రోడ్డు ప్రమాదంలో ప్రముఖ యోగా గురువు మృతి
ఉత్తర ప్రదేశ్ లో కనౌజ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఎదురెదురుగా వచ్చి ఢీ కొట్టుకోవడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఉత్తర ప్రదేశ్ కు చెందిన ప్రముఖ యోగా గురువుతో పాటు, ఓ కాంగ్రెస్ నాయకుడు మృతి చెందారు.
ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్ కు చెందిన యోగా గురువు లక్ష్మీపతి వర్మ ప్రయాణిస్తున్న కారు ఫాగుహా బాటియా ప్రాంతంలో ప్రమాదానికి గురయ్యింది. హైవేపై వేగంగా వెళుతున్న మరో కారు ఈయన కారును ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదాన్ని గమనించకుండా వచ్చిన మరో కారు ఈ రెండు కార్లను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మీపతి వర్మ తో పాటు మరో కారులో వున్న కాంగ్రెస్ నాయకుడు ధరం రాజ్ వర్మ అతడితో పాటు వున్న హరి మోహన్ అగర్వాల్ లు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మృతి చెందిన యోగా గురువు ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ కు అత్యంత సన్నిహితుడు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అలాగే మృతదేహాలను కూడా పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.