Asianet News TeluguAsianet News Telugu

దుర్వా గణపతి వ్రతవిధానం

సాధారణం గా అష్ట దళ పద్మాన్నే వేస్తారు. పూజ చేసేవారు తూర్పు ముఖంగా కూర్చోవాలి . ఏ దైవాన్ని పూజించ బోతున్నారో ఆ దైవం యొక్క ప్రతిమను గాని , చిత్ర పటమును గాని ఆ పీటపై ఉంచాలి 

Pooja Process of Lord Ganesha
Author
Hyderabad, First Published Aug 12, 2021, 2:38 PM IST

 

ఈ రోజు తేదీ 12 ఆగష్ఠు 2021 గురువారం శ్రావణ శుద్ధ చవిత అనగా దుర్వా గణపతి వ్రతము. 'దుర్వాంకురము' లనగా గరిక చిగుళ్ళు . వీటితో గణపతిని పూజిస్తారు . శ్రీ మహా గణపతి యొక్క దుర్వా గణపతి వ్రతము ఈ విధంగా చేయవలెను .   ' శ్రావణ శుద్ధ చవితి ' నాడు దుర్వా గణపతి వ్రతము చేయుదురు.
ఇంటిలో ఈశాన్య మూలలో స్థలమును శుద్ధి చేసి , అలికి , బియ్యపు పిండితో గాని ,రంగుల చూర్ణములతో గాని ముగ్గులు పెట్టి , దైవ స్థాపన నిమిత్తమై ఒక పీటను వేయాలి . పీట మరీ ఎత్తుగా గాని , మరీ పల్లముగా గాని ఉండకూడదు . పిదప ఆ పీటకు కూడా చక్కగా పసుపు వ్రాసి , కుంకుమ తో బొట్టు పెట్టి , వరి పిండి , (బియ్యపు పిండి ) తో ముగ్గు వేయాలి. 

సాధారణం గా అష్ట దళ పద్మాన్నే వేస్తారు. పూజ చేసేవారు తూర్పు ముఖంగా కూర్చోవాలి . ఏ దైవాన్ని పూజించ బోతున్నారో ఆ దైవం యొక్క ప్రతిమను గాని , చిత్ర పటమును గాని ఆ పీటపై ఉంచాలి . ముందుగా పసుపుతో గణపతిని తయారు చేసి (పసుపును షుమారు అంగుళం సైజులో త్రికోణ ఆకృతిలో ముద్దగా చేసి ) దానికి కుంకుమ బొట్టు పెట్టి , పిదప ఒక పళ్ళెంలో గాని , క్రొత్త తుండు గుడ్డ మీద గాని బియ్యం పోసి దానిపై ఒక తమలపాకు ఉంచి , అందు పసుపు గణపతి నుంచి అగరువత్తులు వెలిగించాలి . ఇప్పుడు పూజకు కావలసిన వస్తువులను అమర్చుకోవాలి. దీపారాధన నైరుతి దిశలో చేయవలెను.

పూజకు కావలసిన వస్తువులు - దీపారాధన విధానము:- దీపారాధన చేయుటకు కుంది (ప్రమిద ) వెండిది గాని , ఇత్తడిది గాని , మట్టిది గాని వాడ వచ్చును. కుందిలో 3 అడ్డ వత్తులు 1 కుంభ వత్తి (మధ్యలో ) వేసి నూనెతో తడుపవలెను. ఇంకొక అడ్డ వత్తి నూనెతో తడిపి ఏక హారతిలో (కర్పూర హారతికి వాడే వస్తువు ) వేసి ముందుగా ఏక హారతిలో వేసిన వత్తిని అగ్గి పుల్లతో వెలిగించి , వెలిగించిన వత్తితో కుందిలోని 1 అడ్డ వత్తి 1 కుంభ వత్తి వెలిగించ వలెను. తర్వాత చేయి కడుక్కుని నూనె కుంది నిండా వేసి పిదప ఆ కుందికి మూడు చోట్ల కుంకుమ అలంకారము చేయవలెను. తర్వాత అక్షతలు వేసి దీపారాదనను లక్ష్మీ స్వరూపముగా భావించి నమస్కారము చేయవలెను . కుందిలో మిగిలిన రెండు అడ్డ వత్తులు పూజా సమయములో ధూపము చూపిన తరువాత దీపము చూపించుటకు వాడవలెను . దీపారాధనకు నువ్వులనూనె గాని , కొబ్బరి నూనె గాని , ఆవు నెయ్యి గాని వాడ వచ్చును. మనము ఆచమనము చేసినటువంటి పంచ పాత్రలోని నీళ్ళు దేవుని పూజకు వినియోగించ రాదు . పూజకు విడిగా ఒక గ్లాసు గాని , చెంబు గాని తీసుకొని దానిలో శుద్ధ జలమును పోసి ఆ చెంబునకు కలశారాధన చేసి ఆ నీళ్ళు మాత్రమే దేవుని పూజకు ఉపయోగించవలెను .

దుర్వా గణపతి పూజకు కావలసిన వస్తువులు :- విఘ్నేశ్వరుని బొమ్మ (తమ శక్తి కొలది బంగారముతో నైనను , వెండితో నైనను లేక మట్టితో నైనను తీసుకొనవలెను.) పసుపు , కుంకుమ , గంధం , హారతి కర్పూరం, అక్షతలు , అగ్గి పెట్టె , అగరువత్తులు , వస్త్ర , యజ్నోపవీతములు, ముఖ్యముగా గరిక చిగుళ్ళు నైవేద్యము కొరకు ప్రత్యేక పదార్దములు.

యజమానులు (పూజ చేసేవారు ) ఈ దిగువ కేశవ నామాలను స్మరిస్తూ ఆచమనం చేయాలి. 

1  ఓం కేశవాయ స్వాహా " అని చెప్పుకొని చేతిలో నీరు తీసుకొని లోనికి తీసుకోవాలి

2 . " ఓం నారాయణాయ స్వాహా "అనుకొని ఒకసారి

3 . " ఓం మాధవాయ స్వాహా " అనుకొని ఒకసారి జలమును పుచ్చుకోనవలెను .తరువాత

4 . " ఓం గోవిందాయ నమః " అని చేతులు కడుగు కోవాలి .

