Asianet News TeluguAsianet News Telugu

ఈసీ రమేష్ కుమార్ తో జగన్ చెలగాటం... పిల్లలకు ప్రాణసంకటం!

అన్ని రాష్ట్రాలు పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి అని షట్ డౌన్ దిశగా వెళుతుంటే... ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం ఎందుకు పిల్లలకు కూడా సెలవులు ఇవ్వకుండా ఇంతలా పంతానికి పోతుందనే ఆలోచన మనస్సులో మెదలడం సహజం. 

Coronavirus: Jagan's interest over local body elections is putting the children health at risk
Author
Amaravathi, First Published Mar 18, 2020, 12:16 PM IST

ప్రపంచమంతా కరోనా వైరస్ కరాళ నృత్యానికి వణికిపోతుంది. ప్రజలు ఆ వైరస్ పేరు చెబితేనే బెంబేలెత్తిపోతున్నారు. మందు లేక హెచ్ఐవి కి వాడే మందులనే ప్రస్తుతానికి అన్ని దేశాల్లో వాడుతున్నారు. ఆ వ్యాధి భారతదేశంపై పంజా విసురుతున్నవేళ భారత సర్కార్ కూడా అప్రమత్తమైంది. 

భారత సర్కార్ రాష్ట్రాలకు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం వైరస్ ను చాలా తీవ్రంగా పరిగణించింది. కరోనా కేసులు నమోదవుతుండడంతో..... స్కూళ్లకు, కాలేజీలకు సెలవులను ప్రకటించింది. 

క్లబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేసింది. కోచింగ్ సెంటర్లు హాస్టళ్లను కూడా ఖాళీ చేయించింది. ముఖ్యంగా పిల్లలతో ఎటువంటి రిస్క్ తీసుకోకుండా వారి ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ ముందుకెళుతోంది తెలంగాణ సర్కార్. 

మరోపక్క మరో తెలుగు రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ లో కనీసం స్కూళ్లకు సెలవులు కూడా ఇవ్వకుండా రాష్ట్రంలో కరోనా ప్రభావమసలే లేదు, నమోదయింది కేవలం ఒకటే కేసని అంటున్నారు. 

ఇక్కడే ఒక ప్రశ్న... అన్ని రాష్ట్రాలు పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి అని షట్ డౌన్ దిశగా వెళుతుంటే... ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం ఎందుకు పిల్లలకు కూడా సెలవులు ఇవ్వకుండా ఇంతలా పంతానికి పోతుందనే ఆలోచన మనస్సులో మెదలడం సహజం. 

బహుశా జగన్ గారు పారాసిటమాల్ వల్ల తగ్గే రోగం కాబట్టి జనాలెవ్వరు భయభ్రాంతులకు గురవ్వకుండా ఉండేందుకు, ప్రజల్లో ఉన్న ఆందోళనలను తొలిగించేందుకు, పరిస్థితంతా నార్మల్ గా ఉందని చూపెట్టేందుకు ఉపయోగపడుతుందని అనిపించినప్పటికీ.... వాస్తవానికి మాత్రం ఇక్కడ మరో విషయం దాగున్నట్టు పరిస్థితులను బట్టి చూస్తుంటే అవగతమవుతుంది. 

Also read: పారాసిటమాల్ వ్యాఖ్యలు: కేసీఆర్ కు జగన్ కి మధ్య తేడా ఇదే!

రాష్ట్రంలో ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చాలా ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన ఆ కోపాన్ని బహిరంగంగానే ప్రెస్ మీట్ పెట్టి మరీ తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే!

