ఇండోనోషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పురుషుల జోడీ చరిత్ర సృష్టించింది. భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడి ఇండోనేషియా ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ విజేతగా నిలిచింది.
ఇండోనోషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పురుషుల జోడీ చరిత్ర సృష్టించింది. భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడి ఇండోనేషియా ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ విజేతగా నిలిచింది. ఫైనల్లో అరొన్ చియా-సో వుయిక్ (మలేసియా) జోడీపై రెండు వరుస సెట్లలో 21-17, 21-18 తేడాతో విజయం సాధించారు. దీంతో ఇండోనేసియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 టోర్నీలో టైటిల్ నెగ్గిన తొలి భారత జోడీగా సాత్విక్-చిరాగ్ నిలిచారు. అయితే భారత ఆటగాళ్లు తొలి గేమ్లో ప్రారంభంలో బలహీన ఆరంభం కలిగి ఉన్నప్పటికీ.. ఆ తర్వాత బలంగా పుంజుకున్నారు. వరుస సెట్లలో విజయం సాధించి.. ఇండోనేషియా ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ను సొంతం చేసుకున్నారు.
ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఏషియానెట్ న్యూస్తో మాట్లాడుతూ.. తన కోచింగ్ కెరీర్లో ఇది అత్యంత సంతృప్తికరమైన క్షణాలలో ఒకటి అని చెప్పారు. ఇది గెలుపు కంటే.. అద్భుతమని పేర్కొన్నారు. భారత ఆటగాళ్లు టోర్నమెంట్లో ఆడిన విధానం చాలా అద్భుతంగా ఉందని అన్నారు. ప్రపంచ నెంబర్ 1 జోడీని అంత సులభంగా ఓడించడం భారత బ్యాడ్మింటన్కు శుభసూచకమని అన్నారు. ‘‘మా టీమ్ అందరికి అభినందనలు’’ అని పుల్లెల గోపిచంద్ పేర్కొన్నారు.
ఇక, అంతకుముందు ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 టోర్నమెంట్ సెమీ-ఫైనల్స్ల సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడి దక్షిణ కొరియాకు చెందిన కాంగ్ మిన్ హ్యూక్- సియో సెయుంగ్ జేపై 17-21, 21-19, 21-18తో విజయం సాధించారు.
