Asianet News TeluguAsianet News Telugu

అగ్లీ సీన్స్: సెహ్వాగ్ పై ప్రీతి జింతా ఆగ్రహం, ఏమైంది...

అగ్లీ సీన్స్: సెహ్వాగ్ పై ప్రీతి జింతా ఆగ్రహం, ఏమైంది...

Preethi unhappy with sehwag

హైదరాబాద్: జట్టు ఆటతీరు పట్ల కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యజమాని ప్రీతి జింతా కోచ్ వీరేంద్ర సెహ్వాగ్ పై విరుచుకుపడ్డారు. దాంతో వారిద్దరి మధ్య వివాదం తలెత్తింది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన ఐపిఎల్ మ్యాచులో పంజాబ్ ఓటమికి జింతా సెహ్వాగ్ ను తప్పు పట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. 

సెహ్వాగ్, జింతా మధ్య తీవ్రమైన వాగ్వివాదం జరిగినట్లు తెలుస్తోంది. దాంతో బాధ్యతల నుంచి తప్పుకోవాలని సెహ్వాగ్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

రాజస్థాన్ తో ఆడిన మ్యాచులో 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక పంజాబ్ ఓటమి పాలైంది. తొలి వికెట్ పడిన తర్వాత కరుణ్ నాయర్, మనోజ్ తివారీ వంటి బ్యాట్స్ మెన్ ఉన్నా కూడా అశ్విన్ ను బ్యాటింగ్ కు పంపించారు. దాంతో కెప్టెన్ అయిన అశ్విన్ పరుగులేమీ చేయకుండా వెనుదిరిగాడు. ఆ తర్వాత ఎవరు కూడా సరిగా బ్యాటింగ్ చేయలేకపోయారు. 

దాంతో జింతా సెహ్వాగ్ పై తీవ్రంగా మండిపడినట్లు తెలుస్తోంది. ఓటమికి గల కారణాలను సెహ్వాగ్ చెప్పడానికి ప్రయత్నించినా జింతా వినిపించుకోలేదని అంటున్నారు. వచ్చే ఏడాది మెంటర్, కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని సెహ్వాగ్ అనుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. 

పంజాబ్ కు ఇంకా ప్లే ఆఫ్స్ కు వెళ్లడానికి అవకాశం ఉండడంతో వివరణ ఇవ్వడానికి సెహ్వాగ్ నిరాకరించాడు. వివాదం ఆటగాళ్లపై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతో ఆయన మాట్లాడడానికి నిరాకరించినట్లు చెబుతున్నారు. వివాదంపై ప్రీతి జింతా కూడా ఏమీ మాట్లాడలేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios