ఆసియాకప్ షెడ్యూల్పై బీసీసీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. మాకు తీరిక లేకుండా చేసి.. పాకిస్తాన్కు మాత్రం రెండు రోజుల గ్యాప్ ఇవ్వడంతో షెడ్యూల్ బాలేదని బీసీసీఐ వాదిస్తోంది
అబుదాబి, దుబాయ్ వేదికలుగా జరిగే ఆసియాకప్-2018 షెడ్యూల్ను అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించిన సంగతి తెలిసిందే. అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తోన్న భారత్-పాక్ మ్యాచ్కు కూడా ఆసియాకప్ వేదికవ్వడంతో ఇరు దేశాల క్రికెట్ అభిమానులు సంబరపడిపోతున్నారు. అయితే ఆసియాకప్ షెడ్యూల్పై బీసీసీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది.
టోర్నీలో భాగంగా గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, ఓ క్వాలిఫయిర్ జట్టు ఉంటుంది.. గ్రూప్-బిలో బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్లు ఉన్నాయి. సెప్టెంబర్ 18న క్వాలిఫయిర్ జట్టుతో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది.. ఆ తర్వాతి రోజే సెప్టెంబర్ 19న చిరకాల ప్రత్యర్థి పాక్తో భారత్ ఆడాల్సి ఉంటుంది.. ఇదే సమయంలో 16వ తేదీన క్వాలిఫయిర్ జట్టుతో పాక్ ఆడుతుంది.. అనంతరం రెండు రోజుల విరామం తర్వాత 19వ తేదీన భారత్తో తలపడుతుంది.
మాకు తీరిక లేకుండా చేసి.. పాకిస్తాన్కు మాత్రం రెండు రోజుల గ్యాప్ ఇవ్వడంతో షెడ్యూల్ బాలేదని బీసీసీఐ వాదిస్తోంది. పాక్తో జరిగే మ్యాచ్ కోసం సన్నద్ధమవ్వడానికి.. ఆ మ్యాచ్ను రీ-షెడ్యూల్ చేయాలని ఐసీసీని బీసీసీఐ కోరింది.
