చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా పారా గేమ్స్ 2023లో పురుషుల SL3 విభాగంలో భారత పారా-షట్లర్ ప్రమోద్ భగత్ 22-20, 18-21, 21-19తో స్వదేశానికి చెందిన నితీష్ కుమార్‌ను ఓడించి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

హాంగ్‌జౌ : చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన క్రీడా ప్రదర్శనలో పారా-షట్లర్ ప్రమోద్ భగత్ భారతదేశానికి 21వ బంగారు పతకాన్ని అందించాడు. ఆసియా పారా గేమ్స్ 2023లో భారత్ గోల్డ్ రష్ శుక్రవారం కూడా కొనసాగింది. పురుషుల ఎస్‌ఎల్‌3 విభాగంలో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో భగత్ 22-20, 18-21, 21-19 స్కోరుతో తన సహచరుడు నితేశ్‌కుమార్‌ను ఓడించి స్వర్ణం ఖాయం చేసుకున్నాడు. నితేష్ కుమార్ కూడా ఎంతో ప్రతిభావంతంగా ఆడి.. తన ఆటతీరుతో రజత పతకం సాధించాడు. 

శుక్రవారం తెల్లవారుజామున, పురుషుల 1500 మీటర్ల T38 ఈవెంట్‌లో పారా అథ్లెట్ రామన్ శర్మ 4:20.80 నిమిషాల్లో ఫైనల్ రేసును పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని సాధించి కొత్త ఆసియా, గేమ్స్ రికార్డు సృష్టించాడు. ఆర్చర్ శీతల్ దేవి కూడా మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్ ఈవెంట్‌లో సింగపూర్‌కు చెందిన అలిమ్ నూర్ సయాహిదాను 144-142 తేడాతో ఓడించి క్రీడా ఈవెంట్‌లో తన మూడవ బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.

ఆ ఒలింపిక్స్‌ నిర్వహించేందుకు భారత్ సిద్దమే.. ప్రధాని మోడీ కీలక ప్రకటన..

గురువారం, భారతీయ పారా-అథ్లెట్లు ఆసియా పారా గేమ్స్‌లో దేశం తరఫున అత్యధిక పతకాలను నమోదు చేసి చరిత్ర సృష్టించారు. 2018 ఎడిషన్ పారా గేమ్స్ లో 72 పతకాలతో అగ్రస్థానంలో ఉన్నారు. ఇప్పుడు 2023 ఎడిషన్‌లో.. చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన షోపీస్ ఈవెంట్‌లో భారత్ ఇప్పటివరకు 80కి పైగా పతకాలను కైవసం చేసుకుంది.

దీనిమీద ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. "ఆసియా పారా గేమ్స్‌లో భారత్ అద్భుతంగా రాణిస్తోంది. 73 పతకాలను కైవసం చేసుకుని ముందుకు దూసుకుపోతోంది. జకార్తా 2018 ఆసియా పారా గేమ్స్‌లో 72 పతకాలతో ఉన్న మునుపటి రికార్డును బద్దలు కొట్టింది. ఈ అపూర్వ సందర్భం మన అథ్లెట్ల దృఢ సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రతి భారతీయుడి హృదయం ఆనందించేలా చేసి.. చరిత్రలో తమ పేర్లను చిరస్థాయిగా నిలిపారు మన అసాధారణమైన పారా అథ్లెట్లు. వారి నిబద్ధత, పట్టుదల, రాణించాలన్న అచంచలమైన తపన నిజంగా స్ఫూర్తిదాయకం. ఈ మైలురాయి సాధన భవిష్యత్ తరాలకు మార్గనిర్దేశం చేసి, స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది’’.. అని ఈ రికార్డు బద్దలు కొట్టిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. 

Scroll to load tweet…