ఈ టిడిపి నేత వైసిపిలోకి వస్తున్నారా?
ఇపుడున్న పరిస్థితుల్లో వెంటనే రావడం కష్టం.
నిదానమే ప్రధానం అనుకుంటున్నారా?
చిత్తూరు జిల్లా సీనియర్ టిడిపి నాయకుడు సుబాష్ చంద్రబోస్ పార్టీ మారతారా? ఇది జిల్లా టిడిపి వర్గాల్లో ప్రశ్న. మారితే ఎటు వోతాడు, బిజెపికా, లేక వైసిపికా... ఆయన వైసిపి వైపే వెళతారని ఒక వర్గం అనుమానిస్తూ ఉంది. ఇంతకీ కథ ఏంటంటే... ( ఇక్కడే కనిపించే ఫోటో మంచి రోజుల నాటివి)
పలమనేరు నియోజకవర్గ మాజీ ఇన్చార్జి సుభాష్చంద్ర బోస్ ఇపుడు పూరా అన్ హ్యాపీ. మొన్న మొన్నటి దాకా ఆయన హవా నడిచింది. ఎపుడయితే ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి వైసిపి నుంచి ఫిరాయించి టిడిపిలో చేరి మంత్రి అయ్యారో, అప్పటినుంచి బోసు పరిస్థితి మారిపోయింది. మంత్రి తీరు బోసుకు నచ్చడంలేదు. నియోజకవర్గం లో తన ప్రాముఖ్యం తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన పసిగట్టారు. మంత్రి జరిపే హంగామా సమావేశాలనుంచి దూరం జరుగుతున్నారు.
పలమనేరులో శుక్రవారం జరిగిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశానికి, ఆపై జరిగిన ర్యాలీ, బహిరంగ సభకు స్థానిక నేత బోస్ డుమ్మా కోట్టి సంచలనం సృష్టించారు. ఇదే ఇపుడు రకరకాల వూహాగానాలకు కారణమయింది. టీడీపీ రాష్ట్ర కోశాధికారిగా, రాష్ట్ర కార్యవర్గంలో చోటున్న తనకి పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో బోస్ను కుంగి పోతున్నారు. ఇది తమనేతకు అవమానమే నంటున్నారు ఆయన అనుచరులు. ఇది పొమ్మన లేక పొగపెట్టడమే నంటున్నారు.
ఎంత ఒకే పార్టీలో ఉన్కా అమర్ నాథ్ రెడ్డి, బోసు మధ్య వియ్యం కష్టమే.
2014 ఎన్నికల్లో వారిద్దరు ప్రత్యర్థులు. వైసిపి తరఫున గెలిచిన అమర్నాథ్ రెడ్డి పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరారు. మంత్రి అయ్యారు. అప్పటినుంచే బోస్కు పొజిషన్ తారుమారవడం మొదలయింది.
మొన్న మొన్నటి దాకా 2019లో అమర్ నాథ్ రెడ్డిని ఓడిస్తానన్నధీమా బోస్ లోఉండింది. ఆ దిశలోటిడిపిని సమాయత్తం చేస్తున్నారు. ఇలాంటపుడు అమర్ నాథ్ రెడ్డి టిడిపిలోకి దూకారు.
అయితే చంద్రబాబు తనకు అన్యాయం చేయరులే అనుకుని మంత్రితో సర్దుకు పోతున్నాడు. అయితే, 2019 దగ్గరవుతున్న కొద్ది మంత్రిలో మార్పు కనిపిస్తా ఉంది. అలాంటపుడు టపీమని బోస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పదవిని పీకేశారు. అనంతరం బోస్ కార్యాలయంపై ఐటీ దాడులు జరిగాయి. ఇదంతా తనకు 2019లో టికెట్ ఇవ్వకుండా ఉండేందుకుకే ననే అనుమానం ఆయనలో మొదలయింది. దీనితో పార్టీకి కాస్త దూరంగానే ఉంటున్నారు. మరొక వైపు అమర్ నాథ్ రెడ్డి జోరు పెంచాడు. తన ఆధిపత్యాన్ని చూపెట్టాలనే మంత్రి బహిరంగసభను, ర్యాలీని ఏర్పాటు చేసినట్టు బోస్ అనుచరుల అనుమానం. అందుకే డుమ్మా అంటున్నారు ఆయన మిత్రులు.
గత ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చుచేసి 93 వేల ఓట్లు సాధించిన బోస్కు ఇపుడు 2019లో టికెట్ ఇస్తారనే నమ్మకమే లేకుండా పోయింది. అందుకే ఆయన వర్గం కుతకుత లాడుతూ ఉంది. ఈ పార్టీలో ఉండటంకష్టమేనంటున్నారు.
ఆయన వెంటనే కాకపోయినా, నిదానంగా వేరే దారి చూసుకొనక తప్పదని చెబుతున్నారు.