కేంద్ర మంత్రికి ఎంపీ మిథున్ రెడ్డి విజ్ఞప్తి
- కేంద్రమంత్రి అనుప్రియ పాటిల్ ని కలిసిన ఎంపీ మిధున్ రెడ్డి
- ఫాతీమా కళాశాల విద్యార్థుల సమస్య పరిష్కరించాలని కోరిన ఎంపీ
చేయని తప్పులకు ఫాతీమా కళాశాల విద్యార్థులను శక్షించవద్దని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఆయన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి అనుప్రియ పాటిల్ ను కలిశారు. ఫాతీమా కళాశాల విద్యార్థులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా ఎంపీ కోరారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని ఆయన కోరారు. చేయని తప్పులకు విద్యార్థులను శిక్షించవద్దని, వారికి ప్రత్యామ్నాయం చూపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్రమంత్రికి వినతి పత్రాన్ని కూడా అందజేశారు.
కాగా.. ఫాతీమా కళాశాలలో 2015-16లో జరిగిన అడ్మిషన్లు చెల్లవని భారత వైద్య మండలి(ఎంసీఐ) ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో కళాశాలలోని విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. మొత్తం 99మంది విద్యార్థులను ఒక్కో కాలేజీకి 9 మంది చొప్పున 11 ఇతర వైద్య కళాశాలల్లో సర్దుబాటు చేసేందుకు అనుమతించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చినా.. తాజాగా సుప్రీం ఇచ్చిన తీర్పుతో వారి ఆశలు నిరాశలు గా మారాయి. కోర్టులో వేసిన కేసు బలంగా లేకోపోవడంతో విద్యార్థులు ఓడిపోయారు. దీనంతటికీ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కారణమని , ఆయన కళాశాల యాజమాన్యంతో కుమ్మక్కై తమకు అన్యాయం చేశారంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై విద్యార్థులు పలుమార్లు సీఎంని కూడా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యార్థుల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎంపీ మిథున్ రెడ్డి కేంద్రమంత్రిని కలిశారు.