మంజీరానదిలో మునిగి ఇద్దరు హైదరబాదీల మృతి
- మంజీరా నదిలో మునిగి ఇద్దరు యువకుల మృతి
- హైదరబాద్ కు చెందిన యువకులుగా గుర్తించిన పోలీసులు
దైవ దర్శనానికి వెళ్లిన ఇద్దరు స్నేహితులు నదిలో మునిగి మృత్యువాతపడ్డ విషాద సంఘటన మెదక్ జిల్లా ఏడుపాయల్లో జరిగింది.
వివరాల్లోకి వెళితే హైదరాబాద్ చింతల్ కు చెందిన ఆనంద్(18), సిద్దార్థ్(18) స్నేహితులు. వీరు ప్రణతి జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నారు. అయితే వీరు ఇవాళ దైవ దర్శనం కోసం మెదక్ జిల్లా లోని పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత ఆలయానికి వెళ్లారు. అక్కడ మంజీరా నదిపై వున్న ఘనాపూర్ ఆనకట్ట లో సరదాగా ఈత కోసం దిగారు. అయితే వీరికి సరిగ్గా ఈత రాకపోవడం. ఆనకట్టలో నీరు అధికంగా ఉండటంతో ఈ నీటిలో మునిగి ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. వీరికి సంభందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో విద్యార్థుల మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన విద్యార్థుల పూర్తి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.