మద్యం మోజులో మగువలు..!
- మద్యం మత్తులో మునిగి తేలుతున్న యువతులు
- ఒత్తిడి, మితిమీరిన స్వేచ్ఛే కారణమంటున్న నిపుణులు
మద్యం అనగానే ముందుగా మగవాళ్లే గుర్తుకువస్తారు. మద్యానికి బానిసులైన మగవాళ్లను తరచూ చూస్తునే ఉంటాం. దానిని వ్యతిరేకిస్తూ.. మహిళలు ఉద్యమాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. కానీ.. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఇప్పటికీ ఒకవైపు కొందరు మహిళలు మద్యం నిషేధించాలని ధర్నాలు, రాస్తారోకోలు చేస్తోంటే.. నేటి తరం యువతులు మాత్రం మద్యం సేవించడం స్టేటస్ సింబల్ గా ఫీలౌతున్నారు.
‘‘వై షుడ్ బాయ్స్ హావ్ ఆల్ ఫన్?’’ అంటూ ఒక హీరోయిన్ టీవీ ప్రకటనలో అడిగిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ ప్రశ్న నిజానికి వినడానికి చాలా సింపుల్ గా అనిపించి ఉండొచ్చు. కానీ.. అదే ప్రశ్న ని చాలామంది మహిళలు స్పూర్తిగా తీసుకుంటున్నారేమో? మద్యం మగవాళ్లే ఎందుకు తాగాలి? తాము ఎందుకు తాగకూడదు? అనే వాదన ప్రస్తుత కాలంలో మగువల నుంచి తరచూ వినపడుతోంది. ప్రశ్నించడమే కాదు దానిని ఆచరించి చూపిస్తున్నారు.
ఎంతలా అంటే.. మైనర్లు, కాలేజీ యువతులు.. మద్యపానం, ధూమపానాలకు విపరీతంగా అలవాటు పడుతున్నారు. కొన్ని సినిమాల్లో అమ్మాయిలు మద్యం తాగడం, సిగరెట్లు తాగడం లాంటివి చూపిస్తున్న విషయం తెలిసిందే. ఆ అదంతా సినిమా.. నిజం కాదు అని కొట్టిపారేసే వాళ్లు కూడా ఉంటారు. కానీ నిజంగా బయట ప్రపంచంలో జరిగే వాటినే సినిమాల్లో చూపిస్తున్నారు.
సినిమాలు చూసి యువత పాడైపోతుందని వాదించే వాళ్లు కూడా ఉన్నారు. కానీ.. బయట జరుగుతున్న దానినే తాము సినిమాల్లో చూపిస్తున్నామని సినిమా వాళ్లు చెబుతున్నారు. ఎవరు ఏది చెప్పినా.. ప్రస్తుతం ఆడపిల్లలు మాత్రం మద్యానికి విపరీతంగా అలవాటు పడుతున్నారనేది వాస్తవం. చదువు, ఉద్యోగాల కోసం ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళుతున్నారు. అలాంటి సందర్భాల్లో ఎక్కువగా వీటికి అలవాటు పడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కార్పొరేట్ సంస్థల్లో పనిచేసేవాళ్లు.. పబ్ కల్చర్ కి అలవాటు పడి మద్యం, సిగరెట్లకు బానిసలౌతున్నారు. పని ఒత్తిడి, విపరీతమైన స్వేచ్ఛ ఇందుకు దారితీస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.