5 . " విష్ణవే నమః " అనుకుంటూ నీళ్ళు త్రాగి, మధ్య వ్రేలు , బొటన వ్రేళ్ళతో కళ్ళు తుడుచుకోవాలి .

6 . " ఓం మధుసూదనాయ నమః " అని పై పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురుకోవాలి .

7 . "ఓం త్రివిక్రమాయ నమః " క్రింది పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురుకోవాలి .

8 ,9 . " ఓం వామనాయ నమః " " ఓం శ్రీధరాయ నమః " ఈ రెండు నామాలు స్మరిస్తూ తలపై కొంచెం నీళ్ళు చల్లు కోవాలి.

10 . ఓం హృషీ కేశాయ నమః ఎడమ చేతిలో నీళ్ళు చల్లాలి .

11 .  ఓం పద్మనాభాయ నమః  పాదాలపై ఒక్కొక్క చుక్క నీరు చల్లు కోవాలి .

12 . ఓం దామోదరాయ నమః శిరస్సుపై జలమును ప్రోక్షించు కోవలెను .

13 . ఓం సంకర్షణాయ నమః చేతి వ్రేళ్ళు గిన్నెలా వుంచి గడ్డము తుడుచుకోనవలెను .

14 . ఓం వాసుదేవాయ నమః వ్రేళ్ళతో ముక్కును వదులుగా పట్టుకొనవలెను .

15 .16 . ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్దాయ నమః నేత్రాలు తాకవలెను .

17 .18 . ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః రెండు చెవులూ తాక వలెను

19, 20  ఓం నార సింహాయ నమః ఓం అచ్యుతాయ నమః బొడ్డును స్పృశించ వలెను .

21 . ఓం జనార్ధనాయ నమః చేతి వ్రేళ్ళతో వక్ష స్థలం , హృదయం తాకవలెను .

22 . ఓం ఉపేంద్రాయ నమః చేతి కొనతో శిరస్సు తాకవలెను .

23, 24 .  ఓం హరయే నమః ఓం శ్రీ కృష్ణాయ నమః కుడి మూపురమును ఎడమ చేతి తోను , ఎడమ మూపురమును కుడి చేతితోను ఆచమనం చేసిన తరువాత ఆచమనం చేసి , వెంటనే సంకల్పము చెప్పుకోనవలెను .

సంకల్పము :-

మమ ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభన ముహూర్తే అధ్య బ్రాహ్మణః (ఇక్కడ శ్రీ మహా విష్ణో రాజ్ఞాయ అని కూడా చెప్పవచ్చు ) ద్వితీయ పరార్దే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమ పాదే జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే (మనకు శ్రీశైలము ప్రధాన క్షేత్రము కావున మనము శ్రీశైలము నకు ఏ దిక్కున ఉన్నామో ఆ దిక్కు చెప్పుకొనవలెను.) , కృష్ణా గోదావర్యో : మధ్య ప్రదేశే (మనం ఏ ఏ నదులకు మధ్యన ఉన్నామో ఆయా నదుల పేర్లు చెప్పుకొనవలెను.) శోభన గృహే (అద్దె ఇల్లు ఐనచో వసతి గృహే అనియు , సొంత ఇల్లు అయినచో స్వగృహే అనియు చెప్పు కొనవలెను) , సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన ...............సంవత్సరే , (ఇక్కడ తెలుగు సంవత్సరమును అంటే పూజ చేయునపుడు ఏ సంవత్సరము జరుగుచున్నదో ఆ సంవత్సరము యొక్క పేరును చెప్పుకొనవలెను ),...............ఆయనే .(సంవత్సరమునకు రెండు ఆయనములు - ఉత్తరాయణము , దక్షిణాయనము జనవరి 15 మకర సంక్రమణం మొదలు జూలై 14 కర్కాటక సంక్రమణం వరకు ఉత్తరాయణము, జూలై 15 కర్కాటక సంక్రమణము నుండి మరల జనవరి 14 పెద్ద పండుగ అనగా మకర సంక్రమణం వరకు దక్షిణాయనం పూజ చేయునపుడు ఏ ఆయనము జరుగుచున్నదో దానిని చెప్పవలెను ).............ఋతు: (వసంత , గ్రీష్మ , వర్ష , మొ. ఋతువులలో పూజ సమయంలో జరుగుతున్న ఋతువు పేరు ).............మాసే , (చైత్ర , వైశాఖ మొ. పన్నెండు మాసములలో పూజ సమయములో జరుగుచున్న మాసం పేరు )............పక్షే (నెలకు రెండు పక్షములు పౌర్ణమికి ముందు శుక్ల పక్షము , అమావాస్యకు ముందు కృష్ణ పక్షములు వీటిలో పూజ జరుగు చున్న సమయమున గల పక్షము పేరు ) తిదౌ , (ఆరోజు తిది ) వాసరే (ఆరోజు ఏ వారమన్నది చెప్పుఆచమనము అయిన తరువాత , కొంచెం నీరు చేతిలో పోసుకొని నేలపై చిలకరించుతూ ఈ శ్లోకమును పటించవలెను .

