చెత్తగొడవ: అనుష్క, కోహ్లీ దంపతులకు చిక్కులు
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు.
ముంబై: విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. చెత్త గొడవపై వారికి లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. తనను దుర్బాషలాడిన అనుష్కతోపాటు వీడియో పోస్టు చేసిన కోహ్లీకి అర్హాన్ సింగ్ లీగల్ నోటీసు పంపించాడు.
ఇటీవల అనుష్క, విరాట్ కలిసి కారులో వెళ్తుండగా, లగ్జరీ కారులో తమ పక్క నుంచే వెళ్లిన అర్హాన్ సింగ్ ప్లాస్టిక్ కవర్ను రోడ్డుపై పడేశాడు. అది గమనించిన అనుష్క కారు ఆపి అతడిని తిట్టింది. అతడి ప్రవర్తన బాగా లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.
అనుష్క అతడిని నిలదీస్తుండగా తీసిన వీడియోను కోహ్లీ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. తాను చేసిన పనికి సోషల్ మీడియా ద్వారా అర్హాన్ క్షమాపణ చెప్పాడు. కోహ్లీ, అనుష్కలను మాత్రం వదిలిపెట్టలేదు.
తాను వేసిన చెత్తకంటే అనుష్క నోటి నుంచే ఎక్కువ చెత్త వచ్చిందని అర్హాన్ ట్వీట్ చేశాడు. సెలబ్రిటీ అయి ఉండీ రోడ్డుపై ఆ కేకలేమిటని అడిగాడు. నెటిజన్లు కూడా అర్హాన్కే మద్దతుగా నిలిచారు. తనను అనవసరంగా బజారుకీడ్చిన కోహ్లీ,అనుష్కలకు వ్యతిరేకంగా అర్హాన్ తాజాగా లీగల్ నోటీసులు పంపించాడు.