Asianet News TeluguAsianet News Telugu

పుణ్యకార్యాలు చేసేదే 'అక్షయ తృతీయ' బంగారం కొనడం కాదు

ఈ అక్షయ తృతీయ రోజున మనం  ప్రారంభించే మంచి పని యొక్క పుణ్యం ఎప్పటికీ "క్షయం" కాకుండా అనంతకాలం "అక్షయం"గా ఉండిపోతుంది. ఈ రోజున కొన్నది అక్షయం అవుతుందని 'స్థిరంగా ఉండిపోతుందని' మోసపు వ్యాపార తప్పుడు ప్రచారాన్ని అమాయకంగా నమ్మి  ఎదో ఒకటి కొనుగోలు చేయడం, తన దగ్గర డబ్బులు లేకపోయినా అప్పుచేసి,లేదా ఇనిష్టాల్ మెంట్ స్కిములలో కొనేయడం అనేది ఆనవాయితీగా మారింది.

Akshaya Tritiya 2020: Worship Lord Vishnu and Mother Lakshmi
Author
Hyderabad, First Published Apr 25, 2020, 11:21 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Akshaya Tritiya 2020: Worship Lord Vishnu and Mother Lakshmi

వైశాఖ శుద్ధ తదియ ఏప్రిల్ 26 ఆదివారం రోజు అక్షయ తృతీయ. సంస్కృతంలో “అక్షయం” అంటే నాశనం లేనిది లేదా అనంతమైనది అని అర్ధం. ఈ అక్షయ తృతీయ సర్వసిద్ది ముహూర్తం. అంటే ఎంత పవిత్రమైన, మహిమాన్వితమైన ఈ రోజు ఏ పని ప్రారంభించినా విజయం సిద్దిస్తుంది. అక్షర తృతీయ అంటే దాన ధర్మాలు చేసి, పుణ్యం సంపాదించుకునే రోజు. అనవసమైన కల్పిత సెంటి మెంటు పెట్టుకుని బంగారం కోసం డబ్బులు ఖర్చు పెట్టే రోజు కాదు, అసలు ఈ రోజు బంగారం కొనవద్దు, కేవలం పుణ్య ఫలం సంపాదిచుకునే రోజు. 

ఈ అక్షయ తృతీయ రోజున మనం  ప్రారంభించే మంచి పని యొక్క పుణ్యం ఎప్పటికీ "క్షయం" కాకుండా అనంతకాలం "అక్షయం"గా ఉండిపోతుంది. ఈ రోజున కొన్నది అక్షయం అవుతుందని 'స్థిరంగా ఉండిపోతుందని' మోసపు వ్యాపార తప్పుడు ప్రచారాన్ని అమాయకంగా నమ్మి  ఎదో ఒకటి కొనుగోలు చేయడం, తన దగ్గర డబ్బులు లేకపోయినా అప్పుచేసి,లేదా ఇనిష్టాల్ మెంట్ స్కిములలో కొనేయడం అనేది ఆనవాయితీగా మారింది. వాస్తవానికి ఈ రోజు ఏ వస్తువు కొనకూడదు, కొంటేనే తప్పు. కేవలం దాన ధర్మాలకు, ఆధ్యతిక చింతనకు,సేవా దృక్పాదానికి ప్రత్యేకించి ప్రత్యేకత కలిగినదే అక్షయ తృతీయ.  

రోగులకు సేవ, పేదలకు అన్నదానం, గోవులకు, పశు పక్ష్యాదులకు గ్రాసం,దాన వేస్తూ త్రాగడానికి నీళ్ళను కుడా ఏర్పాటు చేయాలి. బాట సారులకు దాహార్తిని తీర్చడానికి కుండలలో నీళ్ళను నింపిన చలి వేంద్రములను ఏర్పాటు చేయడం, దైవ పూజ - వ్రతం, మంత్ర సాధన చేస్తూ ఈ కరోనా కాలంలో ఇంట్లో పనులు చేసుకుంటూనే భగవద్గీత పారాయణం చదువుతూనో ఆధ్యాత్మిక ఆడియో వినడం చేయండి. మధ్యాహ్నం తినే ముందు రెండు ముద్దలు పితృదేవతలకు పెట్టండి! కాకికి పెడితే పితరులకు, యమునికి, శని దేవునికి, కాలభైరవునికి పెట్టినట్టే. ఈ పుణ్యకార్యాల వలన మీ భవిష్యత్తు బంగారంగా మారుతుంది. కేవలం బంగారం కొనడం ద్వారా కాదు. బంగారం కొంటే లక్ష్మీదేవిని కొనేయడమే అనే భ్రమ నుంచి బయట పడండి.