శ్లో. ఉత్తిష్టంతు భూత పిశాచాః యేతే భూమి బారకాః
   యేతేషామ విరోదేన బ్రహ్మ కర్మ సమారభే.
ప్రాణాయామమ్య :-
ఓం భూ : - ఓం భువః ఓం సువః -ఓం మహః - ఓం జనః ఓం తపః - ఓం సత్యం -ఓం తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి దీయోయోనః ప్రచోదయాత్ - ఓం ఆపో జ్యోతిరసో మృతం బ్రహ్మ భూర్భువ స్సువరోం అని సకల్పము చెప్పుకొని ) శుభ నక్షత్రే , శుభయోగే , శుభ కరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభాతిదౌ మమ ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం పురుషులైనచో శ్రీ మాన్ ..........గోత్రశ్య ..............నామధేయః ,శ్రీమత్యః , గోత్రస్య , నామధేయస్య అనియు , స్త్రీ లైనచో శ్రీమతి , గోత్రవతి , నామదేయవతి ,శ్రీమత్యాః , గోత్రవత్యాః , నామధేయ వత్యాః అనియు (పూజ చేయువారి గోత్రము , నామము చెప్పి ) నామధేయస్య : ధర్మపత్నీ సమేతస్య (పురుషులైనచో ) మమ సహా కుటుంబస్య , క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృధ్యర్ధం సకల విధ మనో వాంచా ఫల సిధ్యర్ధం , శ్రీ వరసిద్ది వినాయక దేవతా ముద్దిశ్య వరసిద్ది వినాయక దేవతా ప్రీత్యర్ధం (ఏ దేవుని పూజించు చున్నామో ఆ దేవుని యొక్క పేరు చెప్పుకొని ) సంభ వద్భి రుపచారై : సంభావతాని యమేన సంభావతా ప్రకారేణ యావచ్చక్తి (నాకు తోచిన రీతిలో , నాకు తోచిన నియమములతో , నాకు తోచిన విధముగా , భక్తి శ్రద్దలతో సమర్పించు కొంటున్న పూజ ) ధ్యానా వాహనాది షోడశోప చార పూజాం కరిష్యే . తదంగ కలశ పూజాం కరిష్యే || పిదప కలశారాధనం చేయవలెను .

కలశ పూజను గూర్చిన వివరణ :- వెండి , రాగి , లేక కంచు గ్లాసులు (లేదా పంచపాత్రలు ) రెండింటిలో శుద్ధ జలమును తీసుకొని ఒకదానియందు ఉద్దరిణిని , రెండవ దానియందు అక్షతలు , తమలపాకు , పువ్వు ఉంచుకొనవలెను. రెండవపాత్రకు బయటకు మూడు వైపులా గంధమును వ్రాసి కుంకుమను అద్దవలెను. ఇట్లు చేయునపుడు గ్లాసును గుండ్రముగా త్రిప్పుచూ గంధమును గాని , కుంకుమను గాని పూయరాదు. గంధమును ఉంగరపు వ్రేలితో పూయవలెను. కుంకుమ అక్షతలు వగైరా బొటన , మధ్య , ఉంగరపు వ్రేళ్ళను కలిపి సమర్పించ వలెను. యజమానులు (ఒక్కరైతే ఒకరు , దంపతులైతే ఇద్దరూను ) ఆ కలశాన్ని కుడి చేతితో మూసి ఉంచి , ఇలా అనుకోవాలి . ఈ విధముగా కలశమును తయారుచేసి పూజను చేయునపుడు మొదటగా ఈ శ్లోకమును చదువవలెను .

శ్లో. కలశస్య ముఖే విష్ణు : కంటే రుద్ర స్సమాశ్రితః
  మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృ గణా స్మృతా:
  ఋగ్వేదో ధ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః
  అంగైశ్చ సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః

శ్లో. గంగైచ యమునే చైవ కృష్ణే , గోదావరి , సరస్వతి ,నర్మదా సింధు
  కావేర్యౌ జలేస్మిన్ సన్నిధం కురు.

ఇక్కడ ఇలా శ్లోకము ముగిసిన తరువాత ఆయాతు శ్రీ మహా గణపతి (ఏ దేవుని పూజైతే చేస్తున్నామో ఆ దేవుని పేరును చెప్పవలెను ) పూజార్ధం మమ దురిత క్షయ కారకాః కలశోద కేన ఓం దేవం సంప్రోక్ష్య (కలశ మందలి ఉదకమును దేవునిపై చల్లాలి ) , ఓం ఆత్మానం సంప్రోక్ష్యా అని (ఆ నీటిని తనపై చల్లుకోవాలి ) ఓం పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య (పూజా ద్రవ్యములపై కూడా చల్లాలి ) కలశ మందలి నీటిని పై మంత్రం చదువుతూ పువ్వుతో గాని , ఆకుతో గాని చల్లాలి. మార్జనము : ఓం అపవిత్రః పవిత్రోవా సర్వా వస్తాం గతోపివా యస్మరే త్పుండరీ కాక్షం సభాహ్యాభ్యంతర శ్శుచి.

అని పిదప కాసిని అక్షతలు , పసుపు , గణపతిపై వేసి , ఆయనను తాకి నమస్కరించి ప్రాణ ప్రతిష్టాపన చేయవలెను. ప్రాణ ప్రతిష్ట అనగా శ్రీ మహా గణాధిపతయే నమః
ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త స్సుముహూర్తోస్తు తదాస్తు . తరువాత ఇలా చదువుతూ విఘ్నేశ్వరునికి నమస్కరించవలెను.

శ్లో. శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్
   ప్రసన్న వదనం ధ్యాయే త్సర్వ విఘ్నోప శాంతయే.

సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజ కర్ణక :
లంబోదర శ్చ వికటో విఘ్న రాజో వినాయకః
ధూమకేతు ర్గణాధ్యక్షః ఫాల చంద్రో గజాననః
వక్ర తుండ శ్శూర్ప కర్ణో హేరంబః స్కంద పూర్వజః
షోడ శైతాని నామానియః పటేచ్చ్రుణు యాదపి
విద్యా రంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తధా
సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్త స్యన జాయతే.

విఘ్నేశ్వర పూజకు మొట్ట మొదటగా చదువ వలసిన ఈ శ్లోకమును చదివి ప్రార్దించినచో సర్వ విఘ్నములు తొలిగి శుభములు కలుగును. విద్యార్దులకు విద్య అధికమగును. మోక్షార్దులకు మోక్షము , ధనము కోరిన వారు ధనము పొందెదరు. పిదప షోడశోపచార పూజను చేయవలెను . షోడశోపచారములనగా ఆవాహన , ఆసనం , అర్ఘ్యం , పాద్యం, ఆచమనీయం ,స్నానం ,వస్త్రం , యజ్ఞోపవీతం ,గంధం , పుష్పం , ధూపం , దీపం , నైవేద్యం , తాంబూలం , నమస్కారం , ప్రదక్షిణములు 
మొదలగునవి  దుర్వార పత్రములతో (గరిక చిగుళ్ళు) ఈ పూజ చేయవలెను. శ్రీ మహాగణపతి భక్తుల కోర్కెలన్నీ తీర్చును.
                                                                                               
అధ షోడశోపచార పూజః ధ్యానం

శ్లో . భవ సంచిత పాపౌఘ విద్వంసన విచక్షణం ,
   విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజ మహం భజే.

