Asianet News TeluguAsianet News Telugu

ముక్కనుమ రోజు... ప్రయాణం చేయొచ్చా..?

సంక్రాంతిలో తొలిరోజైన భోగిన కీడుపండుగగానూ, రెండో రోజైన సంక్రాంతిని పెద్దల పండుగగానూ, మూడోరోజైన కనుమను పశువుల పండుగగానూ చేసుకునే జనం నాలుగో రోజున గ్రామదేవతలను తల్చుకుంటూ మాంసాహారాన్ని వండుకునే సంప్రదాయం కనిపిస్తుంది. అందుకనే ముక్కనుమను ముక్కల పండుగగా కూడా పిల్చుకోవడం జరిగింది.

Mukkanuma 2020: Fourth Day of Sankranti Festival in Andhra Pradesh
Author
Hyderabad, First Published Jan 11, 2020, 5:14 PM IST

మన భారతీయ హిందూ మత సంస్కృతి చాలా గొప్పనైనది అతి పురాతనమైనది. సంస్కృతి అంటే బాగుచేయునది అని అర్ధం. అనాది నుండి ప్రధానమైనది మతం - హిందూ మతము భాయాం రతా: = భారతా.. అనగా ఆత్మజ్ఞానము నందు ఆసక్తులైనవారు అని భావం. భారతీయ సంస్కృతి అంటే వైదిక లేక సనాతనమైనదని దానికి సంబంధించినదే వాజ్ఞయం, లలితకళలు, ఆచార వ్యవహారాములు. నియమాలు, కట్టుబాట్లు అనేవి వీటి పరిదిలోకి వస్తాయి. 

ఈ సంక్రాంతి పండుగలో నాల్గవరోజును ముక్కనుమ అంటారు. ముక్కనుమ నాడు సాధారణంగా మాంసాహార ప్రియులు తాము ఇష్టపడే వివిధ మాంసాహార వంటకాలను వండుకుని కుటుంబ, బంధు, మిత్రులతో కలిసి తిని ఆనందిస్తారు. పండుగలోని మొదటి మూడు రోజులు శాస్త్ర ప్రకారం కేవలం శాఖహారమే భుజించాలి. ఇది ఆరోగ్య సూత్రం కూడా. మాంసాహారం తినకూడదు.

ప్రకృతిలోని మార్పు వలన సప్తధాతువులతో మిలితమైన మానవ శరీరంలో కూడ మార్పునుచోటు చేసుకుంటుంది. మానవ శరీరానికి హాని కలుగకుండా ఉండేందుకే ఎక్కువగా నువ్వులతో ముడిపడియున్న పిండి వంటకాలను తయారు చేసారు. మూడవ రోజున కనుమ రోజున తమ పొలాలలో నిరంతరం శ్రమించే పశువులను గౌరవించి మన జీవన ప్రయాణంలో వాటి సహాయం లేనిదే మనిషికి మనుగడ లేదు కాబట్టి కృతజ్ఞత భావంతో రైతులు ఉదయాన్నే పశువులను, వాటి పాకలను శుభ్రంగా కడిగి అలంకరించి పూజలు చేస్తారు. 

పశువులకు ఇష్టమైన వాటిని తినిపిస్తారు. ఈ రోజు ప్రయాణాలు చేయుట ఆశుభంగా భావిస్తారు. మొదటి మూడు రోజుల్లోనూ పొంగలితో పాటు, సకినాలు, చేకోడిలు, కారంపూస, అరిసెలు, అప్పాలు, నువ్వులముద్దలు మొదలైన పిండి వంటలు చేసి తిని ఆనందిస్తారు. సంక్రాంతి పండుగ వస్తోందంటే చాలు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో చిన్నపెద్ద అనే తారతమ్యం భేదం లేకుండా గాలిపటాల ( పతంగుల )ను ఎగురవేసి ఆనందిస్తారు. 

ఈ పండుగ రోజులలో ప్రతిరోజూ వేకువజాముననే హరిదాసులు సంకీర్తనలు చేస్తూ ప్రతి ఇంటిటికి తిరిగి దానములు స్వీకరిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. ఇక గంగిరెద్దులవారు ఎద్దులకు ఆకర్షణీయ దుస్తులు, రంగులు అలంకరణగా వేసి వాటిని ఇంటి ముందరకు తెచ్చి విన్యాసాలు ఆడించి, పాటలు పాడి దానం స్వీకరిస్తారు. కొంతమంది కనుమ రోజు మాంసాహారం తినవచ్చునని అనుకుని వారికి వారే కల్పించుకుని తినేస్తుంటారు. అది ఎంత మాత్రం సరైనది కాదు. 

