Asianet News TeluguAsianet News Telugu

బతుకమ్మ పండుగలో రోజుకొక్కో రకమైన ప్రత్యేక నైవేద్యం

ఈ సంవత్సరం అధిక ఆశ్వీయుజ మాసం రావడం వలన ఈ పండగను నిజ ఆశ్వీయుజ మాసం ప్రారంభంతో జరుపుకుంటారు. 16 అక్టోబర్ 2020శుక్రవారం, అమావాస్య రోజు  ఎంగిలి పువ్వు బతుకమ్మని పేరుస్తారు. అమావాస్య నుండి 24 అక్టోబర్ శనివారం రోజు సద్దుల బతుకమ్మని "దుర్గాష్టమి" మహర్నవమిగా వేడుక చేసుకుంటారు

Prasadam of Bathukamma Festival
Author
Hyderabad, First Published Oct 16, 2020, 1:46 PM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Prasadam of Bathukamma Festival

తెలంగాణలో బతుకమ్మ పండుగకు  ప్రసిద్ధమైంది. అమావాస్య నాడు ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు ఆశ్వయుజ అష్టమితో ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజులలో ఆడపడుచులు రోజుకో రూపంలో బతుకమ్మను కొలుస్తారు. బతుకమ్మ అనే మాట వినగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది పూలు, నైవేద్యాలు. తొమ్మిది రోజులు జరుపుకునే ఈ పండుగ వేడుకలో ఒక్క రోజు మినహా మిగిలిన ఎనిమిది రోజులు ఒక్కోక రకమైన నైవేద్యం సమర్పిస్తారు. తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపువ్వు బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు.

ఈ సంవత్సరం అధిక ఆశ్వీయుజ మాసం రావడం వలన ఈ పండగను నిజ ఆశ్వీయుజ మాసం ప్రారంభంతో జరుపుకుంటారు. 16 అక్టోబర్ 2020శుక్రవారం, అమావాస్య రోజు  ఎంగిలి పువ్వు బతుకమ్మని పేరుస్తారు. అమావాస్య నుండి 24 అక్టోబర్ శనివారం రోజు సద్దుల బతుకమ్మని "దుర్గాష్టమి" మహర్నవమిగా వేడుక చేసుకుంటారు. ఈ బతుకమ్మ పండగ ప్రాంతాల వారిగా భిన్న ఆచార వ్యవహారాలుగా కొనసాగుతుంది.

 16 అక్టోబర్ 2020శుక్రవారం, అమావాస్య రోజు ఎంగిలి పూల బతుకమ్మ - నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యంగా పెడతారు.
 17 అక్టోబర్ 2020 శనివారం రోజు అటుకుల బతుకమ్మ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు చేస్తారు. ( దేవి శరన్నవరాత్రులు ప్రారంభం )  సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.

 18 అక్టోబర్ 2020 ఆదివారం రోజు ముద్దపప్పు బతుకమ్మ : ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి నివేదిస్తారు.

 19 అక్టోబర్ 2020 సోమవారం రోజు నానే బియ్యం బతుకమ్మ : నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా నివేదించాలి.

 20 అక్టోబర్ 2020 మంగళవారం రోజు అట్ల బతుకమ్మ : అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు.

 21 అక్టోబర్ 2020 బుధవారం రోజు అలిగిన బతుకమ్మ : ఈ రోజు నైవేద్యం సమర్పించరు.

 22 అక్టోబర్ 2020 గురువారం రోజు వేపకాయల బతుకమ్మ : బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లుగా తయారుచేసి నైవేద్యంగా సమర్పిస్తారు.

 23 అక్టోబర్ 2020 శుక్రవారం రోజు వెన్నముద్దల బతుకమ్మ : నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యంగా తయారుచేస్తారు.

 24 అక్టోబర్ 2020 శనివారం రోజు సద్దుల బతుకమ్మ :  ఆశ్వీయుజ అష్టమి రోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం అనే ఐదురకాల నైవేద్యాలు తయారు చేసి నైవేద్యంగా నివేదించాలి.

తొమ్మిది రోజులపాటు బతుకమ్మ పూజించిన మహిళలు చివరి రోజైన సద్దుల బతుకమ్మ నాడు చెరువులో నిమజ్జనం చేస్తారు. మేళతాళలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారిని గంగమ్మలో కలుపుతారు. పూలతో తయారు చేసిన బతుకమ్మపై పసుపుతో తయారు చేసిన గౌరవమ్మను మహిళలు తమ మంగళ సూత్రాలకు పూసుకుంటారు. దీనివల్ల తమ మాంగళ్యం అంటే తమ భర్తను ఆపదల నుంచి కాపాడి చల్లగా చూస్తుందని నమ్మకం. రొట్టె, బెల్లం లేదా చక్కెర కలిపి తయారు 'మలీద'ను అందరికీ పంచితే శుభం జరుగుతుంది.

మలిద లడ్డు తయారు చేయువిధానం:-

మలిద లడ్డు- కావాల్సిన పదార్థాలు.
గోధుమ పిండి ఒక కప్పు 
బెల్లం అర కప్పు
జీడి పప్పు, కిసమిస్ , ఏలకుల పొడి,
పాలు - 1 టేబుల్ స్పూన్.
నెయ్యి - 1 టేబుల్ స్పూన్.
నీరు తగినంత

లడ్డుగా తయారీ విధానం
గోధుమ పిండిని మృదువుగా కలుపుకొవాలి. చిన్ని చిన్న ఉండలను చపాతీగా వత్తుకోవాలి. వీటిని ముక్కలుగా చేసుకొని బాణలిలో వేసి సన్న మంట మీద పెట్టాలి. దాంట్లో బెల్లం, జీడి పప్పు, కిస్మిస్, ఏలకుల పొడి అన్ని వేసి నెయ్యి వేసి బాగా కలుపుకొవాలి. వీటిని అడుగంటకుండా చూసుకోవాలి. పాలు కలుపుకుని లడ్డూలను తయారుచేసుకోవాలి.


 

Follow Us:
Download App:
  • android
  • ios