’జడేజాని ఓ గుద్దు గుద్దాను.. వామ్మో తనతో ఎక్కడికి వెళ్లకూడదు‘
రెండు పులుల స్టోరీ పై రోహిత్, రహానే
టీం ఇండియా క్రికెటర్ రవీంద్ర జడేజాతో కలిసి ఎప్పుడూ ఎక్కడికీ వెళ్లకూడదు అంటున్నారు రోహిత్ శర్మ, రహానే. అతనితో కలిసి బయటకు వెళ్లాలంటే.. వీళ్లు బయపడిపోతున్నారు. అంతలా జడేజా వాళ్లని బయపెట్టేశాడు.
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే... తాజాగా రోహిత్ శర్మ, రహానే ఇద్దరూ కలిసి "వాట్ ద డక్" అనే చాట్ ప్రోగ్రామ్లో పాల్గొన్నారు. జడేజాతో వారిద్దరికీ కలిగిన ఓ అనుభవాన్ని ఈ సందర్భంగా పంచుకున్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా దక్షిణాఫ్రికాతో మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ఆడేందుకు గాను సఫారీ గడ్డపై అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సిరిస్లో మ్యాచ్లకు మధ్యలో కాస్త విరామం లభించడంతో రోహిత్ శర్మ-రితిక, రహానే-రాధిక, జడేజా కలిసి జంగిల్ సఫారీకి వెళ్లారు.
ఆ సమయంలో చోటు చేసుకున్న ఓ సన్నివేశాన్ని రోహిత్ శర్మ, రహానే ఈ సందర్భంగా వెల్లడించారు. ‘అందరం కలిసి ఆ అడవిలో సరదాగా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాయో రెండు చిరుతలు అటువైపు వచ్చాయి. ఆ రెండు చిరుతలు మాకు చాలా సమీపంగా వచ్చాయి' అని అన్నాడు.
'వెంటనే, మేమంతా షాక్కు గురై వాటినే చూస్తూ ఉన్నాం. ఇంతలో జడేజా ఏదో శబ్దం చేస్తూ వాటిని పిలవడం మొదలుపెట్టాడు. ఇంకేముందు ఆ రెండు చిరుతలు వెనక్కి తిరిగి మమ్ముల్ని చూశాయి. దేవుడా అయిపోయాం అని అనుకున్నాం. జడేజాపై అందరికీ చాలా కోపం వచ్చింది. ‘ఏం చేస్తున్నావు? మనం అడవిలో ఉన్నాం. అవి మనల్ని చూస్తే.. వాటికి ఆహారం అయిపోతాం' అని రోహిత్ శర్మ అప్పటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు.
అంతేకాదు.. కోపంతో జడేజాను ఓ గుద్దు గుద్దినట్లు ఆయన తెలిపారు. అందుకే అప్పటి నుంచి జడేజాతో బయటకు వెళ్లకూడదని నిశ్చయించుకున్నట్లు వివరించారు.