ఈ రోబోకి షారూఖ్ అంటే ఇష్టం
హైదరాబాద్ నగరంలో మాట్లాడే రోబో
ప్రపంచ ఐటీ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా రోబో సోఫియా
సూపర్ స్టార్ రజినీకాంత్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన రోబో సినిమాని ఎవరూ మర్చిపోరు. దానికి కొనసాగింపుగా రోబో 2.0 కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంగతి పక్కన పెడితే.. రోబోలో చిట్టి చేసిన విన్యాసాలను ఎవరూ మర్చిపోరు. అచ్చం అలాంటి రోబోనే ఇప్పుడు హైదరాబాద్ నగరానికి వచ్చింది. రావడమే కాదు.. తన మనసులోని చాలా విషయాలను అందరితోనూ పంచుకుంటోంది.
అసలు సంగతేంటి అంటే.. హైదరాబాద్ నగరంలో ప్రపంచ ఐటీ సదస్సు జరుగుతోంది. ఈ సదస్సులో సోఫియా అనే మానవ రోబో సందడి చేస్తోంది. దీని సృష్టికర్త డేవిడ్ హాస్సన్ , రోబో సోఫియాను పలువురు కొన్ని ప్రశ్నలు అడగగా.. అది సమాధానాలు చెప్పింది. మరో ప్రత్యేకత ఏంటంటే.. ఈ రోబోకి సౌదీ అరేబియా పౌరసత్వం కూడా ఉంది. ఒక దేశ పౌరసత్వం కలిగిన ఎకైక రోబో సోఫియా.
తనకు అన్ని దేశాలకన్నా.. హాంకాంగ్ అంటే ఇష్టమని చెప్పింది. ఇక హీరోల విషయానికి వస్తే.. షారూక్ ఖాన్ అంటే చాలా ఇష్టమని తెలిపింది. తాను రోబో అయినప్పటికీ.. మనిషిలాగే తనకు కొంచెం రెస్ట్ కావాలంది. ఎప్పుడైనా అప్ సెట్ అయ్యావా.. అని ఒకరు అడిగిన ప్రశ్నకు.. తనకు అలాంటి ఫీలింగ్ లేదని చెప్పేసింది. తనకు ఫేస్ బుక్ , ట్విట్టర ఖాతాలు ఉన్నాయని.. ఎప్పుడూ వాటిలో చురుకుగా ఉంటానని కూడా ఈ రోబో చెప్పింది.