వైసీపీకి కూడా ఆ కోరిక లేదు
- అసెంబ్లీ సమావేశాల బహిష్కరణను సమర్థించుకుంటున్న వైసీపీ
- ప్రజా స్వామ్య విలువలు కాపాడేందుకే సమావేశాలు బహిష్కరించామంటున్న వైసీపీ నేతలు
అసెంబ్లీ సమావేశాల బహిష్కరణను వైసీపీ సమర్థించుకుంటోంది. ప్రజా స్వామ్య విలువలను కాపాడేందుకే తాము అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించామని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ విషయంపై వైసీపీ నేతలు శ్రీకాంత్ రెడ్డి, తమ్మినేని సీతారాంలు శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
అసెంబ్లీని బాయ్ కాట్ చేయాలన్న ఉద్దేశం ఏ పార్టీకి ఉండదని.. తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము ఆ నిర్ణయం తీసుకున్నామని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. ఏ వ్యవస్థనైనా చంద్రబాబు బాగా మెనేజ్ చేస్తారని.. ఆ విషయం అందరికీ తెలుసని ఆయన అన్నారు. టీడీపీ ఎజెండాను అందరి మీదా రుద్దాలనుకోవడం మంచి పద్ధతి కాదని చంద్రబాబుని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఇదే విషయంపై తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య విలువలను కాపాడటానికి తాము తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమన్నారు. ప్రతిపక్ష సభ్యుల పేర్లను, స్థానాలను అసెంబ్లీ ప్రకటించాల్సిన అవసరం ఉందని అన్నారు. లేకపోతే కళంకిత స్పీకర్ గా కోడెల చరిత్రలో మిగిలిపోతారని తమ్మినేని తెలిపారు.
పార్టీ ఫిరాయింపులు రాజ్యాంగ విరుద్ధమన్న ఆయన, అలాంటివాళ్లు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటే ప్రజల తీర్పును అగౌరవపరిచినట్లేనన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్న వారి తీరుకు నిరసనగానే తమ పార్టీ బహిష్కరణ నిర్ణయం తీసుకుందన్నారు.