తమ భార్యలను లేదా ప్రియురాళ్లను వెంట తీసుకెళ్లేందుకు బీసీసీఐ అనుమతించినట్లు వస్తున్న వార్తలను పాలకుల కమిటీ సభ్యురాలు డయానా ఎదుల్జీ ఖండించారు.

టీం ఇండియా క్రికెటర్లు..విదేశీ పర్యటనలకు తమ భార్యలను లేదా ప్రియురాళ్లను వెంట తీసుకెళ్లేందుకు బీసీసీఐ అనుమతించినట్లు వస్తున్న వార్తలను పాలకుల కమిటీ సభ్యురాలు డయానా ఎదుల్జీ ఖండించారు. ఈ విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని వివరించారు. విదేశీ పర్యటనలకు తమ భాగస్వాములను తీసుకెళ్లే అంశంపై మరిన్ని అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై స్పష్టత వచ్చేందుకు మరింత సమయం పట్టే అవకాశముందని ఓ వార్తా సంస్థతో పేర్కొన్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ప్రస్తుతం విదేశీ పర్యటనల్లో తమ భాగస్వాములు తమతో కేవలం రెండు వారాలు మాత్రమే ఉంటున్నారని, ఈ సమయం పెంచాలని కొహ్లీ బీసీసీఐని అభ్యర్థించిన విషయం తెలిసిందే. అతడి అభ్యర్థనపై స్పందించిన బీసీసీఐ విధానాన్ని మార్చిందని... మొదటి పది రోజులు మినహా పర్యటన పూర్తయ్యే వరకు క్రికెటర్ల భార్యలను వారితో ఉండనివ్వాలని నిర్ణయించినట్లు బుధవారం వార్తలు వచ్చాయి. భార్యలు ఉంటే జట్టులో సానుకూల వాతావరణం ఏర్పడుతుందని పరిపాలకుల కమిటీ అభిప్రాయపడినట్లు సోషల్‌మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన పాలకుల కమిటీ సభ్యురాలు, మహిళా క్రికెట్‌ జట్టు మాజీ సారథి డయానా ఎదుల్జీ.. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టత ఇచ్చారు.