   ఏకదంతం శూర్ప కర్ణం గజవక్త్రం చతుర్భుజం ,
   పాశాంకుశ ధరం దేవం ధ్యాయే త్సిద్ది వినాయకమ్.

   ఉత్తమం గణనాధ స్యవ్రతం సంపత్కరం శుభం ,
   భక్తా బీష్ట ప్రదం తస్మాత్ ధ్యేయేత్తం విఘ్నయాకం. 

   ధ్యాయేద్గ జాననం దేవం తప్త కాంచన సన్నిభం ,
    చతుర్భుజం మహాకాయం స్వర్ణా భరణ భూషితం.

శ్రీ మహాగణాది పతయే నమః ధ్యాయామి - ధ్యానం సమర్పయామి అని గణపతిని మనస్సున ధ్యానించి నమస్కరించవలెను .

ఆవాహనం :- శ్లో. అత్రా గచ్చ జగద్వంద్య సుర రాజార్చితేశ్వర ,
                       అనాధ నాద సర్వజ్ఞ గౌరీ గర్భ సముద్భవ.

శ్రీ మహా గణాధిపతయే నమః ఆవాహయామి . ఆవాహనార్ధం అక్షతాం సమర్పయామి . అనగా 
మనస్పూర్తిగా దేవుని మన ఇంట్లో కి ఆహ్వానించడం . అట్లు మనస్సున స్మరిస్తూ 
అక్షతలు దేవునిపై వేయవలెను.

ఆసనం :- శ్లో. మౌక్తి కై : పుష్య రాగైశ్చ నానా రత్నై ర్విరాజితం ,
                  రత్న సింహాసనం చారు ప్రీత్యర్ధం రతి గృహ్యాతాం.

శ్రీ మహా గణాది పతయే నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి . సింహాసనార్ధం 
అక్షతాం సమర్పయామి . దేవుడు కూర్చుండుటకై మంచి బంగారు పీట వేసినట్లు 
అనుకుంటూ అక్షతలు వేయవలెను.

అర్ఘ్యం :-  శ్లో. గౌరీ పుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన
                గృహణార్ఘ్యం మయాదత్తం గంధ పుష్పాక్షతై ర్యుతం.
శ్రీ
 మహా గణాధిపతయే నమః హస్తౌ : అర్ఘ్యం సమర్పయామి. దేవుడు చేతులు కడుగుకొనుటకై
 నీళ్లిస్తున్నామని మనసున తలుస్తూ ,ఉద్దరిణితో నీరు వేరొక గిన్నెలో 
వదలవలయును.

పాద్యం :  శ్లో || సర్వాత్మన్ సర్వ లకేశ సర్వ వ్యాపిన్ సనాతనా ,
                పాద్యం గృహణ భగవాన్ దివ్య రూప నమోస్తుతే ||


శ్రీ మహా గణాది పతయే నమః పాదౌ :- పాద్యం సమర్పయామి . దేవుడు కాళ్ళు కడుగుకొనుటకు నీరు ఇస్తున్నామని మనసున అనుకుంటూ పువ్వుతో పంచ పాత్రలోని నీరు అదే గిన్నెలో ఉద్దరిణెతో వదలవలెను.

ఆచమనం :-  శ్లో. అనాధనాద సర్వజ్ఞ గీర్వాణ పరిపూజిత ,
                   గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో.

శ్రీ మహాగణాదిపతయే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి . అంటూ దేవుని ముఖము కడుగుకొనుటకై నీళ్లిస్తున్నామని మనసున తలుస్తూ పైన చెప్పిన పాత్రలో 
ఉద్దరిణెతో ఒక మారు నీరు వదలవలెను.

సూచన :- అర్ఘ్యం , పాద్యం , ఆచమనం మొదలగు వాటికి ఉద్దరిణెతో నీరు వేరొక పాత్రలో వదలవలెను . అరివేణంలో వదలరాదు.

మధుపర్కం :-  శ్లో. దది క్షీర సమాయుక్తం మద్వాజ్యేన సమన్వితం ,
                       మధుపర్కం గృహాణే దం గజ వక్త్ర నమోస్తుతే.

శ్రీ మహా గణాది పతయే నమః మధుపర్కం సమర్పయామి . స్వామివారికి స్నానం చేయుటకు వస్త్ర మిచ్చు చున్నామని తలుస్తూ , ఈ మధుపర్కం ను ( ప్రత్తిని పెద్ద బొట్టు  బిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆ పైన రెండు వైపులా పసుపులో అద్ది ఉంచుకొనవలెను ) ఆయన ప్రతిమకు అద్దవలెను.

పంచామృత స్నానం :-  శ్లో. స్నానం పంచామృతై ర్దేవ గృహాణ గణ నాయక
                                   అనాధ నాద సర్వజ్ఞ గీర్వాణ గణ పూజిత.

శ్రీ మహా గణాది పతయే నమః పంచామృత స్నానం సమర్పయామి అని స్నానమునకు పంచామృతములతో కూడిన నీరు ఇచ్చునట్లు భావించి ఆవు నెయ్యి , ఆవు పాలు , ఆవు పెరుగు , తేనె పంచదార కలిపిన పంచామృతమును స్వామిపై ఉద్దరిణెతో చల్లవలెను.

శుద్దోదక స్నానం :-  శ్లో. గంగాది సక్వ తీర్ధేభ్య ఆహృతై రమలైర్జలై :
                              స్నానం కురుష్య భగవన్నుమా పుత్ర నమోస్తుతే.

