రెండో వన్డే: భారత్ ను చిత్తు చేసిన ఇంగ్లాండు
మూడు మ్యాచులో సిరీస్ లో భాగంగా శనివారం రెండో వన్డేలో ఇంగ్లాండు భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. లార్డ్స్ మైదానంలో జో రూట్ సెంచరీతో చెలరేగి ఆడాడు.
లండన్: మూడు వన్డేల సిరీస్లో భాగంగా లార్డ్స్ మైదానంలో శనివారం ఇంగ్లాండుపై జరిగిన జరిగిన రెండో వన్డేలో భారత్ చిత్తుగా ఓడింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 323 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించడంలో భారత బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. ఇంగ్లాండు నిర్దేశించిన 323 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ప్రారంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది.
రోహిత్ శర్మ(15) స్వల్పస్కోర్కే మార్క్ వుడ్ వేసిన 9వ ఓవర్ రెండో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లో మరో ఓపెనర్ శిఖర్ ధావన్(36) భారీ షాట్కు ప్రయత్నించి స్టోక్స్కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత ప్లంకెట్ వేసిన 11వ ఓవర్లో కేఎల్ రాహుల్(0) డకౌట్ అయ్యాడు.
ఈ దశలో విరాట్ కోహ్లీ, రైనాల జోడీ జట్టును ఆదుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. నాలుగో వికెట్కి వీరిద్దరు కలిసి 80 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే మొయిన్ అలీ వేసిన 27వ ఓవర్ చివరి బంతికి కోహ్లీ(45) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు ఆ తర్వాత కొంత సమయానికే అదిల్ రషీద్ వేసిన 31వ ఓవర్ తొలి బంతికి రైనా(46) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఈ దశలో హార్థిక్, ధోనీలు ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం కూడా ఫలించలేదు.. కానీ ప్లంకెట్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి హార్థిక్ పాండ్యా(21) క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆ వెంటనే ఉమేశ్ యాదవ్ పరుగులు చేయకుండానే పెవిలియన్ చేరుకున్నాడు.
ధోనీ ప్లంకెట్ వేసిన 47వ ఓవర్ తొలి బంతికి ధోనీ భారీ షాట్కు ప్రయత్నించి బట్లర్కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ధోనీ 37 పరుగులు చేశాడు. భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. దాంతో ఇంగ్లాండ్ 86 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ను 1-1 తేడాతో సమం చేసింది.
ఇంగ్లాండ్ బౌలింగ్లో ప్లంకెట్ 4, రషీద్, విల్లీ చెరి రెండు, అలీ, వుడ్ 1 వికెట్ తీశారు. మూడో వన్డే మంగళవారం హెడ్డింగ్లేలో జరుగనుంది. ఈ మూడో వన్డేపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
అంతకు ముందు ఇంగ్లాండు భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. లార్డ్స్ మైదానంలో జో రూట్ సెంచరీతో చెలరేగి ఆడాడు. దీంతో ఇంగ్లాండు 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది.
టాస్ గెలిచిన ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ ఓపెనర్లు జాసన్ రాయ్, బెయిర్ స్టోలు ఆరంభం నుంచే దాటిగా ఆడారు. దీంతో 10 ఓవర్లలోనే 68 పరుగులకు చేశారు. దీంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి చైనామన్ కుల్దీప్ చేతికి బంతి ఇచ్చాడు.
కుల్దీప్ తన మొదటి ఓవర్ రెండో బంతికే బెయిర్ స్టో(38)ను ఎల్బీడబ్య్లూ రూపంలో ఔట్ చేశాడు. దాంతో ఇంగ్లాండ్ 69 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన జో రూట్తో కలిసి జాసన్ రాయ్ స్కోరు పెంచే ప్రయత్నం చేశాడు. కుల్దీప్ స్పిన్ మాయకు జాసన్ రాయ్ బలయ్యాడు.
జో రూట్ కెప్టెన్ మోర్గాన్తో కలిసి స్కోర్ బోర్టును ఉరకలు వేయించారు. మోర్గాన్, జో రూట్లు అప్ సెంచరీలు నమోదు చేశారు. కుల్దీప్ వేసిన బంతిని 30.3 ఓవర్లో మోర్గాన్ సిక్స్ కొట్టడానికి ప్రయత్నించి ధావన్ చేతికి చిక్కాడు. దీంతో ఇంగ్లాండ్ 189 పరుగుల వద్ద మోర్గాన్ వికెట్ను కోల్పోయింది.
అనంతరం క్రీజ్లోకి వచ్చిన బెన్ స్టోక్స్(5), జాస్ బట్లర్(4), మొయిన్ ఆలీ(13) వరుసగా పెవిలియన్ కు చేరుకున్నారు. 239 పరుగులకు ఇంగ్లండ్ ఆరు వికెట్లు కోల్పోయింది.
జో రూట్, డేవిడ్ జోడీ ఆ తర్వాత టీమిండియా బౌలర్లపై విరుచుకుపడ్డారు. జో రూట్ 109 బంతుల్లో సెంచరీ చేశాడు. డేవిడ్ సిద్ధార్ కౌల్ వేసిన 46వ ఓవర్లో వరుసగా 4, 6, 4 కొట్టి భారీ స్కోరు రాబట్టాడు. జో రూట్(8ఫోర్లు, సిక్స్) 116 బంతుల్లో 113 పరుగులు చేశాడు.
డేవిడ్ 31 బంతుల్లో(5ఫోర్లు, సిక్స్) అఫ్ సెంచరీ నమోదు చేశాడు. టీమిండియో బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3వికెట్లు, ఉమేష్ యాదవ్, హర్ధిక్ పాండ్యా, చాహల్లకు చేరో వికెట్ దక్కాయి.