Asianet News TeluguAsianet News Telugu

శ్రీ కృష్ణాష్టమి స్మార్ధ, వైష్ణవ సాంప్రదాయ వేడుకలలో వ్యత్యాసం

శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి హిందూ ఇతిహాసాలలో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడుగా జన్మించాడు

differences of Krishnastami Celebrations
Author
Hyderabad, First Published Aug 30, 2021, 11:44 AM IST

 


        "కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షఃస్థలే కౌస్తుభం, నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం,
        సర్వాంగే హరిచందనంచ కలయం కంఠేచ ముక్తావళీ, గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణిః"

శ్రీకృష్ణుడు అంటే హిందూమతానికి, హిందూధర్మానికి అంతరాత్మ లాంటివాడు. కృష్ణుడు, రాముడు గుర్తురాకుండా హిందూమతం గుర్తుకురాదనే చెప్పవచ్చును.  నవభారత నిర్మాణానికి మూలపురుషుడుగా శ్రీకృష్ణుడు భారతదేశ చరిత్రకే కధానాయకుడు. శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి హిందూ ఇతిహాసాలలో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడుగా జన్మించాడు. కృష్ణుడి జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి సంతానంగా ఎనిమిదో గర్భంలో జన్మించాడు.


శ్రీకృష్ణుడి జననం:- శ్రీకృష్ణుని జనన కాల నిర్ణయం భాగవతం దశమస్కందం మూడవ ఆధ్యాయంలో శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు ఆ రోజు 'ప్రజాపతి' నక్షత్రం ఉందని తెలుపుతున్నది. ప్రజాపతి నక్షత్రం అంటే రోహిణి నక్షత్రం. విష్ణు పురాణంలో మొదటి ఆశ్వాసం - 5 వ అంశం ( శ్లోకం - 26 ) ఆధారంగా శ్రీ కృష్ణుడు శ్రావణ మాసంలో జన్మించాడనీ, అందులోనూ బహుళ పక్షంలో అష్టమి తిధి జరుగుతుండగా జన్మించడం జరిగిందని ఆధారంగా కనబడుతుంది. 

'హరి వంశం' సంస్కృత మూలం తీసి చూసినట్లైతే 52 ఆశ్వాసంలో పైన చెప్పిన తిధి, వారం, నక్షత్రం అన్ని కుడా జ్యోతిష గణాంకం ప్రకారం సరిపోతుంది. భాగవతం ఆధారంగా చూస్తే అర్ధరాత్రి కాలంలో శ్రీకృష్ణుడి జననం జరిగిందని తెలుస్తుంది. నా పిహెచ్.డి సిద్దాంత గ్రంధంలో కృష్ణుని జనన, మరణాల వివరాలను సహేతు బద్ధంగా, శాస్త్రీయమైన ఆధారాలతో ప్రస్తావించాను.


            "వసుదేవ సుతం దేవం - కంస చాణూర మర్దనం
            దేవకీ పరమానన్దం - కృష్ణం వందే జగద్గురుమ్"

            "చేతవెన్న ముద్ద చెంగల్వపూదండ
            బంగారు మొలతాడు పట్టుదట్టి
            సందె తావీదులు సరిమువ్వ గజ్జెలు
            చిన్ని కృష్ణ నిన్ను చేరికొలుతు"

కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఉయాల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. పుర వీధుల్లో ఉట్టి కట్టి యువతరం పోటీపడి కొడతారు. అందుకే ఈ పండుగని 'ఉట్ల పండుగ' లేదా 'ఉట్ల తిరునాళ్ళు' అని ప్రాంతాల వారిగా పిలుస్తారు. భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతిని వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది.

            
దుష్టశిక్షణ.. శిష్ట రక్షణ... అన్న గీతోపదేశంతో మానవాళికి దిశనిర్దేశం చేశారు కృష్ణభగవానుడు. మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించిన మార్గదర్శి ఆయన. మహా భాగవతం కథలను విన్నా... దృశ్యాలను తిలకించినా జీవితానికి సరిపడా విలువలెన్నో బోధపడతాయి. ఆ కావ్యం ఇప్పటి పరిస్థితులకు ఒక మార్గదర్శకంగా ఉండటం కృష్ణుడి మహోన్నత వ్యక్తిత్వానికి, ఆయన లీలలకు అద్దం పడుతోంది. ద్వాపరయుగంలో జన్మించిన కృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకే ఆయన్ను అందరూ తమ ఇష్టదైవంగా కొలుస్తున్నారు. వివిధ రూపాల్లో... సంప్రదాయాలతో... భక్తి ప్రపత్తులతో కృష్ణుడిని కొలుస్తున్న ఆయా రాష్ట్రాల వారి సంస్కృతి, సంప్రదాయాలు మన భారతీయ సంస్కృతికి విలక్షణమైన అందాన్ని తెస్తాయి.

