వెంకయ్య నాయుడికి 485 మంది ఎంపిల మద్దతు
- ఉపరాష్ట్రపతి ఎన్నికలో వెంకయ్యనాయుడి గెలుపు ఖాయమయింది
- 788 మంది ఉన్న ఎలెక్టోరల్ కాలేజీలో ఆయనకు 485 మంది మద్దతు ఉంది
- ఆగస్టు 5 ఎన్నిక నామ మాత్రమే
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో నిలబడుతున్న ఎన్డిఎ అభ్యర్థి వెంకయ్య నాయుడు గెలుపు సునాయాసంగా జరుగుతుంది.ఇలా గెలిచేందుకు అవసరమయిన బలం ఎన్డీయే సమకూర్చకుంది. ఇప్పటికి ఆయనకు 485 మంది ఓటర్ల బలం ఉంది.
ఉప రాష్ట్రపతిని లోక్ సభ, రాజ్యసభ సభ్యలు ఎన్నుకుంటారు. ఈ రెండు సభలను కలసి ఉప రాష్ట్రపతి ఎలెక్టోరల్ కాలేజ్ అంటారు. ఈ ఎన్నిక ఆగస్టు 5 జరుగుతుంది.మొత్తం 788 మంది ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు ఆరోజు ఓటు వేస్తారు. ఆయన ప్రత్యర్థి పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్, మాజీ ఐఎఎస్అధికారి గోపాల్ కృష్ణ గాంధీ. వెంకయ్యనాయుడికి 485/788 ఎలక్టోరల్ కాలేజ్ సభ్యుల మద్దతు ఉందని ఎన్ డిఎ ఎన్నికల పర్యవేక్షకులు చెబుతున్నారు. అంటే ఆయనకు 60 శాతం ఎలెక్టోరల్ కాలేజ్ మద్దతు ఉంది.
అందువల్ల ప్రత్యర్థి ప్రతిపక్షాల అభ్యర్థి గోపాల్ కృష్ణ గాంధీ పోటీ నామ మాత్రమే అని అర్థమవుతుంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల ఎలక్టోరల్ కాలేజ్ సంఖ్య 79౦. బిజెపి ఎంపీలు అనిల్ మాధవ్ ధావే, వినోద్ ఖన్నాలు ఇటీవలే మృతి చెందడంతో ఈ సంఖ్య 788కు తగ్గింది.
లోక్సభలో ఇపుడు 544 మంది సభ్యులున్నారు. ఇందులో ఎన్డీఎ బలగం 337. రాజ్యసభలో మొత్తం 244 మంది సభ్యులుంటే 77 మంది ఎన్డీయే సభ్యులు.వీటికి తోడు, ఎన్డీయేలో లేని అన్నాడిఎంకె, టిఆర్ఎస్, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలు కూడా వెంకయ్య నాయుడుకు మద్దతు ప్రకటించాయి. దీనితో ఆయన కు 54 మంది సభ్యుల మద్దతు తోడయింది. 17 మంది ఇతరు రాజ్యసభ సభ్యులు కూడా ఆయనకే మద్దతు ఇచ్చేలా ఉన్నారు.