మాటే కాదు, మనిషీ పత్తా లేడు
ఇంత జరుగుతున్నా కనిపించని వాడు, వినిపించని వాడు ఈయనొక్కడే...
అంతా మాట్లాడుతూనే ఉన్నారు. కాకపోతే, కొందరు ఎక్కువగా మాట్లాడుతున్నారు, ఇంకొందరు మరీ ఎక్కువగా మాట్లాడుతుంటే, మరికొందరు తక్కువగా మాట్లాడుతునారు. మధ్యలో అపుడపుడు మాత్రమే మాట్లాడే పర్వాలేదు గాళ్లున్నారు. అయితే, ఈ సందడిలో వినిపంచని గొంతొకటే. మాటే కాదు, మనిషీ లేడు.
ఆయనెవరో కాదు, రిజర్వు బ్యాంక్ గవర్నర్ ఊర్జిత్ పటేల్. నిజానికి ఈ పెద్ద నోట్ల గొడవంతా రిజర్వు బ్యాంకు పరిధిలో ని వ్యవహారం. దేశం నలుమూలలా ఇంత రభస జరుగుతూ ఉంటే, పాలసీ విషయం హెడ్డాఫీపుకొదిలేసిన మారు మూల పల్లెలోని చిన్నబ్యాంకు శాఖ లగా రిజర్వు బ్యాంకు నుంచి ఎవరూ మాట్లాడం లేదు.
చింత బర్రవూపుతూ నోరెత్తితే తాట వొల్చేస్తానని పాతకాలపు స్కూళ్లో అయ్యావార్లు బెదిరించినపుడ నోటికి తాళం వేసుకుని కూర్చున్న విద్యార్థుల్లాగా రిజర్వు బ్యాంక్ అధికారులెవరూ సందడి చేయడంలేదు. కాకపోతే అపుడపుడు నోట్ల కొరత తీరుతుందని హామీ ఇస్తూ ప్రెస్ నోట్లు వదల్తూ ఉన్నారు.
నవంబర్ ఎనిమిదో తేదీన ప్రధాని నోటనోట్ల మాట వినిపించనతర్వాత ఊర్జిత్ పటేల్ మాట్లాడిందొకసారో రెండు సార్లో. కినిపించింది కూడా అంతే.
మోదీ గ్రేట్ ఇండియన్ టైగర్ కాబట్టి ఆయన విహరిస్తున్నపుడు మరొకడు కనబడితే బాగుండదని ఊర్జిత్ వూరకుండిపోతున్నారా?
లేక నోరు మూసుకుని ముంబాయిలో కూర్చో, కథ నడిపించేది,కథలో నటించేది కూడా మోదీయే అని హెచ్చరించారా?
సమాధానం దొరకడం కష్టం.
ఇప్పటికయితే, ఇంతే, ఊర్జిత్ పటేల్ కనిపించడం లేదు. పార్లమెంటులో కనిపించకపోయినా, బయట కనిపిస్తున్నది మోదీ, ఆయనకు సహాయనటుడిగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అపుడపుడూ కనబడుతున్నారు. ఈ మధ్యలో ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత విరామ సంగీతం వినిపిస్తూ ఉంటారు.