ప్రో కబడ్డి 2019: తేలని ఫలితం... తమిళ్ తలైవాస్ Vs పుణేరి పల్టాన్ మ్యాచ్ టై
చెన్నై వేదికన సాగుతున్న ప్రో కబడ్డీ సీజన్ 7 లో స్థానిక తమిళ్ తలైవాస్ జట్టు ఆకట్టుకోలేకపోయింది. పుణేరీ పల్టాన్ ను సమర్థవంతంగా ఎదుర్కోలేక టైగా ముగించింది.
చెన్నైలోని జవహార్ లాల్ ఇండోర్ స్టేడియం మరో రసవత్తర పోరుకు వేదికయ్యింది. ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 లో భాగంగా జరిగిన మ్యాచ్ లో స్థానిక తమిళ్ తలైవాస్ జట్టును పుణేరీ పల్టాన్ సమర్థవంతంగా ఎదుర్కోగలిగింది. దీంతో హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్ చివరకు ఫలితం తేలకుండానే ముగిసింది. 31-31 పాయింట్లతో ఇరుజట్లు సమానంగా నిలవడంతో మ్యాచ్ టైగా ముగిసింది.
ఆతిథ్య తమిళ్ జట్టు ఓ సూపర్ రైడ్ తో కలుపుకుని 19 పాయింట్లు సాధిచింది. అలాగే ట్యాకిల్స్ లో 10, ప్రత్యర్థి ఆలౌట్ ద్వారా 2, ఎక్స్ట్రాల రూపంలో 1 ఇలా మొత్తం 31 పాయింట్లకు చేరుకుంది. ఆటగాళ్లలో రైడర్లు అజిత్ 8, రాహుల్ చౌదరి 8 పాయింట్లతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. రన్ సింగ్ 4, వినీత్ 3, మోహిత్ 3 పాయింట్లతో పరవాలేదనిపించారు.
పుణేరీ పల్టాన్ విషయానికి వస్తే రైడింగ్ లో 16, ట్యాకిల్స్ 12, ప్రత్యర్థిని ఒకసారి ఆలౌట్ చేయడం ద్వారా 2, ఎక్స్ట్రాల రూపంలో 1 మొత్తం 31 పాయింట్లు సాధించింది. ఇలా ఆతిథ్య జట్టుకు సమానంగా పాయింట్లు సాధించి మ్యాచ్ ను టైగా ముగించుకుంది. ఆటగాళ్లలో సుర్జీత్ 7, పంకజ్ 7, నితిన్ 5, మంజిత్ 5 పాయింట్లతో ఆకట్టుకున్నారు.