోఫీని దుబాయ్‌కు మార్చండి. రాచిన్ రవీంద్ర కోసం ప్రార్థనలు!" అని మరో అభిమాని రాశాడు. ఈ వివాదం నడుమ, న్యూజిలాండ్ పాకిస్తాన్‌పై 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్లాక్ క్యాప్స్ 50 ఓవర్లలో 330/6 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్, కేన్ విలియమ్సన్, డారెల్ మిచెల్ కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. గాయపడకముందు రవీంద్ర 19 బంతుల్లో 25 పరుగులు చేశాడు.