శ్రీ మహాగణాదిపతయే నమః శుద్దోదక స్నానం సమర్పయామి. పంచ పాత్రలోని శుద్ధ నీటిని పువ్వుతో దేవునిపై చల్లవలెను .

వస్త్ర యుగ్మం :-  శ్లో. రక్త వస్త్ర ద్వయం చారు దేవ యోగ్యం చ మంగళం,
                         శుభ ప్రదం గృహాణ త్వం లంబోదర హరాత్మజ.

శ్రీ మహా గణాది పతయే నమః వస్త్ర యుగ్మం సమర్పయామి అనుచూ వస్త్రమును ( పైన చెప్పినట్లు ప్రత్తిని కుంకుమలో అద్ది నచో అది వస్త్రమగును ) స్వామీ వారి 
ప్రతిమకు అద్దవలెను .

యజ్ఞోపవీతం :- శ్లో. రాజితం బ్రహ్మ సూత్రంచ కాంచనం చట్ట రీయకం ,
                         గృహాణ సర్వ ధర్మజ్ఞ భక్తానా మిష్ట దాయక.

శ్రీ మహా గణాది పతయే నమః ఉపవీతం సమర్పయామి . అనగా
జందెమును ఇవ్వవలెను. ఇదియును ప్రత్తితో చేయవచ్చును . ప్రత్తిని తీసుకొని 
పసుపు చేత్తో బొటన వ్రేలు, మధ్య వ్రేలితో మధ్య మధ్య నలుపుతూ పొడవుగా చేసి ,
కుంకుమ అద్దవలెను దీనిని పురుషదేవతా పూజకు మాత్రమే సమర్పించవలెను .

గంధం :-  శ్లో. చందనా గరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం ,
              విలేపనం సుర శ్రేష్ఠ ప్రీత్యర్ధం ప్రతి గుహ్యతాం.

శ్రీ మహా గణాది పతయే నమః గంధాన్ సమర్పయామి . ముందుగా తీసి పెట్టుకున్న గంధమును 
కుడిచేతి ఉంగరం వ్రేలుతో స్వామివారి ప్రతిమపై చల్లవలెను.

అక్షతలు :- శ్లో. అక్షతాన్ దవళాన్ దివ్యాన్ శాలియాన్ స్తండులాన్ శుభాన్ ,
                  గృహాణ పరమా నంద ఈశ పుత్ర నమోస్తుతే.
శ్రీ
 మహాగణాదిపతయే నమః అక్షతాన్ సమర్పయామి (అక్షతలకు కొద్ది బియ్యమును తడిపి 
పసుపు వేసి కలుపవలెను ) అక్షతలు తీసుకొని స్వామివారి ప్రతిమపై చల్లవలెను.

పుష్ప సమర్పణ :-  శ్లో. సుగంధాని సుపుష్పాణి జాజీ కుంద ముఖానిచ ,
ఏక వింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే.

శ్రీ మహా గణాధిపతయే నమః పుష్పాణి సమర్పయామి. స్వామివారికి పువ్వులతో అలంకారము చేయవలెను. పిదప శ్రీ విఘ్నేశ్వరునికి ఆదాంగ పూజను చేయవలెను. ఒక్కొక్క మంత్రమునకు పసుపు , కుంకుమలను గాని , పువ్వులను గాని స్వామిపై వేస్తూ పూజించవలెను . ఇచ్చట కూడా గారిక చిగుళ్ళతో పూజించ వచ్చును.

అధాంగ పూజ :-  ఓం శ్రీ గణేశాయ నమః పాదౌ పూజయామి ; ఓం శ్రీ ఏకదంతాయ నమః జానునీ పూజయామి; ఓం శ్రీ విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి ; ఓం శ్రీ ఆఖు వాహనాయ నమః ఊరూ పూజయామి ; ఓం శ్రీ హేరంబాయ నమః కటిం పూజయామి ; ఓం శ్రీ లంబోదరాయ నమః ఉదరం  పూజయామి ; ఓం శ్రీగణ నాదాయ నమః నాభిం పూజయామి; ఓం శ్రీ గణేశాయ నమః హృదయం పూజయామి ; ఓం శ్రీ స్థూల కంటాయ నమః కంటం పూజయామి ; ఓం శ్రీ స్కందాగ్రజాయ నమః స్కందౌ పూజయామి; ఓం శ్రీ పాశ హస్తాయ నమః హస్తౌ పూజయామి; ఓం గజ వక్త్రాయ నమః వక్త్రం పూజయామి ; ఓం విఘ్న హంత్రే నమః నేత్రం పూజయామి; ఓం శూర్ప కర్ణాయ నమః కర్ణౌ పూజయామి ; ఓం ఫాల చంద్రాయ నమః లలాటం పూజయామి; ఓం శ్రీ సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి ; ఓం విఘ్నరాజాయ నమః సర్వాణ్యం పూజయామి.

అనంతరం:- ఓం గజాననాయ నమః ఓం గజ వక్త్రాయ నమః మొదలగు 108 పేర్లతో వినాయకుని పూజించవలెను. దీనిని అష్టోత్తర శతనామావళి అంటారు . ఒక్కొక్క నామము చెప్పునపుడు పసుపు కాని , అక్షతలు కాని , కుంకుమ కాని స్వామిపై వేసి పూజింపవలెను. ఈ దూర్వా గణపతి వ్రతమందు గరిక చిగుళ్ళను కూడా వేసి పూజింపవచ్చును .

