థాయ్ లాండ్ ఓపెన్ లో సెమీఫైనల్ కు దూసుకెళ్లిన సింధూ.. ప్రపంచ నెం.1 ప్లేయర్ కు షాక్..
థాయ్ లాండ్ ఓపెన్ లో తెలుగు తేజం సింధూ తన సత్తా చాటింది. ప్రపంచ నెం. 1 ప్లేయర్ యమగూచిని చిత్తుగా ఓడించి సెమిస్ లోకి దూసుకెళ్లింది.
బ్యాంకాక్ : పీవీ సింధు థాయ్ లాండ్ ఓపెన్ లో జోరు కొనసాగిస్తూ సెమీఫైనల్ కు దూసుకుపోయింది. శుక్రవారం మూడో గేమ్ ల పాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు (వరల్డ్ నెంబర్ 7) 21-15, 20-22, 21-13తో ప్రపంచ నెంబర్ వన్ akane yamaguchi (జపాన్) ని చిత్తు చేసింది. క్వార్టర్ ఫైనల్ తొలి గేమ్లో ఇద్దరు షట్లర్లు నువ్వా- నేనా అనేలా తలపడ్డారు. కానీ క్రాస్ కోర్టు, డ్రాప్ షాట్లతో ప్రత్యర్థిని ఇబ్బందుల్లోకి నెట్టిన సింధూ మూడు పాయింట్లు ఆధిక్యం సాధించి 11-9తో విరామానికి వెళ్ళింది. అనంతరం యమగూచి, sindhu వరుస పాయింట్లు దక్కించుకొని జోరు ప్రదర్శించినా.. చివరకు భారత షట్లరే గేమ్ ను కైవసం చేసుకుంది.
రెండో గేమ్ ఆరంభంలో యమగూచి పొరపాట్లు చేయడంతో సింధూ ఆధిక్యంలోకి వెళ్లినా.. తర్వాత తేరుకున్న జపాన్ షట్లర్ ఏకంగా గేమ్ నెగ్గింది. నిర్ణాయక మూడో గేమ్ లో వెన్నునొప్పితో యమగూచి ఆట గాడి తప్పగా.. ఇదే అదనుగా స్మాష్లతో విరుచుకుపడిన సింధు గేమ్ ను, మ్యాచ్ ను సొంతం చేసుకుంది. సెమీస్లో ఒలింపిక్ ఛాంపియన్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ చెన్ యూ ఫీ (చైనా)ను సింధు ఢీకొంటుంది.