‘ఆయన తర్వాత నేనే ఫేమస్’
ఐపీఎల్ సంచలనం రషీద్ ఖాన్
ఐపీఎల్ లో సంచలనం సృష్టించిన 19ఏళ్ల కుర్రాడు రషీద్ ఖాన్. సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఐపీఎల్ బరిలోకి దిగిన రషీద్.. తన ఆటతో అందరినీ మెస్మరైజ్ చేసేసాడు. అతని ఆటకు దాసోహం కానివారు లేరు. ఏకంగా రషీద్ కి భారతీయ పౌరసత్వం ఇవ్వమని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ని కూడా కోరారు. అంతటి అభిమానాన్ని రషీద్ సొంతం చేసుకున్నాడు.
రషీద్ ప్రపంచంలోనే బెస్ట్ టీ20 బౌలర్ అంటూ సచిన్ ట్వీట్ చేశాడు. ‘ఒక ఫ్రెండ్ నాకు ఆ ట్వీట్ స్క్రీన్షాట్ చూపించాడు. ఏమని రిప్లయ్ ఇవ్వాలా అని దాదాపు రెండు గంటలు ఆలోచించా. చివరకు బదులిచ్చా’నని రషీద్ తెలిపాడు. సచిన్ లాంటి గొప్ప ఆటగాడి ప్రశంసలు యువ ఆటగాళ్లకు స్ఫూర్తినిస్తాయని చెప్పాడు.
‘‘నాకు తెలిసి అప్ఘానిస్థాన్ ప్రజలంతా ఆ ట్వీట్ చూసి ఉంటారు. సచిన్ మా దగ్గర చాలా ఫేమస్. అలాంటి గొప్ప ఆటగాడు నన్నలా ప్రశంసించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింద’’ని 19 ఏళ్ల రషీద్ చెప్పాడు.
భారత్లో టాప్ క్రికెటర్ల తరహాలోనే అప్ఘాన్లో నువ్వు కూడా గొప్ప క్రికెటర్ హోదాను ఎంజాయ్ చేస్తున్నావా అని ప్రశ్నించగా.. ‘నాకు తెలిసినంత వరకు మా దేశంలో అధ్యక్షుడి తర్వాత నేనే అత్యంత పాపులారిటీ పొందిన వ్యక్తిని కావచ్చ’ని సిగ్గుపడుతూ బదులిచ్చాడు. భారత గడ్డ మీద భారత్తో టెస్టు మ్యాచ్ ఆడనుండటం ఆనందంగా ఉందని రషీద్ చెప్పాడు.