ఇలా ఎన్నికలను వాయిదా వేయడంపై ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీమ్ కోర్టుకెక్కింది ఆంధ్రప్రదేశ్ సర్కార్. స్థానిక సంస్థల ఎన్నికలను తక్షణం నిర్వహించాలని కోరుతూ... సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 

ఇలా ఎన్నికలను నిర్వహించామని పిటిషన్ దాఖలు చేసినప్పుడు కోర్టు ఖచ్చితంగా రాష్ట్రంలో కరోనా ప్రభావం ఎలా ఉంది అనే విషయాన్నీ ఆరా తీస్తుంది. అప్పుడు పరిస్థితంతా మామూలుగా ఉంది అని తెలియజెప్పడానికి ప్రభుత్వం స్కూళ్లతో సహా రాష్ట్రంలో అన్ని పరిస్థితులు సామాన్యంగానే ఉన్నాయని, భయపడాల్సిన పనిలేదని, కొరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటామని చెప్పడానికి వీలవుతుంది. 

కాకపోతే ఇక్కడే ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఒక చిన్న బేసిక్ పాయింటే మర్చిపోతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బాలట్ బాక్సుల వినియోగం ఉంటుంది. స్వస్తిక్ ముద్ర వేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ప్రజల చేతులను తాకి మాత్రమే సిరా గుర్తును పెట్టాల్సి ఉంటది. 

ఇలా ప్రపంచమంతా కరచాలనాలకు కూడా దూరంగా ఉండమంటుంటే... ఇక్కడేమో కాంటాక్ట్ తప్పనిసరి అవుతుంది. ఇలా అంతమంది చేతులను తాకడం, ఒకటే సిరా బుడ్డిలో ముంచి ముంచి పూయడం ఇలాంటి వాటివల్ల ఒక వేళ వైరస్ ఉంటె అది ఖచ్చితంగా వ్యాప్తి చెందుతుంది. 

Also read: జగన్ ను ఫాలో అవుతున్నకేసీఆర్: చింతమనేనికి పట్టిన గతే రేవంత్ రెడ్డికి!

మన భారతదేశంలో వైరస్ 6 రోజుల్లో రెట్టింపు అయ్యింది. రోజు రోజుకి కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలను అభ్యర్థులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ దఫా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ లెవెల్ లో హింస నమోదయిందో మనందరికీ తెలిసిన విషయమే!

స్థానిక ఎన్నికల ఖర్చు ఏ రేంజ్ లో ఉంటుందో వేరుగా చెప్పనవసరం లేదు. ఈ ఎన్నికల కోసం తమవారిని వేరే ఊర్ల నుండి దేశాల నుండి పిలిపించుకుంటారు. 

వైరస్ లక్షణాలు బయటపడడానికి కనీసం మూడు నుంచి నాలుగు రోజులు పడుతుంది. కొందరిలో జ్వరం కూడా ఉండదు. ఇలాంటి వ్యక్తి గనుక వచ్చి ఒక్కసారి ఎన్నికలప్పుడు తిరిగితే... దాని ప్రభావానికి చాలామంది గురవ్వాల్సి వస్తుంది. 

హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల నుంచి చాలామంది ప్రజలు ఆంధ్రప్రదేశ్ కి రావడం అనేది ఖచ్చితం. అలాంటప్పుడు వారిలో ఏ ఒక్కరికన్నా వైరస్ ఉంటె... ఎన్నికప్పుడు అందరిని కలవడం జరుగుతుంది. దాదాపుగా ఒక ఊరికే అది సోకె ప్రమాదముంది. 

ప్రపంచ ఆరోగ్య సంస్థే కరోనా ను మహమ్మారిగా ప్రకటించినా, ప్రపంచ దేశాలన్నీ రెడ్ అలెర్ట్ లు ప్రకటించిన, పక్కనున్న మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ స్కూళ్ల నుండి షాపింగ్ మాల్స్ వరకు అన్నిటిని బంద్ చేసినా జగన్ మాత్రం ఎన్నికలను నిర్వహించడం మీదనే దృష్టి పెట్టడం, ఆ ఎన్నిక కోసం సుప్రీమ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, పరిస్థితులు మామూలుగా ఉన్నాయని ప్రూవ్ చేయడం కోసం ఇలా పిల్లల ఆరోగ్య పరిస్థితిని పణంగా పెట్టడం నిజంగా శోచనీయం. 

Follow Us:
Download App:
  • android
  • ios