మరొక సారి లెక్క తప్పిన మోదీ
ప్రధాని నవంబర్ 8 ప్రకటన ఉద్దేశాలన్నీ లెక్క తప్పుతున్నాయి. మొదట నకిలీ నోట్ల బెడద తప్పని తేలింది. ఇపుడు నల్లదనం డొల్ల అని స్వయంగా కేంద్రమంత్రి మేఘ్వాల్ అంకెలతో సహా రాజ్యసభ ముందుంచారు
మరొక కఠోర సత్యం.
ఒకటొకటే ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన వన్నీ అబద్దాలని బయటపడుతున్నాయి. నోట్లరద్దుకు చెప్పిన కారణాలు మూడు : నకిలీ నోట్లు, నల్ల ధనం, అవినీతి. ఇందులో మొదటిది నకిలీ నోట్ల గుట్టు రట్టయింది. ఈ విషయంలో ప్రధాని చెప్పినవి కాకిలెక్కలే నని, దేశంలో నకిలీ నోట్ల బెడద భయపడాల్సినంత ఏమీ లేదని పార్లమెంటులో ఆర్థిక శాఖ సహయ మంత్రి వెల్లడించిన లెక్కలు చెబుతున్నాయి.
ప్రధాని చూపిన నకిలీ నోట్ల భూతం అంత ప్రమాదకరంగా లేదని రిజర్వు బ్యాంకుతో పాటు ఇండియన్ స్టాటిస్టిటిక్ ఇన్ స్టిట్యూట్, నేషన్ ఇన్వెస్టిగేషన్ అధారిటీ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనం చెప్పింది. దీని ప్రకారం దేశంలో ఛలామణిలో ఉన్న దొంగనోట్ల 400 కోట్లు దాటడం లేదు. ఈ వివరాలు ఇక్కడ ఉన్నాయి.
ఇపుడు తాజాగా నల్ల ధనం అంత నల్లగా లేదని మళ్లీ పార్లమెంటులో ప్రభుత్వమే చెబుతోంది. ప్రధాని నవంబర్ 8 వతేదీన దూరదర్శన్ లో చేసిన ‘ లైవ్ ’ (ఇది కూడా లైవ్ కాదని చెబుతున్నారు) ప్రకటనలో చెప్పినట్లు నల్ల ధనం అంత నల్ల గా లేదని అనిపిస్తున్నది. వివరాలు చూడండి.
దేశంలో దాదాపు 3 నుంచి 5 లక్షల కోట్ల నల్లధనం ఉందని అది బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యే ప్రసక్తి లేదని ప్రభత్వం లెక్కలేసింది. ప్రధాని తీసుకున్న నోట్ల రద్దు తో ఇదంతా మటాష్ అవుతుందని అన్నారు. అయితే, బ్యాంకుల్లో డిపాజిట్ అవుతున్న నోట్ల వివరాలు, ధోరణి చూస్తే ఇదితప్పని, ప్రధాని నల్ల లెక్కలు తప్పని తెలిసిపోతుంది.
మంగళవారం నాడు అర్ధిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభకు నోట్ల వివరాలను అందించారు. ఈ వివరాల ప్రకారం నవంబర్ 8న ప్రధాని పెద్ద నోట్ల రద్దు ప్రకటన చేసే నాటికి దేశంలో 17,165 మిలియన్ల రు. 500 నోట్లు, 6858 మిలియన్ల రు. 1000నోట్లు ఛలామణి లో ఉన్నాయి. అంటే రు. 8.58 లక్షల కోట్ల విలువయిన రు.500 నోట్లు, 6.86 లక్షల విలువయిన వేయినోట్లు ఛలామణి లోఉన్నాయన్న మాట.
నవంబర్ 10 నుంచి నవంబర్ 27 తేదీల మధ్య రు. 8.45 కోట్ల (రు. 8,44,962 కోట్లు) విలువయిన నోట్లు బ్యాంకుల్లో పడ్డాయని నవంబర్ 28 తేదీన రిజర్వు బ్యాంకు ప్రకటించింది. ప్రధాని ప్రకటన తర్వాత నవంబర్ 9న బ్యాంకులకు శెలవిచ్చారు. అంటే ప్రభుత్వం ఇచ్చిన 50 రోజుల గడవులో మొదటి 18 రోజులలో బ్యాంకుల్లో డిపాజిట్ అయిన మొత్తం నోట్ల విలువ ఇది.
బ్యాంకులన్నీ కొంత మొత్తాన్ని డిపాజిట్ గా రిజర్వు బ్యాంకుల్లో నిల్వ ఉంచుతాయి. దీనినే క్యాష్ రిజర్వు రేషియో (సిఆర్ ఆర్) అంటారు. ఇలా రిజర్వు బ్యాంకు దగ్గిర ఉన్న సిఆర్ ఇర్ విలువ రు. 4,06,900 కోట్లు అని ఆర్ బిఐ తన వారాంతపు బులెటీన్లో పేర్కొంది. సిఆర్ ఆర్ ఎపుడూ పెద్ద నోట్లలోనే ఉంటుంది.
ఇది కాకుండా రోజూవారి లావాదేవీల కోసం బ్యాంకులు తమ దగ్గిర కొంత నగదును నిల్వచేస్తాయి. ఇది 70,000 వేల కోట్ల దాకా ఉంటుంది. ఇందులో పెద్ద, చిన్న నోట్లన్నీ ఉంటాయి.
ఇపుడు గత 20 రోజులలో బ్యాంకుల్లో డిపాజిట్ అయిన మొత్తానికి (రు. 8,44,962 కోట్లు) రిజర్వు బ్యాంకు దగ్గిర ఉన్న సిఆర్ ఆర్ రు. 4,06,900 కోట్లు కలిపితే బ్యాంకుల దగ్గిర ఉన్న మొత్తం డబ్బు 12.50 లక్షల కోట్లవుతుంది. దీనికి నవంబర్ 8న బ్యాంకు దగ్గిర ఉన్న క్యాష్ ఇన్ హ్యాండ్ మొత్తం రు.50 వేల కోట్లు కలిపితే రద్దయిన పాత నోట్ల విలువ రు. 15 లక్షల కోట్ల వుతుంది. ఇక నల్లధనమెక్కడ ఉంది?
రద్దయిన పాత పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు ఇంకా దాదాపు నెల రోజుల గడువుంది. ఇపుడు జమ అవుతున్న తీరును బట్టి చూస్తే మరొక రు. 2 లక్షల కోట్ల లేదా అంతకంటే ఎక్కువే డిసెంబర్ 30 నాటికి జమకావచ్చంటున్నారు. నోట్ల సంఖ్య ప్రభుత్వం చెప్పిన దానిని మించి పోతున్నట్లేనా?
ఆ లెక్కన ఛలామణిలోకి రాకుండా పోతాయనుకున్న దాదాపు రు. 5 లక్షల కోట్ల నల్లధనం ఎక్కడుంది? దేశంలో నల్లధనం ప్రధాని చూపినంత భయంకరమయిన రాక్షసి కాదనేనా మంత్రి మేఘ్వల్ చెబుతున్నది.
అంటే, ప్రధాని ప్రటన వచ్చేలోపే నల్లధనాన్నంతా పెద్దోళ్లు తెల్లబరుచుకోవడమయినా జరిగి ఉండాలి లేదా ప్రధాని దేశ ప్రజల ముందుంచిన అంకెలు తప్పయినా అయి ఉండాలి. ఎందుకంటే బ్యాంకుల్లోకి రాదనుకున్న నల్ల ధనం 3 నుంచి 5 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ప్రధాని నోట్ల సర్జికల్ స్ట్రయిక్ తో ఈ డబ్బంతా మటాష్ అనుకున్నారు. అయితే,మోదీగారి మంత్రి గారు చెబుతున్న లెక్కల ప్రకారం, నల్ల ధనం అంతగా లేదు. నోట్ల రద్దు వల్ల కుప్పకూలిన నల్ల మహారాజులెవరూ లేరు.
అంటే, ఏ విధంగా చూసినా, నల్లధనం నిర్మూలించేందుకే పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని చేసిన ప్రకటన లెక్కలు తప్పింది.