Asianet News TeluguAsianet News Telugu

మూడు రాజధానులు: వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజల విశ్వాసం కోల్పోయారా?

అనూహ్యంగా ముందుకొచ్చిన ఈ రాజధాని మార్పు అనే అంశం వల్ల ప్రజలు ప్రభుత్వంపై నమ్మకాన్ని కోల్పోయారు అనే అనుమానం మాత్రం కలుగక మానదు. అది వైసీపీ ప్రభుత్వమా లేక టీడీపీ ప్రభుత్వమా అనే విషయం అప్రస్తుతం. అధికారం చేతులు మారగానే ప్రభుత్వ విధానాల మార్పు అనే అంశం వల్ల రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రభుత్వంపై  మాత్రం నమ్మకం కోల్పోయారనేది వాస్తవం. 

3 capitals issue: YS Jagan loosing the people's confidence after Amaravathi
Author
Amaravathi, First Published Feb 5, 2020, 11:26 AM IST

ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం పేరు ఎత్తగానే ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నమాట ఏదైనా ఉందంటే... అది రాష్ట్రానికి మూడు రాజధానుల అంశమే. ఒక పక్క అమరావతి ప్రాంత రైతులేమో రాజధానిని అమరావతి నుంచి తరలించొద్దంటూ పెద్ద ఎత్తున నిరసనలు చేస్తుంటే.... మరొపక్కనేమో జగన్ సర్కార్ ఎలాగైనా సరే కార్యనిర్వాహక రాజధానిని విశాఖకు మార్చాలని కృతనిశ్చయంతో ఉంది. 

రాష్ట్రంలో రాజకీయ వేడి కూడా ఈ రాజధానుల అంశం పుణ్యమాని ఒక్కసారిగా కాక అందుకుంది. అసెంబ్లీ చర్చల దగ్గర మొదలయి శాసన మండలి రద్దు తీర్మానం వరకు వెళ్లేంతలా రాజకీయ వాతావరణం వేడెక్కింది. 

ఈ మూడు రాజధానుల అంశంపై నడుస్తున్న రాజకీయ పరిణామాలు అటుంచితే.... ఇలా అనూహ్యంగా ముందుకొచ్చిన ఈ రాజధాని మార్పు అనే అంశం వల్ల ప్రజలు ప్రభుత్వంపై నమ్మకాన్ని కోల్పోయారు అనే అనుమానం మాత్రం కలుగక మానదు.

అది వైసీపీ ప్రభుత్వమా లేక టీడీపీ ప్రభుత్వమా అనే విషయం అప్రస్తుతం. అధికారం చేతులు మారగానే ప్రభుత్వ విధానాల మార్పు అనే అంశం వల్ల రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రభుత్వంపై  మాత్రం నమ్మకం కోల్పోయారనేది వాస్తవం. 

Also read: ఏపీకి 'విశాలాంధ్ర' దౌర్భాగ్యం: 60 ఏళ్ల నాటి దుస్థితి రిపీట్

జగన్ సర్కార్ అధికారంలోకి రాగానే అమరావతిని మాత్రమే రాజధానిగా కొనసాగించకుండా విశాఖకు అధిక ప్రాధాన్యం ఇవ్వడానికి సంకల్పించడం, తద్వారా అమరావతిలో రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడంతో వారంతా రోడ్లెక్కారు. 

ల్యాండ్ పూలింగ్ పేరుతో అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతుల దగ్గర నుండి భూములను అడిగితే వారు అత్యంత సారవంతమైన జరీబు భూములను ప్రభుత్వానికి అప్పగించారు. భవిష్యత్తులో తమ భూములకు ఎక్కువ విలువ వస్తుందనే నమ్మకంతో వారు అలా మూడు పంటలను పండే భూములను సైతం అప్పగించేశారు. 

5 సంవత్సరాలు ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఇప్పుడు ఆ రైతులు కన్న కలలన్ని ఆవిరయిపోయి ఇప్పుడు వారు తమ జీవనభృతిని కోల్పోయి రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు. దానితోపాటు రైతులు ఇప్పుడు తమకు పెట్టిన పెయిడ్ ఆర్టిస్ట్ అనే పేరు వల్ల అవమాన భారంతో దేశానికి వెన్నుముకైన రైతు కృంగిపోతున్నాడు. 