అదాష్టోత్తర  శతనామ పూజా :-

ఓం గజాననాయ నమః ఓం శివ ప్రియాయ నమః ఓం విష్ణు ప్రియాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం శీఘ్రకారిణే నమః ఓం భక్త జీవితాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం జితమన్మదాయ నమః ఓం వినాయకాయ నమః ఓం బలాయ నమః ఓం ఐశ్వర్య కారణాయ నమః
ఓం ద్వైమా తురాయ నమః ఓం భవాత్మజాయ నమః ఓం యక్ష కిన్నర సేవితాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం పురాణ పురుషాయ నమః
ఓం గంగా సుతాయ నమః ఓం సుముఖాయ నమః ఓం పూష్ణే నమః ఓం గణాధీశాయ నమః ఓం కృతినే నమః ఓం పుష్కర్తో క్షిప్తవారిణే నమః
ఓం గంభీర నినదాయ నమః ఓం సుప్రదీపాయ నమః ఓం అగ్ర గణ్యాయ నమః ఓం వటవే నమః ఓం సుఖ నిదయే నమః ఓం అగ్ర పూజ్యాయ నమః
ఓం అభీష్ట వరదాయ నమః ఓం సురాధ్యక్షాయ నమః ఓం అగ్రగామినే నమః ఓం జ్యోతిషే నమః ఓం సురారిఘ్నాయ నమః ఓం మంత్ర కృతే నమః
ఓం భక్త నిదయే నమః ఓం మహా గణపతయే నమః ఓం చామీకర ప్రభాయ నమః ఓం భావ గమ్యాయ నమః ఓం మాన్యాయ నమః ఓం సర్వస్మ్యై నమః
ఓం మంగళ ప్రదాయై నమః ఓం మహాకాలాయ నమః ఓం సర్వోపాస్యాయ నమః ఓం అవ్యక్తాయ నమః ఓం మహాబలాయ నమః ఓం సర్వ కర్త్రే నమః
ఓం అప్రాకృత పరాక్రమాయ నమః ఓం హేరంబాయ నమః ఓం సర్వనేత్రే నమః ఓం సత్య ధర్మిణే నమః ఓం లంబ జటరాయ నమః ఓం సర్వసిద్ది ప్రదాయ నమః
ఓం సఖయే నమః ఓం హ్రస్వ గ్రీవాయ నమః ఓం సర్వ సిద్ధయే నమః ఓం సరసాంబు నిధయే నమః ఓం మహోదరాయ నమః ఓం పంచ హస్తాయ నమః
ఓం మహేశాయ నమః ఓం మదోత్కటాయ నమః ఓం పార్వతీ నందనాయ నమః ఓం దివ్యాజ్గాయ నమః ఓం మహావీరాయ నమః ఓం ప్రభవే నమః
ఓం మణి కిజ్కిణి మేఖలాయ నమః ఓం మంత్రిణే నమః ఓం కుమారగురవే నమః ఓం సమస్త దేవతా మూర్తయే నమః ఓం మజ్గళ స్వరాయ నమః
ఓం అక్షోభ్యాయ నమః ఓం సహిష్ణవే నమః ఓం ప్రమదాయ నమః ఓం కుజ్చరాసుర భంజనాయ నమః ఓం సతతోత్ది తాయ నమః ఓం ప్రధమాయ నమః
ఓం ప్రమోదాత్తానన యనాయ నమః ఓం విఘాత కారిణే నమః ఓం ప్రాజ్ఞాయ నమః ఓం మోదక ప్రియాయ నమః ఓం విశ్వగ్ధ్రుశే నమః ఓం విఘ్న కర్త్రే నమః
ఓం కాంతి మతే నమః ఓం విశ్వ రక్షాక్రుతే నమః ఓం విఘ్న హర్త్రే నమః ఓం ధృతి మతే నమః ఓం కళ్యాణ గురవే నమః ఓం విశ్వ నేత్రే నమః ఓం కామినే నమః
ఓం ఉన్మత్త వేషాయ నమః ఓం విరాట్పతయే నమః ఓం కపిత్ద పనస ప్రియాయ నమః ఓం అపరాజితే నమః ఓం శ్రీపతయే నమః ఓం బ్రహ్మ చారిణే నమః
ఓం సమస్త జగదా దారాయ నమః ఓం వాక్పతయే నమః ఓం బ్రహ్మ రూపిణే నమః ఓం సర్వైశ్వర్య ప్రదాయ నమః ఓం శృంగారిణే నమః ఓం బ్రహ్మ విద్యాది దాన భువే నమః ఓం అక్రాన్త చిద చిత్ప్రభవే నమః ఓం ఆశ్రిత వత్సలాయ నమః ఓం జిష్ణవే నమః ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః 108 శ్రీ వరసిద్ది వినాయక స్వామినే నమః
అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి

పిదప అగరువత్తిని వెలిగించి ........
శ్లో. దశాంగం గగ్గులో పేతం సుగంధం సుమనోహరం
   ధూపం గృహాణ దేవేశ విఘ్నరాజ నమోస్తుతే.

ఓం శ్రీ మహా గణాధిపతయే నమః ధూప మాఘ్రాపయామి, ధూపం సమర్పయామి అంటూ ఎడమ చేత్తో గంట వాయిస్తూ కుడి చేత్తో అగరుబత్తిని తిప్పుతూ పొగను స్వామికి చూపవలెను. పిమ్మట మొదట్లో చెప్పిన విధంగా దీపారాదనలో ఉన్న అదనపు వత్తులలో ఒక దానిని తీసుకుని హారతి వెలిగించే దాంట్లో వేసి వెలిగించి గంట మ్రోగిస్తూ ఆ దీపం స్వామికి చూపుతూ...

శ్లో. భక్త్యా దీపం ప్రచ్చయామి - దేవాయ పరమాత్మనే
   త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే.

ఓం శ్రీ మహా గణాధిపతయే నమః సాక్షాత్ దీపం దర్శయామి .అటు తరువాత ఒక బెల్లం ముక్క , వడపప్పు (పెసర పప్పును నీటిలో బాగుగా నాన నిచ్చి నీరు తీసేసిన అది వడ పప్పు అగును ), పళ్ళు ,కొబ్బరికాయ మొదలగునవి గణపతి వద్ద ఉంచి దానిపై పువ్వుతో నీళ్ళు చల్లుతూ ఓం శ్రీ మహా గణాధిపతయే నమః గుడ శకల నైవేద్యం 
సమర్పయామి . ' ఓం ప్రాణాయ స్వాహా , ఓం అపానాయ స్వాహా , ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా , ఓం సమానాయ స్వాహా , ఓం శ్రీ మహా గణాధిపతయే నమః ' అంటూ ఆరు మార్లు చేతితో (చేతిలోని ఉద్దరిణె తో ) స్వామికి నివేదనం చూపించాలి . పిదప ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నైవేద్యానంతరం ' హస్తౌ ప్రక్షాళ యామి ' అని ఉద్దరిణె తో పంచ పాత్రలోని నీరు ముందు చెప్పిన అర్ఘ్య పాత్ర (పంచపాత్ర కాకుండా విడిగా చెంబులో పెట్టుకునే నీళ్ళ పాత్ర )లో వదలాలి, తరువాత 'పాదౌ ప్రక్షాళ యామి ' అని మరోసారి నీరు అర్ఘ్య పాత్రలో ఉద్దరిణెతో వదలాలి పునః శుద్దాచమనీయం సమర్పయామి అని ఇంకొక పర్యాయం నీరు వదలాలి.

