Asianet News TeluguAsianet News Telugu

Eatela Rajender effect: కేసీఆర్ మంత్రివర్గంలోకి సీనియర్ టీఆర్ఎస్ నేతలు

తెలంగాణ సీఎం కేసీఆర్ తన మంత్రివర్గాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పునర్వ్యస్థీకరించే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత తమ మంత్రివర్గాన్ని కడియం శ్రీహరి వంటి సీనియర్లతో భర్తీ చేస్తారని భావిస్తున్నారు.

Eatela Rajender effect: KCR may induct TRS seniors into his cabinet
Author
Hyderabad, First Published Nov 13, 2021, 9:47 AM IST

హుజూరాబాద్ శాసనసభ ఉప ఎన్నికలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ విజయం తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు మీద తీవ్రమైవ ప్రభావం చూపినట్లే కనిపిస్తోంది. కొత్త నాయకులను ప్రోత్సహిస్తూ సీనియర్ నేతలను పక్కన పెడితే భవిష్యత్తులో సంభవించడానికి అవకాశం ఉన్నప్రమాదాన్ని ఆయన పసిగట్టినట్లే ఉన్నారు. ఓ వైపు బిజెపి, మరో వైపు కాంగ్రెసు చురుగ్గా వ్యవహరించి, బలం పుంజుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల వల్ల తమ పార్టీకి చెందిన విస్మృత నేతలు విధేయతలు మార్చే ప్రమాదం ఉందని KCR పసిగట్టినట్లు అర్థమవుతోంది. దీంతో వచ్చే మంత్రి వర్గ విస్తరణలో సీనియర్ నేతలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

Eatela Rajender ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత ఆ ఖాళీని కేసీఆర్ భర్తీ చేస్తారని భావించారు. కానీ ఆయన అందుకు పూనుకోలేదు. ఈటల రాజేందర్ వద్ద వైద్య ఆరోగ్య శాఖను తన వద్దనే పెట్టుకున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ముగిసిన తర్వాత ఆ శాఖను ఆర్థిక మంత్రి హరీష్ రావుకు ఇచ్చారు. దీన్నిబట్టి మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో జరిగే అవకాశం లేనట్లు భావిస్తున్నారు. 

కేసీఆర్ తన మంత్రివర్గాన్ని MLC Elections ముగిసిన తర్వాత పునర్వ్యస్థీకరించే అవకాశం ఉంది. జనవరిలో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగుస్తాయి. ఆ తర్వాత ఫిబ్రవరి వరకు మంచి రోజులు లేవు. దీంతో ఫిబ్రవరిలో కేసీఆర్ తన మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశాలున్నాయి. ఈటల రాజేందర్ ను తొలగించిన తర్వాత మంత్రివర్గంలో ఒక ఖాళీ ఏర్పడింది. ఈ ఒక్క ఖాళీని పూరించడానికి బదులు మంత్రివర్గం మొత్తాన్ని ఆయన పునర్వ్యస్థీకరించాలని భావిస్తున్నారు. 

శాసనమండలిలో 18 ఖాళీల భర్తికి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎమ్మెల్యే కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు నవంబర్ 29వ తేదీన పోలింగ్ జరుగుతుంది. స్థానిక సంస్థల కోటాలో 12 స్థానాలకు డిసెంబర్ 10వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఈ 12మంది ఎమ్మెల్యేలు జనవరి 4వ తేదీ తర్వాత మాత్రమే ప్రమాణం చేసే అవకాశం ఉంది. 

Also Read: బాధ్యతలు అప్పగించడమే తడువు... వైద్యారోగ్య మంత్రిగా హరీష్ కీలక నిర్ణయాలు

ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తర్వాత చేపట్టే Cabinet Expansionలో కేసీఆర్ కొద్ది మంది మంత్రులను తొలగించే అవకాశం ఉంది. పనితీరు బాగా లేని మంత్రులను తొలగించి కొత్తవారిని ఆ స్థానాల్లో తీసుకుంటారని సమచారం. ఈ సమయంలోనే సీనియర్లకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని అంటున్నారు. ఎమ్మెల్సీగా నామినేట్ చేసి శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది. 

మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన ఈటల రాజేందర్ బీసీ వర్గానికి చెందినవారు. దీంతో ఆ స్థానంలో బీసీ నాయకుడికి స్థానం కల్పించే అవకాశం ఉంది. టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిన ఎల్ రమణకు ఆ అవకాశం దక్కవచ్చునని ప్రచారం జరుగుతోంది. టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న L Ramana ఆ పార్టీకి రాజీనామా చేసి హుజూరాబాద్ ఎన్నికలకు మందు టీఆర్ఎస్ లో చేరారు. దీంతో ఆయనను శాసన మండలికి ఎంపిక చేసి మంత్రి పదవి ఇచ్చే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

ఎస్సీ కోటాలో మాజీ ఉప ముఖ్యమంత్రి Kadiam Srihariకి కేసీఆర్ మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. ఐదుగురు ఎమ్మెల్సీలతో పాటు కడియం శ్రీహరి పదవీ కాలం జూన్ నెలలో ముగిసింది. అప్పటి నుంచి ఆయనకు ఏ విధమైన అవకాశం కూడా కల్పించలేదు. దీంతో ఆయనను కూడా మరోసారి శాసన మండలికి ఎంపికి చేయించి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే సమయంలో బాల్క సుమన్ కు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించడానికి కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే అయిన బాల్క సుమన్ హుజూరాబాద్, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో విస్తృ,తంగా పనిచేశారు ఎస్సీ కోటాలోనే ఆయనకు మంత్రి పదవి లభించవచ్చునని అంటున్నారు.

మొత్తం మీద, కేసీఆర్ ఫిబ్రవరిలో ఎన్నికల మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోనున్నట్లు అర్థమవుతోంది. తమను విస్మరించారని, తమను వదిలేశారని భావించడానికి అవకాశం లేకుండా సీనియర్ నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios