కెసిఆర్ సొంత నియోజకవర్గంనుంచి ఎందుకు పోటీ చేయరు?
కెసిఆర్ సొంత నియోజకవర్గం నుంచి పోటీ చేయడం లేదు, ఎందుకు? దీనికి కారణం, హరీష్ రావు కెసిఆర్ ను బ్లాక్ మెయిల్ చేస్తూ ఉండటమే అంటున్నారు కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి.
ముఖ్యమంత్రి కెసిఆర్ సిద్ధిపేట నియోజకవర్గాన్ని ఎందుకు హరీష్ రావుకు వదిలేశారు? ఎందుకు వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు?
ఈ చిక్కుముడిని జగ్గారెడ్డి విప్పుతున్నారు.
కెసిఆర్ ని అల్లుడు-మంత్రి హరీష్ రావ్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (తూర్పు జయప్రకాశ్ రెడ్డి)అన్నారు.
సిద్ధిపేట లో కెసిఆర్ పోటీ చేయకుండా హరీష్ రావు అన్ని విధాల రాజకీయం చేస్తున్నాడని జగ్గారెడ్డి అన్నారు.
దీని వల్లే సొంత నియోజకవర్గం లో పోటీ చేయకుండా కెసిఆర్ పక్క నియోజకవర్గం లో పోటీ చేస్తున్నాడని జగ్గారెడ్డి చెప్పారు.
ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబం మీద తీవ్రమయిన దాడికి పూనుకున్నారు.
రాహుల్ సంగారెడ్డి సభతో కల్వకుంట్ల కుటుంబానికి నిద్ర కరువయ్యిందని అన్నారు.
పిసిసి నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి పై మంత్రి హరీష్ రావ్ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నాడని వాటిని సహించేది లేదని జగ్గారెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హరీష్ రావ్ బండారాలు బయటపెడుతామని కూడా ఆయన అన్నారు.
‘‘కెసిఆర్ కుటుంబ ఆస్తులు బయటపెడితే రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన కుటుంబ సభ్యులు తరిమి కొడతారు,’’ అని జగ్గారెడ్డి అన్నారు.
ఉత్తమ్ ముక్కు నేలకు రాపిస్తాఅని హరీష్ అనడానికి కూడా ఆయన అభ్యంతరం చెప్పారు. ‘అంత దమ్ముందా...ఉత్తమ్ ని ముట్టుకో మా కార్యకర్తల దమ్ము చూపిస్తా,’ అని హెచ్చరించారు.
‘‘రేపు అధికారంలోకి వస్తున్నాము..తడాఖా చూపించి మీ బండారం బయటపెడుతాం’’ అని కూడా అన్నారు.