ఈ మకర సంక్రాంతితో సూర్యభగవాణుడు ఉత్తరాయణం వైపు ప్రయణం చేయడాన్నే ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. భోగి, సంక్రాంతి, కనుమ అనేవి దైవాన్ని, ప్రకృతిని, పశుపక్షాదులను అంటే మన జీవించడాని సహయపడిన ఇతర ప్రాణులను వాటిని గౌరవించి వాటిని పూజించుకునే గొప్పనైన సంస్కృతిని మన పూర్వీకులు వారు ఆచరించి మనకు తెలియజేసారు. కాలం మారుతున్నకొద్ది మన సనాతన సంస్కృతి సాంప్రదాయలను మరచిపోతున్నాం. ఇది ఎంత వరకు మంచిది,దేనికి మంచిది అనే విషయం ఒకసారి ఆలోచించాలి. 

కనుమ అంటే పశువులను గౌరవించి పూజించే పండగా అని చెప్పుకుంటాం. అంటే సాటి ప్రాణులను గౌరవించే సంస్కారం మనలో దైవత్వం ఉంటేనే వస్తుంది. అంతలోనే మాంసాహారం తినడంలో ఎంత వరకు న్యాయమో ఆలోచించాల్సి ఉంది. మన పెద్దలు పూర్వీకులు మన ఆరోగ్య సూత్రలను దృష్టిలో పెట్టుకుని ఆయా పండుగలలో ఆహార నియమాలను పాటించేలా చేశారు. వాటిని పెడచెవిన పెడితే ఎవరికి నష్టమనేది ఆలోచించాలి. నా ఉద్ధేశ్యం మాంసాహారం తినే వారిని వద్దని నేను చెప్పడం లేదు కాని ఈ భోగి, సంక్రాంతి, కనుమ అనే మూడు రోజుల పండగలలో మాంసాహార భక్షణ చేయాలనే నియమం ఎక్కడ లేదు. ఇది కేవలం వ్యక్తిగతంగా కల్పించుకున్నదే! 

సంక్రాంతిలో తొలిరోజైన భోగిన కీడుపండుగగానూ, రెండో రోజైన సంక్రాంతిని పెద్దల పండుగగానూ, మూడోరోజైన కనుమను పశువుల పండుగగానూ చేసుకునే జనం నాలుగో రోజున గ్రామదేవతలను తల్చుకుంటూ మాంసాహారాన్ని వండుకునే సంప్రదాయం కనిపిస్తుంది. అందుకనే ముక్కనుమను ముక్కల పండుగగా కూడా పిల్చుకోవడం జరిగింది.

సంక్రాంతిలో మూడోరోజైన కనుమరోజు గ్రామ పొలిమేర దాటకూడదన్న నియమం ఉంది. కాబట్టి ఇంటికి వచ్చిన ఆడపడుచులని సత్కరించుకుని, మనసారా బహుమతులు ఇచ్చుకుని ముక్కనుమరోజు వారికి వీడ్కోలు పలుకుతారు. కొంత మంది ముక్కనుమను కూడా పండుగగా భావించి, ముక్కనుమనాడు కూడా బయల్దేరకూడదని చెబుతుంటారు. కానీ ఈ విషయమై శాస్త్రపరంగా ఎలాంటి నియమమూ లేదు.

ముక్కనుమ రోజున కొత్త వధువుల ‘సావిత్రి గౌరీవ్రతం’ అనే వ్రతాన్ని పట్టడం కూడా కనిపిస్తుంది. ఇందుకోసం మట్టి ప్రతిమలను ప్రతిష్టించుకుని వాటికి తొమ్మిది రోజుల పాటు తొమ్మది రకాల పిండి వంటలు నివేదనం చేస్తారు. చివరికి ఆ బొమ్మలను నీటిలో నిమజ్జనం చేస్తారు. బోమ్మలతో చేసే వ్రతం కాబట్టి దీనికి బొమ్మల నోము అని కూడా పిలుచుకోవడం జరుగుతుంది.

కనుమనాడు రథం ముగ్గు వేస్తారు. కొందరు ముక్కనుమ రోజున కూడా రథం ముగ్గు వేస్తుంటారు. సంకురుడు ఉత్తరాయణం వైపుగా ప్రయాణం అయ్యే ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయనను సాగనంపేందుకు అన్నట్లుగా ఇలా రథం ముగ్గుని వేయడం ఆచారం. ఈ ముగ్గుకి ఉన్న కొసను మాత్రం ఇంటి బయటకు వెళ్లేలా దిద్దుతారు.

సంక్రాంతి నాలుగో రోజు మన ప్రక్క రాష్ట్రమైన తమిళనాడులో కూడా ఘనంగా జరుపుకొంటారు. వారు ఈ రోజుని కరినాళ్ అని పిలచుకుంటారు. ఈ రోజు చుట్టాలను, ఆత్మీయులను కలుసుకుంటే మంచిదని చెబుతారు. ఒకరకంగా బంధుత్వాలను కలుపుకునేందుకు, సంబంధీకుల మంచిచెడులను పరామర్శించేందుకు ఈ రోజున ప్రాముఖ్యతని ఇస్తారు. కొన్ని ప్రాంతాలలో  ఈ రోజున కుటుంబసమేతంగా వనభోజనాలకు వెళ్లే ఆనవాయితీ కూడా ఉంది.

Mukkanuma 2020: Fourth Day of Sankranti Festival in Andhra Pradesh

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Follow Us:
Download App:
  • android
  • ios