నిత్య పూజా విధానం మందు ఈ విధంగా చేసే నైవేద్యం భాద్రపద శుద్ధ చవితి అనగా వినాయక చతుర్ది నాడు 9 రకముల పిండి వంటలు చేసి అందు బియ్యపు పిండి , బెల్లం రెండూ కలిపి చేసిన ఉండ్రాళ్ళు ప్రధానంగా నివేదన చేయాలి తదనంతరం .......

ధూపం :-
శ్లో. దశాంగం గగ్గులోపేతం సుగంధం సుమనోహరం
   ధూపం గృహాణ దేవేశ విఘ్నరాజ నమోస్తుతే.

ఓం శ్రీ మహా గణాధిపతయే నమః ధూప మాఘ్రాపయామి . ధూపం సమర్పయామి . అంటూ ఎడమ చేత్తో గంట వాయిస్తూ కుడి చేత్తో అగరు బత్తిని తిప్పుతూ పొగను స్వామికి చూపవలెను.

దీపం :- శ్లో. భక్త్యాది పంప్రచ్చయామి - దేవాయ పరమాత్మనే
              త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే.

ఓం శ్రీ మహా గణాధిపతయే నమః సాక్షాత్ దీపం దర్శయామి అని మొదట్లో చెప్పిన విధంగా దీపారాదనలో ఉన్న అదనపు వత్తులలో ఒక దానిని తీసుకుని హారతి వెలిగించే దాంట్లో వేసి వెలిగించి గంట మ్రోగిస్తూ ఆ దీపం స్వామికి చూపుతూ పై శ్లోకమును చదువవలెను.

నైవేద్యం :-  ఒక బెల్లం ముక్క , వడపప్పు (పెసరపప్పును నీటిలో బాగుగా నాన నిచ్చి నీరు తీసేసిన అది వడపప్పు అగును ), పళ్ళు , కొబ్బరికాయ మొదలగునవి గణపతి వద్ద నుంచి నిత్యపూజా విదానమందు ఈ విధంగా చేసే నైవేద్యం దూరవా గణపతి వ్రతము ఆచరించునపుడు (శ్రావణ శుద్ధ చవితినాడు ) పిండి వంటలతో స్వామికి నైవేద్యము చేస్తారు. నైవేద్యము పెట్టు పదార్ధములను సిద్దము చేసుకుని వాటిపై పువ్వుతో నీళ్ళు చల్లుతూ ఎడమ చేత్తో గంట వాయిస్తూ ఓం శ్రీ మహా గణాధిపతయే నమః గుడ శకల నైవేద్యం సమర్పయామి .  'ఓం ప్రాణాయ స్వాహా , ఓం అపానాయా స్వాహా , ఓం వ్యానాయా స్వాహా, ఓం ఉదానాయా స్వాహా, ఓం సమానాయా స్వాహా, ఓం శ్రీ మహా గణాధిపతయే నమః ' అంటూ ఆరు మార్లు చేతితో (చేతిలోని ఉద్దరిణెతో) స్వామికి నివేదనం చూపించాలి . 

పిదప ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నైవేద్యానంతరం ' హస్తౌ ప్రక్షాళ యామి ' అని ఉద్దరిణెతో పంచాపాత్రలోని నీరు ముందు చెప్పిన అర్ఘ్య పాత్ర (పంచ పాత్ర 
కాకుండా విడిగా చెంబులో పెట్టుకునే నీళ్ళ పాత్ర ) లో వదలాలి . తరువాత 'పాదౌప్రక్షాళ యామి ' అని మరోసారి నీరు అర్ఘ్య పాత్రలో ఉద్దరిణెతో వదలాలి . 
పునః శుద్దాచమనీయం సమర్పయామి అని ఇంకొక పర్యాయం నీరు వదలాలి .

తాంబూలం :- శ్లో. పూగీ ఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం
                        ముక్తా చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతి గృహ్యాతాం.

శ్రీ మహా గణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి అని చెబుతూ మూడు తమలపాకులు , రెండు పోక చెక్కలు వేసి స్వామీ వద్ద ఉంచాలి. తాంబూలం వేసుకున్నాక నోరు కడుక్కొనుటకు నీరు ఇస్తున్నామని తలుస్తూ ,' తాంబూల చరవణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ' అంటూ ఉద్దరిణెతో నీరు అర్ఘ్య పాత్రలో వదలాలి. పిమ్మట కర్పూరం వెలిగించి ............

శ్లో. ఘ్రుత వర్తి సహస్తైశ్చ కర్పూర శకలై స్తదా ,
  నీరాజనం మయాదత్తం గృహాణ వరదోభవ.

ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నీరాజనం సమర్పయామి అని కర్పూర బిళ్ళలు హారతి కుందిలో వేసి ముందుగా దీపారాధనకు వెలిగించిన దీపంతో వెలిగించి , మూడు మార్లు తిప్పుచూ ,చిన్నగా గంట వాయించ వలెను .అనంతరం మళ్ళీ పువ్వుతో నీరు హారతి కుంది చివర వదులుతూ ' కర్పూర నీరాజనా నంతరం శుద్దాచ మనీయం సమర్పయామి' అని చెప్పి నీరాజనం స్వామివారికి చూపించి తరువాత ఇంటిలోని వారందరూ హారతిని కళ్ళకు అద్దుకోవాలి. పిమ్మట గరికను తీసుకుని ఈ  క్రింది నామాలను జపిస్తూ స్వామివారిపై ఈ గరికతో పూజ చేయవలెను.