ఇలా అర్థాంతరంగా ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మరో ప్రభుత్వం అర్థాంతరంగా రద్దు చేయడంతో ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయింది. అమరావతి నిర్ణయాన్ని జగన్ సర్కార్ ఒక్క కలంపోటుతో మార్చడానికి సిద్ధపడినప్పుడు ఒకవేళ గనుక వచ్చేసారి నూతన ప్రభుత్వం ఏర్పడితే వారు విశాఖ నుంచి కార్యనిర్వాహక రాజధానిని తరలించారని గ్యారంటీ ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. 

మనకు ఈ విషయం తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ల్యాండ్ పూలింగ్ జీవో ను చూస్తే మనకు అర్థమవుతుంది. విశాఖపట్నంలో జగన్ సర్కార్ దాదాపుగా 6వేల ఎకరాలు కావాలని ఒక ప్రకటనను విడుదల చేసింది. 

గృహసముదాయాల నిర్మాణం కోసం ప్రభుత్వం ఇలా ప్రకటనను విడుదల చేసినప్పటికీ.... అక్కడే కార్యనిర్వాహక రాజధాని ఏర్పడుతున్నప్పటికీ ప్రజలు మాత్రం ప్రభుత్వాన్ని నామమెందుకు సిద్ధంగా లేరు. 

అమరావతి రైతులకు పట్టిన గతే తమకు పట్టదని గ్యారంటీ ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. కేవలం 6వేల ఎకరాల కోసమే ప్రభుత్వం ఇంతలా కష్టపడుతుంటే.... అవతల అమరావతి రైతులేమో దాదాపుగా 33వేల ఎకరాలను ఇచ్చారు. 

Also read: బాబు, జగన్ ల "రైతు రాజకీయం"... అమరావతి నేర్పిన పాఠాలు ఇవే...

అక్కడ పనిచేసిన ల్యాండ్ పూలింగ్ ఇక్కడ పనిచేయడం లేదు. సాధారణంగా ప్రభుత్వ ప్రాజెక్టులకు భూముల సేకరణ ఒక పెద్ద తలోనొప్పిగా పరిణమిస్తున్న తరుణంలో... ఇలా రైతులను అందు,లో భాగస్వామ్యం చేసి, వారికి కూడా అభివృద్ధిలో వాటా ఇవ్వడం అనే కాన్సెప్ట్ తో భూ సేకరణ చాలా సులభతరమయింది. 

కానీ ఇప్పుడు అలంటి ఒక వినూత్నమైన ల్యాండ్ పూలింగ్ పనికి రాకుండా పోయింది. పనికి రాకుండా పోయిందనేకంటే.... ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఆ పద్ధతిపై ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయి ఆ మోడల్ ఇప్పుడు వ్యర్థంగా పనికి రాకుండా అయిపోయింది. దీనికి ముమ్మాటికీ కారణం ప్రభుత్వ విధానాలే అని చెప్పడంలో సందేహం లేదు. 

ఇప్పుడు విశాఖపట్నంలోని రైతులు సైతం ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోబట్టే ఇలా భూములు ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నారు. రైతులు ఇంకొక అడుగు ముందుకేసి తమ భూముల జోలికి వస్తే కోర్టును కూడా ఆశ్రయించడానికి వెనకాడడం లేరు. 

ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, కొనసాగుతున్న రాజధాని రాజకీయాల వల్ల కేవలం ఏదో ఒక ప్రాంతానికి మాత్రమే నష్టం జరుగుతుందన్నట్టుగా కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై బయట నుండి వచ్చే పెట్టుబడిదారులు మాత్రమే కాకుండా ఇప్పుడు సొంత రాష్ట్ర ప్రజలు కూడా నమ్మకాన్ని కోల్పోవడం, కోల్పోతూ ఉండడం నిజంగా శోచనీయం. 

Follow Us:
Download App:
  • android
  • ios