అక్షయ తృతీయ పూజ విధానం :- ఇంట్లో ఈశాన్యం మూలలో పసుపుతో అలికిన పీటను వేసి ఎర్రటి వస్త్రాన్ని పరిచి, లక్ష్మీ, నారాయణుల విగ్రహాలను అమర్చాలి. లక్ష్మీ దేవి విగ్రహం నారాయణుని ఎడమ పక్క ఉండేట్లు అమర్చాలి. కొందరు లక్ష్మీ, కుబేరులను కూడా పూజిస్తారు. ఈ సందర్భంలో కుబేరునకు కుడి ప్రక్కన లక్ష్మీ దేవిని పెట్టి పూజించాలి. కుబేరుడు సర్వదేవతలకు కోశాధికారిగా  కీర్తింపబడ్డారు. వెండి దీపాలు లేదా ఇతర లోహపు దీపాలు లేదా ప్రమిదలలో ఒత్తులువేసి, ఆవు నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపాలను వెలిగించాలి.

 దూపం, అగరోత్తులను వెలిగించాలి. పూజ సమయంలో పసుపు, కుంకుమ, అక్షతలను భగవంతునికి సమర్పించాలి. పూజకు ముందు కొబ్బరి కాయ, పండ్లు, ఆకు చెక్కలను పీటపై నైవేద్యంగా ఉంచాలి. లక్ష్మీ, నారాయణులను మీ శక్తి మేరకు అష్టోత్తరాలను లేదా సహస్రం చదివి గృహానికి ఆహ్వానించి, నైవేద్యాన్ని స్వీకరించమని ప్రార్ధించాలి. నైవేద్యాన్ని సమర్పించిన పిమ్మట లక్ష్మీనారాయణుల ఆశీస్సులు కోరుకోవాలి. చివరిగా గంట కొడుతూ కర్పూర హారాతినివ్వాలి.

అక్షయ తృతీయకు విశిష్టతలు ఎన్నో ఉన్నాయి :-

ఈ పవిత్రమైన రోజు నాడే త్రేతాయుగం ప్రారంభమైనదని పెద్దలు అంటారు.

ఈ రోజే సింహాచలం దివ్యక్షేత్రం లో సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం మరియు చందనోత్సవం ప్రారంభించే రోజు.

ఈ రోజే దివ్య క్షేత్రం “బద్రీనాథ్” ఆలయ ద్వారాలు 4 నెలల దర్శన విరామం తర్వాత పునః దర్శనార్ధమై తెరుచుకోబడతాయి.

ఆదిశంకరుల వారు ఓ పేద వృద్ద జంట లబ్ది కోసం సృష్టిలో తొలిసారి “కనకధారాస్థవం” స్తుతించిన రోజు.

గంగమ్మ భువి పై ఉద్భవించిన రోజు ఈ రోజే.

అక్షయ తృతీయ నాడే వ్యాస మహర్షి “మహాభారతం” పవిత్ర గ్రంధాన్ని రచన ప్రారంబించిన రోజు.

ఈ రోజే  “అన్నపూర్ణ దేవి” అవతరించిన రోజు.

ఈ రోజే కుబేరుడు శివానుగ్రహాన్ని పొంది, మహలక్ష్మి ద్వారా అనంత సంపదను పొంది సంరక్షకుడిగా నియమింపబడ్డాడు.

శ్రీకృష్ణుడు ద్రౌదపదిని దుశ్సాసనుడి నుండి కాపాడిన రోజు.

శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుడు తెచ్చిన అటుకులను ఆరగించి అతనికి అపార సంపదను అనుగ్రహించిన రోజు.

సూర్యభగవానుడు అజ్ఞాతవాసంలో పాండవులకు “అక్షయపాత్ర”ను ఇచ్చిన రోజు.

ఒడిషా పూరి రథయాత్ర సంబరాల కొరకు నిర్మించే రథ నిర్మాణం ప్రారంబించే రోజు.

బృందావనంలోని బంకే బిహరి ఆలయంలో శ్రీకృష్ణుని పాదాలను దర్శించుకొనే అవకాశం ఒక్క అక్షయ తృతీయ రోజునే దక్కుతుంది.

అక్షయ తృతీయ నాడు చేసే పూజ ఫలితాలు :-

అక్షయ తృతీయ నాడు జ్ఞానాన్ని సంపాదించడం చేస్తే అనేక రెట్లు వృద్ది చెందుతుందని విశ్వాసం.

ఈ రోజు దానాలను చేయడం వల్ల జన్మ జన్మల పాపాలు నశించి దానగుణ సంపన్నుడుగా కీర్తి గడించగలరు.

ఈ రోజు దక్షిణావృత శంఖం ఇంటికి తెస్తే ఎంతో మంచిదట. ప్రతి పూజ ముగిసిన తరువాత శంఖం పూరించాలట.

ఈ రోజు పాదరసంతో చేసిన లక్ష్మీదేవి విగ్రహాన్ని పూజిస్తే మంచిది. రోజూ పూజిస్తే మంచి ఫలితాలు దక్కుతాయి.