అధ దూర్వా యుగ్మ పూజాః
ఓం గణాధిపాయ నమః దూర్వా యుగ్మం పూజయామి
ఓం ఉమాపుత్రాయ నమః దూర్వా యుగ్మం పూజయామి
ఓం అఖువాహనాయ నమః దూర్వా యుగ్మం పూజయామి
ఓం వినాయకాయ నమః దూర్వా యుగ్మం పూజయామి
ఓం ఈశ పుత్రాయ నమః దూర్వా యుగ్మం పూజయామి
ఓం వరసిద్ది ప్రదాయకాయ నమః దూర్వా యుగ్మం పూజయామి
ఓం ఏకదంతాయ నమః దూర్వా యుగ్మం పూజయామి
ఓం ఇభ వక్త్రాయ నమః దూర్వా యుగ్మం పూజయామి
ఓం మూషికవాహనాయ నమః దూర్వా యుగ్మం పూజయామి
ఓం కుమారగురవే నమః దూర్వా యుగ్మం పూజయామి

తరువాత అక్షతలు , పువ్వులు , చిల్లర డబ్బులు చేతిలో పట్టుకొని ,

మంత్ర పుష్పం :- శ్లో. గణాధిప నమస్తేస్తు ఉమాపుత్ర గజానన ,
                             వినాయకేశ తనయ సర్వ సిద్ది ప్రదాయక.

                           ఏక దంతైక వదన తదా మూషిక వాహన
                           కుమార గురవే తుభ్యం సమర్పయామి సుమాంజలిం.

ఓం శ్రీ మహా గణాధిపతయే నమః యధాశక్తి మంత్ర పుష్పం సమర్పయామి అని చెప్పుకుని అక్షతలు , పువ్వులు, చిల్లర స్వామీ వద్ద ఉంచవలెను. పిమ్మట ఈ దిగువ మంత్రం జపిస్తూ మూడు సార్లు ప్రదక్షిణలు చేయాలి.

ప్రదక్షిణం :-  శ్లో. ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియ ,
                    నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్న నాశన.
             శ్లో. ప్రమధ గణ దేవేశ ప్రసిద్దె గణ నాయక ,
                   ప్రదక్షిణం కరో మిత్వా మీశ పుత్ర నమోస్తుతే.
             శ్లో. యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
                   తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే.

ఓం శ్రీ మహా గణాధిపతయే నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి . శ్రీ వినాయకునికి చేతిలో అక్షతలు , పువ్వులు తీసుకుని లేచి నిలబడి మూడుసార్లు 
ఆత్మ ప్రదక్షణ చేసి (మగవారు పూర్తిగా పడుకుని తలను నేలకు ఆన్చి, ఆడువారు మోకాళ్ళపై పడుకుని కుడికాలు ఎదమకాలుపై వేసి ) తరువాత స్వామిపై చేతిలో నున్న
అక్షతలు , పువ్వులు చల్లవలెను . (వినాయకునికి 3 గుంజీలు తీస్తే కూడా మంచిది ) మరల తమ స్థానమున ఆసీనులై నమస్కరించుచూ .......

పునః పూజ :  ఓం శ్రీ మహా గణాధిపతయే నమః పునః పూజాంచ కరిష్యే అని చెప్పుకుని , పంచపాత్ర లోని నీటిని చేతితో తాకి , అక్షతలు స్వామిపై చల్లుతూ ఈ క్రింది మంత్రములు చదువు కొనవలెను. ఛత్రం ఆచ్చాదయామి , చామరం వీజయామి , నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి. సమస్త రాజోపచార , శక్త్యోప చార , భక్త్యోప చార పూజాం సమర్పయామి అనుకుని, నమస్కరిస్తూ ఈ క్రింది శ్లోకమును చదువు కొనవలెను .

శ్లో. యస్య స్మృత్యాచ నామోక్త్యా తపం పూజా క్రియాదిషు
  యాన సంపూరతాం యాతి సద్యో వందే తమచ్యుతమ్

ఏతత్ఫలం శ్రీ విఘ్నేశ్వరార్పణ మస్తు అంటూ అక్షతలు నీటితో పాటు అరవేణంలో వదలవలెను . పిమ్మట ' శ్రీ మహా గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి ' అనుకుని స్వామీ వద్ద అక్షతలు తీసుకుని తమ తమ తలలపై వేసుకొనవలెను . ఆ పిదప పసుపు గణపతి ఉన్న పళ్ళెము నొకసారి పైకి ఎత్తి తిరిగి క్రింద ఉంచి పళ్ళెములో ఉన్న పసుపు గణపతిని తీసి దేవుని పీటముపై ఉంచవలెను. దీనిని ఉద్వాసన చెప్పటం అంటారు.

దూర్వా గణపతి పూజ చేయునపుడు ఉద్వాసన మంత్రము:-

'ఓం యజ్ఞేన యజ్ఞ మయజంత దేవాః
తాని ధర్మాణి , ప్రధ మాన్యాసన్
తేహ నాకం మహిమానస్ప చంతే
యత్ర పూర్వే సాధ్యా స్సంతి దేవాః '

శ్లో. యస్య స్మృత్యాచ నో మొక్త్యాత పః పూజా క్రియాది షు: న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే
  తమచ్యుతం మంత్ర హీనం క్రియాహీనం భక్తిహీనం జనార్ధన, యత్పూజితం మాయాదేవ
  పరిపూర్ణం తదస్తుతే, అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాయాచ భగవా న్సర్వాత్మక :

శ్రీ గణపతి దేవతా స్సుప్రీతో వరదో భవతు , శ్రీ వినాయక ప్రసాదం శిరసా గుహ్ణామి. నమస్కరించి స్వామి వద్ద నున్న అక్షతలు తీసి తలపై వేసుకొని ప్రసాదమును 
స్వీకరించ వలెను. పూజా విధానం సంపూర్ణం.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Follow Us:
Download App:
  • android
  • ios