Asianet News TeluguAsianet News Telugu

యమ ధర్మరాజ దశమి

నచికేతుని కథ కఠోపనిషత్తులో కనిపిస్తుంది. పూర్వం గౌతముని వంశానికి చెందిన `వాజశ్రవసుడు`  అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. అతను ఒకసారి విశ్వజిత్‌ అనే యాగాన్ని సంకల్పించాడు. అప్పటికే జ్ఞానిగా పేరు పొందినవాడు కాబట్టి, వాజశ్రవసుని యాగం గురించి వినగానే జనం తండోపతాండాలుగా వచ్చారు. యాగం అద్భుతంగా సాగి, నిరాటంకంగా ముగిసింది.

Yama Dharma Raja Dasami
Author
Hyderabad, First Published Apr 3, 2020, 11:21 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Yama Dharma Raja Dasami

ధర్మరాజ దశమి లేదా యమ ధర్మరాజ దశమి మరణానికి హిందూ దేవుడు అయిన యమ భగవానుడికి అంకితం చేయబడింది.  యమధర్మరాజు అని కూడా పిలువబడే యమకు అంకితం చేసిన పూజ ఆ రోజు జరుగుతుంది. ఈ వ్రతాన్ని 10 వ రోజు చైత్ర మాసం శుక్ల పక్షంలో పాటిస్తారు. ప్రాథమికంగా రోజున చేసే పూజలు భక్తుడి నుండి మరణ భయాన్ని తొలగించడంపై దృష్టి పెడతాయి. మరణం యొక్క రహస్యం గురించి తెలుసుకోవడానికి యమ నివాసానికి వెళ్ళిన కథ ఉపనిషత్తులోని యువ నాచికేతుల కథ వినడం ఆనందంగా ఉంటుంది.

మరణాన్ని జయించిన నచికేతుడు :- ఉపనిషత్తులకు వేదాంతాలు అని పేరు. ఆధ్మాత్మిక జ్ఞానంలోని లోతును `వేదాంతం` అని పిలుచుకునేంతగా ఉపనిషత్తులు భారతీయ తాత్విక చింతనను ప్రకటిస్తున్నాయి. ఉపనిషత్తులో అక్కడక్కడా కొన్ని కథలు కనిపించినా వాటిలో సత్యకామజాబాలి, నచికేతుడి కథలకి చాలా ప్రాముఖ్యత ఉంది.  నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవడమే జ్ఞాని లక్షణం అని సత్యకామజాబాలి చెబితే, అన్న మాటకు కట్టుబడాలి అని నచికేతుని కథ ప్రస్ఫుటం చేస్తుంది.
 
నచికేతుని కథ కఠోపనిషత్తులో కనిపిస్తుంది. పూర్వం గౌతముని వంశానికి చెందిన `వాజశ్రవసుడు`  అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. అతను ఒకసారి విశ్వజిత్‌ అనే యాగాన్ని సంకల్పించాడు. అప్పటికే జ్ఞానిగా పేరు పొందినవాడు కాబట్టి, వాజశ్రవసుని యాగం గురించి వినగానే జనం తండోపతాండాలుగా వచ్చారు. యాగం అద్భుతంగా సాగి, నిరాటంకంగా ముగిసింది. ఇక దాన కార్యక్రమాలు మొదలయ్యాయి. వాటిలో భాగంగా వాజశ్రవసుడు ఆరోగ్యంగానూ, దృఢంగానూ ఉన్న గోవులను తన వద్దనే ఉంచుకుని… వట్టిపోయిన ముసలి ఆవులనూ, అనారోగ్యంతో బలహీనంగా ఉన్నవాటినీ దానం చేయడం మొదలుపెట్టాడు. 

తండ్రి ప్రవర్తన చూసిన నచికేతునికి బాధ కలిగింది. దానం అంటూ చేస్తే అది అవతలివాడికి ఉపయోగపడేదిగా ఉండాలే కానీ, తన దగ్గర ఉన్నవాటిని వదిలించుకునేవిగా ఉండకూడదు కదా అన్న సందేహం మొదలైంది. పైగా బాల్యచాపల్యంతో తండ్రి దగ్గరకు వెళ్లి `ఇలా నీకు పనికిరానివాటన్నింటినీ దానం చేస్తున్నావు సరే! ఇంతకీ నన్నెవరికి దానం చేస్తావు?` అని అడగడం మొదలుపెట్టాడు. పిల్లవాడు అదే ప్రశ్నను మాటిమాటికీ అడగడంతో తండ్రికి చిర్రెత్తుకొచ్చింది, `నిన్ను ఆ యముడికి దానం చేస్తున్నాను పొమ్మ`న్నాడు.
 
తండ్రి నోట్లోంచి అలాంటి మాట వినిపించగానే నచికేతుడు నిశ్చష్టుడయ్యాడు. తొందరపడి తాను అన్నమాటకు తండ్రి కూడా పశ్చాత్తాపపడ్డాడు. `ఏదో పొరపాటున అనేశాను. ఊరుకో`  అన్నాడు తండ్రి. కానీ నచికేతుడు ఊరుకోలేదు. పవిత్రమైన యజ్ఞసమయంలో, అందులోనూ దానం జరుగుతున్న సందర్భంలో తండ్రి నుంచి అలాంటి మాట వచ్చిందంటే దానిని నెరవేర్చి తీరాలనుకున్నాడు నచికేతుడు. `పొరపాటున అనేశాను` అని తండ్రి ఎంతగా వారిస్తున్నా వినకుండా ఆ యయునికి తనను తాను అర్పించుకునేందుకు బయల్దేరాడు. యమలోకంలో నచికేతునికి యముని దర్శనం అంత త్వరగా లభించలేదు. జీవకోటి పాపపుణ్యాలను బేరీజు వేస్తూ, సమయం వచ్చినప్పడు వారి ప్రాణాలను హరిస్తున్న యముడి తలమునకలుగా ఉన్నాడు. ఎప్పుడో మూడు రోజుల తరువాత నచికేతుని గమనించాడు యముడు.

