టీడీపీలో ఆ కీలకనేతలంతా.. వైసీపీ వైపే
టీడీపీలోని కీలకనేతలు పలువురు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి తెలిపారు. ఆ కీలక నేతలంతా తమతో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారని చెప్పారు. జగన్ ఒకే అంటే చాలు పార్టీలో చేరేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారని కూడా అన్నారు.
విశాఖ పాతగాజువాకలో వైసీపీ దీక్షాశిబిరాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఎర్రచందనం విక్రయిస్తే వచ్చే డబ్బుతో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు.. చైనాకు అటవీ కార్యదర్శిని పంపి రూ.10 వేల కోట్ల చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. 29 సార్లు ఢిల్లీ వెళ్లినా గుర్తుకురాని ప్రత్యేక హోదా ఇప్పటికిప్పుడు గుర్తుకు రావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు, లోకేశ్ అవినీతిపైనా, వారికి సహకరించిన అధికారులపైనా కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు.