జీన్స్ తో వస్తే జీతం కట్
ఇలా జీన్స్ మీద ఆంక్షలు విధిస్తే మొదట నష్టపోయేది బాబా రామ్ దేవ్ యే. ఎందుకంటే, ఈ మధ్య స్వదేశీ జీన్స్ పేరుతో పెద్ద ఎత్తున జీన్స్ ప్యాంట్లను తయారుచేసే ఫ్యాక్టరీలను తెరవాలనుకుంటున్నారు బాబా. దీనికోసం దక్షిణాది నుంచి ఆంధ్ర ప్రదేశ్ ను ఎంపిక చేశారు. ఈ ఫ్యాక్టరీని అనంతపురం లో పెట్టించండి, ఇక్కడ ఇప్పటికే జీన్స్ ఉత్పత్తి పెద్ద ఎత్తున సాగుతూ ఉందని ఆ జిల్లా టిడిపి నాయకులు ముఖ్యమంత్రికి కూడా విజ్ఞప్తి చేశారు. తెలంగాణా నుంచి ఎంపి కవిత కూడా ఆయనను తమ రాష్ట్రానికి ఆహ్వానించారు.
గుట్కా, ధూమపానం, బీఫ్, పశు వధ శాల నిషేధంతో మొదలయిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సాంస్కృతిక యుద్ధం ఇపుడు జీన్స్ టీ షర్ట్ లకు విస్తరించింది. అయితే, ఇది మరొక బాబాకు తలనొప్పిగా మారవచ్చు. బాబా రామ్ దేవ్ ఈ మధ్య ముఖ్యమంత్రి యోగిని కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఇది జరిగిన వారం రోజులలోనే, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులెవరూ పనివేళల్లో జీన్స్, టీ షర్టు ధరించరాదని నిషధం విధించింది.
ఈ మేరకు మార్చి 22 వ తేదీన 2016-17/831 ఉత్తర్వులు జారీ చేసి పురుషులు ప్యాంట్-షర్ట్, మహిళలు చీరె లేదా సల్వార్ సూట్ లో మాత్రమే రావాలని నియమం విధించారు.
ప్రభుత్వం ఉత్తర్వులను తక్షణం అమలు చేసిన ఘనత బరేలీ జిల్లా కలెక్టర్ సురేంద్ర సింగ్ దక్కించుకున్నాడు. ఈ ఉత్తర్వులొచ్చి పదిరోజులవుతున్నందున ఒక రౌండలా తనిఖీ ప్రభుత్వోద్యోగులు అవాక్కయ్యేలా చేద్దామనుకున్నారు. అంతే, కలెక్టర్ గారు బహేరి తాలుకాఫీసును ఆకస్మికంగ సందర్శించారు. ఆయన వెళ్లేటప్పటికి తాలూకా ఫీసులో ఉద్యోగులంతా జీన్స్, టీషర్టులతో కనిపించే సరికి ఆయనకు చిర్రెత్తిపోయింది. వెంటనే వాళ్లందరి మీద చిందులేశాడు. నిప్పులుకురిపించాడు.కొత్త ప్రభుత్వం ఇచ్చిన కొత్త ఉత్తర్వు ఖాతరు చేయనందుకుచెడామడా చివాట్లు పెట్టాడు. ఎలాంటి దుస్తులేసుకుని విధులకు రావాలో,మనసంస్కృతేమిటో, మనమేమిటో,యోగి ప్రభుత్వమేమిటో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులేమిటో పెద్ద క్లాస్ పీకేశాడు.
‘జీన్స్, టీషర్టులు ఇక చెల్లవు,’ ఒక ఉరుమురిమాడు.
‘ఫార్మల్ డ్రెస్ లోనే ఆఫీసులకు రావాలని జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులందరిని ఆదేశించాడు. డిపార్ట్ మెంట్ ల హెడ్ లంతా కార్యాలయాలలో ఆదేశాలు అమలుచేసి తీరాల్సిందే,’ అని అరిచాడు.
‘ ఫార్మల్స్ లో ఆఫీసులో కనిపించకపోతే ఆరోజు ఆబ్సెంట్ కింద లెక్క. ఒక రోజు జీతం కోసేస్తా.’ వార్నింగ్ ఇచ్చేసి వెళ్లిపోయాడు సింగ్ సాబ్.
ఇంతవరకు బాగానే ఉంది, ఇలా జీన్స్ మీద ఆంక్షలు విధిస్తే మొదట నష్టపోయేది బాబా రామ్ దేవ్ యే. ఎందుకంటే, ఈ మధ్య స్వదేశీ జీన్స్ పేరుతో పెద్ద ఎత్తున జీన్స్ ప్యాంట్లను తయారుచేసే ఫ్యాక్టరీలను తెరవాలనుకుంటున్నారు. దీనికోసం దక్షిణాది నుంచి ఆంధ్ర ప్రదేశ్ ను ఎంపిక చేశారు. ఈ ఫ్యాక్టరీని అనంతపురం లో పెట్టించండి, ఇక్కడ ఇప్పటికే జీన్స్ ఉత్పత్తి పెద్ద ఎత్తున సాగుతూ ఉందని ఆ జిల్లా టిడిపి నాయకులు ముఖ్యమంత్రికి కూడా విజ్ఞప్తి చేశారు.
ఉత్తర ప్రదేశ్ ఎన్నికల తర్వాత అన్ని రాష్ట్రాలలో మోదీ మీద భయభక్తులు పెరిగాయి. కాబట్టి ఆఫీసు వాతావారణం మెరుగుపరిచే పేరుతో అన్ని రాష్ట్రాలు ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలు యోగి ఆదిత్యనాథ్ ను అనుసరించే ప్రమాదం లేకపోలేదు. ఇది జీన్స్ కొనుగోలు మీద కూడా పడుతుంది.చివరకు బాబా రామ్ దేవ్ వ్యాపారానికి ఆదిలోనే దెబ్బతగలవచ్చు. పతంజలి బాబా ఏమిచేస్తారో చూడాలి. స్వదేశీ జీన్స్ కు మినహాయింపు తెచ్చుకుంటారేమో చూడాలి.