శనివారం ఉదయం నుంచి విజయవాడ నగరంలో బార్లు, వైన్స్ బంద్ అయ్యాయి. విజయవాడ నగరంలోని 350 వైన్ షాపులు, 165 బార్లు తెరుచుకోలేదు. సాయంత్రం 7గంటల వరకు దుకాణాల మూత కొనసాగింది. సాయంత్రం ఓపెన్ చేస్తామని బార్లు, వైన్స్ యజమానులు  చెబుతున్నారు.

ఉదయం నుంచి బార్లు, వైన్ షాపులు బంద్ కావడంతో మద్యం దొరకక మందు బాబులు నానా ఇబ్బందులు పడ్డారు. అలాగే వ్యాపారం జరగకపోవడంతో ఇటు వైన్స్, బార్ ల యజమానులు సైతం తీవ్రంగా నష్టపోయారు.

జాతీయ రహదారులకు 500 మీటర్ల దూరంలో వైన్స్, బార్ లు ఉండరాదన్న సుప్రీంకోర్టు తీర్పు నేథప్యంలో ఈ బార్ లు, వైన్స్ మూతపడినట్లు తెలుస్తోంది. ఎక్సయిజ్ శాఖ నుంచి అనుమతులు రాని కారణం గా కృష్ణా జిల్లా వ్యాప్తం గా 350 వైన్ షాపులు, 165 బార్లు మూతపడ్డాయి.

శనివారం సాయంత్రం తర్వాత బెజవాడ తో పాటు జిల్లా లో కేవలం 100 దుకాణాలకు మాత్రమే ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతులు మంజూరయ్యాయి. దీంతో వారు మాత్రమే ఓపెన్ చేసి వ్యాపారం చేస్తున్నారు.

మరోవైపు వార్షిక లైసెన్స్ ఫీజును మూడు విడతల్లో కాకుండా ఒకేసారి చెల్లించాలని ఎక్సైజ్ శాఖ నుంచి మద్యం వ్యాపారులను కోరుతున్నారు. ఈ కారణంగా కూడా మద్యం దుకాణాలు తెరుచుకోలేదని చెబుతున్నారు.