ముక్కుపచ్చలారని పసిపిల్లవాడికి యమలోకంలో పనేంటి? ఇంటికి ఫో!` అన్నాడు యముడు. కానీ నచికేతుడు అదరకుండా బెదరకుండా, జరిగినదంతా చెప్పి తనను దానంగా స్వీకరించమని యముడిని ప్రార్థించాడు. `ఏదో తొందరపాటుగా అన్నంతమాత్రాన నీ ఆయువు తీరకముందే నిన్ను స్వీకరించడం భావ్యం కాదు. నిన్ను నేను స్వీకరించలేను. పైగా నువ్వు నా ద్వారం ముందర మూడు రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా గడిపావు కాబట్టి, నేనే నీకు మూడు వరాలను ఇస్తాను తీసుకో!` అన్నాడు యముడు, నచికేతుని సత్యనిష్ఠకు ముచ్చటపడి.
 
నువ్వు నన్ను దానంగా స్వీకరించలేదు కాబట్టి నా తండ్రి నా మీద కోపగించుకోకుండా, నన్ను సంతోషంగా తిరిగి స్వీకరించాలి. అదే నా తొలి కోరిక` అన్నాడు  నచికేతుడు. దానికి యముడు `తథాస్తు` అన్నాడు. ఇక రెండవ కోరికగా `ఎవరైనా సరే స్వర్గాన్ని చేరుకునేలా ఒక యజ్ఞాన్ని అనుగ్రహించమ`న్నాడు నచికేతుడు. ఇందులో స్వర్గం అన్న మాటకు ఒక గూఢార్థం ఉంది- `స్వర్గలోకే న భయం కించనాస్తి` అంటాడు నచికేతుడు, అంటే నిర్భయమైన స్థితిని ఇక్కడ నచికేతుడు స్వర్గంగా సూచిస్తున్నాడు. దాంతో యముడు `నాచికేత యజ్ఞం` పేరుతో ఒక యజ్ఞాన్ని ఉపదేశిస్తాడు. ఇక మూడవ కోరికగా `చనిపోయిన తరువాత మనిషి ఏమవుతాడు?` అని అడుగుతాడు నచికేతుడు. 

తనంతటివాడు ప్రత్యక్షమై కావల్సిన కోరికలు కోరుకోమంటే `నా తండ్రి నన్ను అభిమానించాలి, భయాన్ని జయించే స్వర్గం కావాలి, మరణ రహస్యం తెలియాలి` అంటూ ఈ పిల్లవాడు పారమార్థిక కోరికలను కోరడం యముడికి సైతం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అందుకే `నువ్వు చిన్నపిల్లవాడివి. అవన్నీ నీకు చెప్పినా అర్థం కావు. ఈ జననమరణాల గురించి దేవతలకే బోలెడు అనుమానాలున్నాయి. వేరే ఏదన్నా కోరుకో. నీకు ఏం కావాలన్నా వరమిస్తాను.` అని నచికేతునికి నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు యముడు. కానీ నచికేతుడు తన పట్టుని విడవలేదు. తనకి ఇస్తేగిస్తే ఆ మరణజ్ఞానాన్నే వరంగా ఇవ్వమని కోరుకున్నాడు.
 
నచికేతుని పట్టుదల, తృష్ణ చూసిన యముడికి ముచ్చట వేసింది. `సరే చెబుతా విను. మీ మానవులు గుడ్డివాళ్లని అనుసరించే గుడ్డివాళ్లలాగా, అన్నీ భౌతిక సుఖాలలోనే ఉన్నాయనే భ్రమలో ఉంటారు. తమ కోరికలను చంపుకోలేక, పునరావృతమవుతున్న ఆ కోరికలను పూర్తిగా తీర్చుకోనూలేక మళ్లీ మళ్లీ భూలోకంలో జన్మిస్తూనే ఉంటారు. నిజానికి ఈ లోకంలో శాశ్వతమైనది ఒక్క ఆత్మ ఒక్కటే! దానిని అశాశ్వతమైనవాటితో ఎలా పొందగలరు?....  అంటూ ఆత్మతత్వం గురించి సుదీర్ఘంగా వివరిస్తాడు యమధర్మరాజు. ఆ మాటలకు సంతృప్తి చెందిన నచికేతుడు తన ఇంటికి సంతోషంగా తిరుగుముఖం పడతాడు.
 
ఆత్మజ్ఞానం గురించి యముడికీ, నచికేతునికీ జరిగిన సంభాషణే కఠోపనిషత్తులో ముఖ్యభాగం వహిస్తుంది. నిజానికి ఈ ఉపనిషత్తు మరో భగవద్గీతను తలపిస్తుంది. అందుకే వివేకానంద వంటి జ్ఞానులకి కఠోపనిషత్తు అంటే ఎంతో ఇష్టం. `నచికేతుడు వంటి దృఢమైన విశ్వాసం ఉన్న ఓ పదిపన్నెండు మంది పిల్లలు ఉంటే, ఈ దేశానికే ఒక కొత్త దిశను చూపించగలను` అంటారు వివేకానంద. అంతేకాదు ఆయన తరచూ స్మరించే `ఉత్తిష్ఠత జాగ్రత`( లేవండి, మేలుకోండి ) అన్న మాటలు కూడా కఠోపనిషత్తులోనివే.

Follow Us:
Download App:
  • android
  • ios