అసలు పరీక్ష ఇదే: ముందే యడ్యూరప్పకు ముప్పు?
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బిఎస్ యడ్యూరప్పకు బలనిరూపణకన్నా ముందే ముప్పు పొంచి ఉంది.
బెంగళూరు: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బిఎస్ యడ్యూరప్పకు బలనిరూపణకన్నా ముందే ముప్పు పొంచి ఉంది. శాసనసభ స్పీకర్ ఎన్నిక ముఖ్యమంత్రిగా ఆయన మనుగడకు పరీక్ష కానుంది.
శాసనసభ విశ్వాసం పొందేందుకు యడ్యూరప్పకు గవర్నర్ వాజూభాయ్ వాలా 15 రోజుల గడువు ఇచ్చారు. ఈ 15 రోజులు కాంగ్రెసు, జెడి(ఎస్) సభ్యులు కలిసికట్టుగా ఉంటే యడ్యూరప్ప పదవికి ముప్పు వాటిల్లవచ్చు.
యడ్యూరప్ప ప్రతిపాదించే విశ్వాస తీర్మానంపై శాసనసభలో చర్చ జరగడానికి ముందు స్పీకర్ ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. శాసనసభ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించేందుకు తాత్కాలిక స్పీకర్ గా కాంగ్రెసు ఎమ్మెల్యే ఆర్ఎస్ దేశ్ పాండే నియమితులయ్యారు
ప్రస్తుతం బిజెపికి 104 మంది శాసనసభ్యులు మాత్రమే ఉన్నారు జెడిఎస్ కు 38 మంది, కాంగ్రెసుకు 78 మంది ఎన్నికయ్యారు. వీరంతా పార్టీ ఫిరాయించకుండా, శాసనసభకు వచ్చి స్పీకర్ ఎన్నికలో పాలు పంచుకుంటే బిజెపి అభ్యర్థి స్పీకర్ గా ఎన్నిక కావడం కష్టమవుతుంది.
స్పీకర్ పదవికి బిజెపి అభ్యర్థి ఎన్నిక కాకపోతే దాంతో యడ్యూరప్ప కథ ముగుస్తుందని అంటున్నారు. అంతేకాకుండా, శాసనసభ స్పీకర్ ను ఎన్నుకోలేకపోతే తాత్కాలిక స్పీకర్ బల పరీక్ష నిర్వహించవచ్చునని కూడా అంటున్నారు.
ఇలా చూస్తే, యడ్యూరప్ప విశ్వాస పరీక్ష నెగ్గడం కష్టమే. ఆయన మూడు పర్యాయాలు ముఖ్యమంత్రి అయినప్పటికీ పూర్తి కాలం ఆ పదవిలో కొనసాగిన దాఖలాలు లేవు.