అమెరికా బాస్కెట్ బాల్ దిగ్గజం కోబ్ బ్రియాంట్ మృతికి ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. బ్రియాంట్ మృతి పట్ల విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కాలిఫోర్నియా: అమెరికా బాస్కెట్ బాల్ దిగ్గజం కోబ్ బ్రియాంట్ ఆకస్మిక మృతికి ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. హెలికాప్టర్ కుప్ప కూలి మంటల్లో చిక్కుకోవడంతో బ్రియాంట్ తో పాటు అతని కూతురు కూడా మరణించింది. ప్రమాదంలో మొత్తం 9 మంది మరణించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

బ్రియాంట్ మృతికి ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైఎస్ కెప్టెన్ రోహిత్ శర్మ సంతాపం వ్యక్తం చేశారు. ఈ వార్త వినడం దురదృష్టకరమని, ఇది తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన అన్నారు. జీవితమనేది ఊహించలేనదని, ప్రమాదంలో బ్రియాంట్ తో పాటు అతని కూతరు మరణించడం కలచివేస్తోందని ఆయన అన్నాడు. 

Also Read: కూలిన హెలికాప్టర్: బాస్కెట్ బాల్ దిగ్గజం, ఆయన కూతురు మృతి

వారి ఆత్మకు శాంతి కలగాలని, ఆ కుటుంబానికి మనో ధైర్యం ఇవ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నానని ఆయన తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో అన్నాడు. ఇది యావత్తు క్రీడా ప్రపంచానికి దుర్దినమని, ఒక దిగ్గజాన్ని క్రీడాలోకం కోల్పోయిందని రోహిత్ శర్మ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో అన్నాడు. బ్రియాంట్ , అతని కూతురు గియానా అత్మలకు శాంతి కలగాలని ఆయన అన్నాడు.

బ్రియాంట్ మరణంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా విచారం వ్యక్తం చేశారు. అమెరికా ఓ దిగ్గజ ఆటగాడిని కోల్పోయిందని, అతడు దేశంలో బాస్కెట్ బాల్ అభివృద్ధికి విశేషమైన కృషి చేశాడని అన్నారు. అమెరికా క్రీడా చరిత్రలో ఇది అత్యంత విషాదకరమైన ఘటన అని వారన్నారు. అమెరికన్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ (ఎన్ బీఏ) కూడా బ్రియాంట్ మృతికి సంతాపం తెలిపింది.

బ్రియాంట్, అతని కూతురు మరణవార్త తెలిసి తాను దిగ్భ్రాంతికి గురైనట్లు తెలంగాణ మంత్రి కేటీ రామారావు అన్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన బ్రియాంట్ మృతిపై స్పందించారు. ప్రపంచ స్థాయి ఆటగాడికి తన కన్నీటి వీడ్కోలు అని ఆయన అన్నారు.