Pullela Gopichand interview: భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ మన క్రీడాకారుల భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేశారు. క్రీడల విషయంలో ప్రభుత్వ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపారు.

Pullela Gopichand interview: భారత దిగ్గజ బ్యాడ్మింటన్ కోచ్, మాజీ ఆటగాడు పుల్లెల గోపీచంద్ భారత క్రీడా ప్రపంచంలోని చేదు నిజాల‌ను బయటపెట్టారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఒక ఆటగాడి తల్లిదండ్రులు ఆర్థికంగా బలంగా లేకుంటే, వారు క్రీడలను కెరీర్‌గా కొనసాగించడం కష్టమవుతుందని అన్నారు. అంటే క్రీడ‌లంటేనే డ‌బ్బుల‌తో ప‌ని అనే విధంగా ఆయ‌న చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

దీంతో మ‌రోసారి ఆయ‌న త‌న వ్యాఖ్య‌ల‌ను తప్పుగా అర్థం చేసుకున్నారని గోపీచంద్ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. నేను చెప్పాలనుకున్నది పూర్తిగా వ్యక్తపరచలేము. ఒక వార్తాపత్రికలో అనేక స్థాయిలలో ఎడిటింగ్స్ ఉంటాయి. దీంతో మనం చెప్పిన విషయం కొన్ని సార్లు మరోలా అనిపించేలా వస్తుందని అన్నారు. 

క్రీడాకారుల కోసం భద్రత

51 ఏళ్ల పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ.. ఎవరినీ నిరుత్సాహపరచాలని అనుకోలేదు. క్రీడల్లో కెరీర్ అంత సులువు కాదని చెప్పాలనుకున్నా. ఏటా ఎంతోమంది కష్టపడతారు. కానీ కొందరే సక్సెస్ అవుతారు. అయితే, జాతీయ ఛాంపియన్లు, ఆసియా గేమ్స్ విజేతలకు కూడా ఉద్యోగాలు ఉండట్లేదని అన్నారు. నేను కూడా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. ఎంతోమంది కష్టపడి పైకి వచ్చినవాళ్లను చూశాను. టాప్ పొజిషన్ కు రానివాళ్ల పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నను లేవనెత్తారు. 

ఉద్యోగాలు లేకపోతే ఎలా?

క్రీడల్లో కెరీర్ అంటే ఈజీ కాదు. ఎంతోమంది తమ కలల కోసం అన్నీ వదులుకుంటారు. కానీ కొందరే సక్సెస్ అవుతారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించినా ప్రభుత్వ ఉద్యోగాలు, ఆర్థిక సహాయం లేకపోతే వాళ్ల పరిస్థితి ఏంటి? క్రీడాకారులకు భద్రత కల్పించాలి. అప్పుడే భయం లేకుండా కెరీర్ ను ఎంచుకుంటారు. లేదంటే ముందు తరాలు ఈ రంగంవైపు రారని పుల్లెల గోపీచంద్ చెప్పారు. 

క్రీడా విధానంలో మార్పులు

భారత క్రీడా వ్యవస్థ క్రీడాకారులకు సపోర్ట్ చేయడం లేదా అని అడిగితే.. వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపారు గోపీచంద్. అధికారుల ఆలోచనలు ఒలింపిక్స్ వరకే పరిమితం అవుతున్నాయి. దూర దృష్టితో ఆలోచించాలి. అప్పుడే క్రీడాకారులకు మంచి కెరీర్ ఆప్షన్స్ ఉంటాయని గోపీచంద్ చెప్పారు. 50 ఏళ్ల వయసులో ఒక క్రీడాకారుడు తాను ఒలింపియన్ అని పిల్లలకు చెప్పుకుంటే.. ఎవరూ గుర్తుపట్టకపోతే అది చాలా బాధాకరమైన పరిస్థితి అని అన్నారు.

భారతదేశంలో క్రీడల భవిష్యత్తు

2001లో ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్ షిప్ గెలిచిన గోపీచంద్.. సైనా నెహ్వాల్, పీవీ సింధు లాంటి వాళ్లకు కోచింగ్ ఇచ్చి ఒలింపిక్ మెడల్స్ వచ్చేలా చేశారు. ఇప్పుడు భారత క్రీడా వ్యవస్థలో మార్పులు రావాలని కోరుకుంటున్నారు. క్రీడాకారుల కోసం ఒక భద్రతను ఏర్పాటు చేయాలని ఆయన కోరుకుంటున్నారు.

Champions Trophy: ఆస్ట్రేలియా vs సౌతాఫ్రికా మ్యాచ్ వర్షార్పణం.. ఇంగ్లాండ్‌కు గుడ్ న్యూస్