ఈ రోజు గవ్వలను ఇంటికి తెచ్చి పూజిస్తే విశేష ఫలితాలు దక్కుతాయని పెద్దల అభిప్రాయం. గవ్వలకు లక్ష్మీదేవి దృష్టి ఆకర్షించగలిగే శక్తి ఉందట. వీటిని పసుపు, కుంకుమలతో పూజించాలి.

లక్ష్మీనారయణులను పూజిస్తే మంచి జరుగుతుంది.

చదువులో పిల్లలు విజయం సాధించటం కొరకై ఈ రోజు మజ్జిగ దానం చేస్తే మంచి జరుగుతుంది.

ఈ రోజు నూతన వస్త్రాలను లేదా పాత వస్త్రాలను బీదలకు దానం చేయటం ద్వారా మీకు మరియు మీ కుటుంబ సభ్యలకు ఆయురారోగ్యాలు చేకూరతాయి.

ఈ రోజు జంతువులకు ఆహారం వేయటం ద్వారా వాటి ప్రేమను యజమానికి రెట్టింపు చూపిస్తాయయి.

పురాణకథనం :- మత్స్య పురాణం అరవై ఐదవ అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ ప్రథమైన అక్షయ తృతీయ వ్రతం గూర్చి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణమేదైనా దాని ఫలితము అక్షయమౌతుంది. అలాగే పుణ్య కార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే, పాపకార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది. 

ఈ నాడు తృతీయా తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది. అందుచే విశేష పూజనీయమైనది. ఈ నాడు ఉపవాస దీక్ష జరిపి ఏ పుణ్య కర్మనాచరించినా కూడా తత్సంబంధ ఫలము అక్షయముగానే లభిస్తుంది. ఈ తిథినాడు అక్షయుడైన విష్ణువు పూజింపబడతాడు. అందుకే దీనికి అక్షయ తృతీయ అని పేరు. ఈ రోజు అక్షతోదకముతో స్నానం చేసి, అక్షతలను విష్ణు భగవానుని పాదములపై పెట్టి , అర్చించి, తరువాత ఆ బియ్యములో కొన్ని తీసి గోవునకు ఆహారంగా అరటి పండ్లు ,బెల్లం కలిపి దానమిచ్చి మిగిలిన బియ్యంతో ఏదైని రూపంలో వండి దైవ ప్రసాద భావనతో స్వీకరించి భోజనం చేసిన వారికి ఈ ఫలం తప్పక కలుగుతుంది అని పురాణంలో ఈశ్వర వాక్కు. 

ఇలా ఒక్క వైశాఖ శుక్ల తదియనాడు పైన చెప్పిన విధంగా నియమంతో అక్షయ తృతీయా వ్రతాన్ని ఆచరించిన తరువాత వచ్చే 12 మాసాలలో శుక్ల తృతీయ నాడు ఉపవసించి విష్ణువును ప్రీతితో అర్చిస్తే రాజసూయ యాగము చేసిన ఫలితము కలిగి అంత్యమున ముక్తిని పొందగలడు. అక్షతలు అంటే ఏ మాత్రము విరగని, పగుళ్ళు లేని, గట్టిగా ఉన్న బియ్యము. అవి వరి ధాన్యము నుండి కావచ్చు, గోధుమ ధాన్యము నుండి కావచ్చు, యవల నుండి కావచ్చు. ఇటువంటి వాటితో సిద్ధం చేసిన ఆహారమును అక్షతాన్నము లేదా అక్షతాహారము అంటారు.

శ్రీ నారద పురాణం ప్రకారంగా :- ఈ రోజు  చేయు దాన ధర్మాలు అత్యధిక ఫలాన్నిస్తాయని చెపుతోంది. ఈ రోజు దానం, ధర్మం చేయటమే అక్షయ ఫలితాన్ని ఇస్తుంటే, అక్షయ తృతీయ దానం చేసిన వాని ఫలితం సహస్రాదిత్య సంకాశుడై, సర్వకామ సమన్వితుడై, బంగారము, రత్నములతో కూడి చిత్రహంసలతో కూడిన విమానములో తన పితృదేవతలతో కల్పకోటి కల్పములు, కల్పకోటి సహస్రముల కాలము బ్రహ్మ లోకమున విరాజిల్లును. స్వర్గంలో ఉన్న పితృదేవతలకు మోక్షము చేకూర్చిన వారు అవుతారు. స్వయముగా జ్ఞానియై, అవిద్యను జ్ఞాన ఖడ్గముచే ఖండించగల పరమ వైరాగ్యమును పొంది పరబ్రహ్మమును పొందును. ఇటువంటి పుణ్య ఫలములెన్నో చెప్పబడినవి.

Follow Us:
Download App:
  • android
  • ios