రో'హిట్': ఇంగ్లాండును చిత్తు చేసిన భారత్, సిరీస్ వశం
రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీతో ఇంగ్లాండుపై భారత్ చివరిదీ మూడోది అయిన ట్వంటీ20 మ్యాచులో విజయం సాధించింది. దీంతో భారత్ ఇంగ్లాండు పర్యటనలో శుభారంభం చేసింది. హార్డిక్ పాండ్యా సత్తా చాటాడు.
బ్రిస్టల్: రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీతో ఇంగ్లాండుపై భారత్ చివరిదీ మూడోది అయిన ట్వంటీ20 మ్యాచులో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచుల ట్వంటీ20 సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. దీంతో ఇంగ్లాండు పర్యటనలో శుభారంభం చేసింది. టీ20లో భారత్ కు ఇది వరుసగా ఆరో సిరీస్ విజయం.
ఇంగ్లాండు తమ ముందు ఉంచి 199 భారీ లక్ష్యాన్ని భారత్ 8 బంతులు ఉండగానే ఛేదించింది. దాంతో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. రోహిత్ శర్మ 56 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సులతో సెంచరీ చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 3 బంతులు మాత్రమే ఆడి అవుటైనప్పటికీ రోహిత్ శర్మ తన దూకుడును తగ్గించలేదు. కెఎల్ రాహుల్ (10 బంతుల్లో 19 పరుగులు) త్వరగా అవుటైనప్పటికీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (29 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్స్ లతో 43 పరుగులు), హార్దిక్ పాండ్యా (14 బంతుల్లో నాలుగు ఫోర్లు, 2 సిక్స్ లతో 33 పరుగులు) భారత్ ను విజయతీరాలకు చేర్చడంలో రోహిత్ శర్మకు సహకరించారు. రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కాయి.
టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్ ఓపెనర్లు జాసన్ రాయ్, బట్లర్ దాటిగా ఇన్సింగ్సును ప్రారంభించారు. దీంతో ఇంగ్లాండు స్కోరు స్కోర్ 7 ఓవర్లలోనే 82 పరుగులకు చేరింది. 8 ఓవర్లో సిదార్థ్ కౌల్ బట్లర్(34)ను అవుట్ చేయడంతో స్కోరు మందగించింది. ఆ తర్వాత 103 పరుగుల వద్ద జాసన్(67) వెనుదిరగడంతో పరుగులు రాబట్టడం ఇంగ్లాండుకు కాస్తా కష్టంగా మారింది.
వికెట్లు పడుతున్నప్పటికీ హేల్స్ (30), బెయిర్స్టో(25), స్టోక్స్(14) పరుగులతో రాణించారు. దీంతో ఇంగ్లాండ్ 20 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్లు కొల్పోయి 198 పరుగులు చేసింది.
భారత బౌలర్లలో హార్ధిక్ పాండ్యా నాలుగు వికెట్లు, కౌల్ రెండు వికెట్లు తీయగా, దీపక్ చాహర్, ఉమేశ్ యాదవ్లకు చెరో వికెటు దక్కింది.