మూసా వీర విహారం.. నైజీరియా విజయం
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అహ్మద్ మూసా
హైదరాబాద్: అసలు కొన్ని మ్యాచ్లకు ఫస్టాఫ్ లేకుండా డైరెక్టుగా సెకండాఫ్ ఉంటే ఎంత రంజుగా ఉంటుందో శుక్రవారం నైజీరియా, ఐస్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చూసినవారికి అనుభవంలోకి వచ్చి ఉంటుంది. సెకండాఫ్లో అహ్మద్ మూసా ఏం మాయ చేసాడో తెలియదు కానీ అద్భుతమైన రెండు గోల్స్ చేసి 2-0 స్కోర్తో నైజీరియా టీమ్కు వరల్డ్ కప్లో తొలి విజయాన్ని అందించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. గోల్ చేసినప్పుడు అతడి ఆనందం చూడాలి.. చేతులే రెక్కలైతే ఓ ఆటగాడు మైదానంలో కాళ్ళు ఉన్న పక్షిలా ఎలా విహరిస్తాడో మూసా అలా చేసి చూపించాడు.
ఫస్టాఫ్లో ఇరు జట్లు గోల్స్ చేయలేదు సరికదా ప్రేక్షకుల్లో ఏ మాత్రం ఆసక్తి రేపని విధంగా పేలవంగా ఆడారు. సెకండాఫ్ మొదలై నాలుగో నిముషంలోకి అడుగుపెట్టేదాకా ఇదే పరిస్థితి. 49వ నిముషంలో నైజీరియా స్ట్రయికర్ అహ్మద్ మూసా తొలి గోల్ చేశాడు. జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత 75వ నిముషంలో బాల్ మీద ఫుల్ కమాండ్తో మరో గోల్ చేశాడు. ఆ విధంగా 2-0 స్కోరుతో ఐస్లాండ్పై నైజీరియాకు విజయాన్ని అందించాడు.