కృష్ణాష్టమిని ఎలా జరుపుకుంటారు:- కృష్ణాష్టమి రోజున ప్రతి ఇంటా బాలకృష్ణుని చిన్న చిన్న పాదాలు లోగిల్లలో వేసి కృష్ణుడు ఇంట్లోకి రావాలని భక్తులు కోరుకుంటారు. ఇంటి ముఖ ద్వారాలకు పచ్చని మావిడాకు తోరణాలు, వివిధ పూవులతో తోరణాలు కడతారు. కృష్ణుడి విగ్రహాన్ని తడి వస్త్రంతో శుభ్రం చేసి.. చందనం, కుంకుమలతో తిలకం దిద్దుతారు. కృష్ణుని విగ్రహాన్ని, పూజా మందిరాన్ని పూవులతో అలంకరిస్తారు. అక్షింతలు, ధూపదీపాలతో స్వామి వారిని పూజిస్తారు. పూజాది క్రతువు పూర్తైన తర్వాత శ్రీకృష్ణ లీల ఘట్టాలని చదవాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. 

కృష్ణాష్టమి నాడు కేవలం భగవానుని పూజించడమే కాదు, అయనలోని కొన్ని మంచి లక్షణాలని అలవర్చుకోవాలి. ప్రతి విషయంలోనూ స్వార్ధం, ఈర్ష్య, అసూయలను కొంతైన విడనాడి.. మానవజన్మకు సార్ధకతని ఏర్పరచుకోవాలి. శ్రీకృష్ణుడు తన లీలల ద్వారా భక్తులకు జ్ఞానోపదేశం చేశాడు. ఆయన చేసిన అన్ని పనులలోను అర్థం పరమార్థం కనిపిస్తాయి. ధర్మ పరిరక్షణలో రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాడు. సకల పాపాలు తొలగిపోవాలంటే.... కృష్ణాష్టమి రోజున కృష్ణుని భక్తి శ్రద్దలతో పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయి. ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతాయని స్కాన్దపురాణం చెబుతుంది. 

ఆ రోజు గోమాతకు గ్రాసం తినబెట్టి మూడు ప్రదక్షిణలు చేస్తే సకల కోరికలు తీరుతాయని భవిష్యత్ పురాణం చెబుతుంది. సంతానం లేని వారు బాల కృష్ణుడిని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది.అదే విధంగా వివాహం కానివారు, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు రుక్మిణి కళ్యాణం పారాయణం చేయడం వల్ల వారికి వివాహ యోగం కలుగుతుంది. అలాగే శ్రీకృష్ణున్ని స్మరిస్తూ ఉంటే పరమాత్ముని కృప కలుగుతాయని భక్తులు నమ్ముతారు. ఇక శ్రీకృష్ణుడు వెన్న కోసం ఉట్టిలోని కుండలను పగలగొట్టినట్టే.. కృష్ణాష్టమి నాడు భక్తులంతా ఒక చోటికి చేరి ఉట్టికొట్టడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ఉట్టి కొట్టే వేడుకను భక్తులు ఎంతో సంబరంగా జరుపుకుంటారు.

 పండుగను వేర్వేరుగా జరుపుకునే స్మార్థులు, వైష్ణవులు:- ఈ కృష్ణాష్టమి పర్వదినాన్ని దేశంలో అందరూ ఒకే రోజు కాకుండా వేరు వేరుగా ఎందుకు చేసుకుంటారు పరిశీలిద్దాం.

స్మార్ధులు :- వీరిని రెండు ప్రధాన విభాగాలుగా విభజించవచ్చు: - 

(1) వైదికులు - వేదాలు నేర్చుకొని పఠించువారు, 

(2) నియోగులు - ఆయా రాజులు వీరిని అధికారిక స్థానాలలో ఉద్యోగులుగా నియమించబడినవారు. స్మార్ధులు అంటే జగద్గురు ఆది శంకరాచార్యునికి చెందిన అనుచరులు అని అనుకోవచ్చును.

వైష్ణవులు :- కేవలం విష్ణువుయందు మాత్రమే భక్తిని కలిగినవారు. పొరుగు రాష్ట్రం తమిళనాడు నుండి విశిష్ఠాద్వైతము అనుసరించే రామానుజాచార్యుడి అనుచరులు అయిన శ్రీ వైష్ణవం ఇతర ముఖ్యమైన శాఖ సమూహాలలో ఒకటి అయినది. వీరినే శ్రీ వైష్ణవులు అని అంటారు.

ఈ కృష్ణాష్టమిని ఇందులో స్మార్ధులు 'అష్టమి' తిధిని అనుసరించి జరుపుకుంటే.. వైష్ణవులు 'రోహిణి' నక్షత్రం ఉన్న రోజు జన్మాష్టమిని జరుపుకుంటారు.  ఈ 2021 సంవత్సరంలో కృష్ణాష్టమిని ఆగష్టు 30 తేదీ సోమవారం రోజు స్మార్ధులు జరుపుకుంటున్నారు,

శ్రీ వైష్ణవ సాంప్రదాయ ప్రకారం ఆగష్టు 31 తేది రోహిణి నక్షత్రం కలిసి ఉన్న రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకోనున్నారు. ఇక్కడ నక్షత్రానికి ప్రాధాన్యతను ఇస్తారు, ఇంకో విషయం గమనిస్తే కృష్ణుడు సింహమాసంలో జన్మించాడు. రవి సింహ సంక్రమణం చేసిన మాసంలో బహుళ అష్టమి తిధి రోజు రోహిణి నక్షత్రంతో కలిసి ఉన్న రోజు అవుతుంది కాబట్టి జన్మాష్టమి వేడుకల్ని ఆ రోజు జరుపుకోనున్నారు.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Follow Us:
Download App:
  • android
  • ios