ఇద్దరు ఎమ్మెల్యేలను బిజెపి హైజాక్ చేసింది: కుమారస్వామి
ఇద్దరు ఎమ్మెల్యేలను బిజెపి హైజాక్ చేసిందని జెడిఎస్ శాసనసభా పక్ష నేత కుమారస్వామి ఆరోపించారు.
హైదరాబాద్: ఇద్దరు ఎమ్మెల్యేలను బిజెపి హైజాక్ చేసిందని జెడిఎస్ శాసనసభా పక్ష నేత కుమారస్వామి ఆరోపించారు. ఓ ఎమ్మెల్యే కనిపించకుండా పోయాడని ఆయన చెప్పారు. రేపటికి వారు తమ శిబిరంలోకి వస్తారని చెప్పారు. ఆయన శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ వచ్చారు.
తొలుత తాజ్ కృష్ణాలోని కాంగ్రెసు శాసనసభా పక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు.ఆ తర్వాత తమ పార్టీ ఎమ్మెల్యేలు బస చేసిన నోవాటెల్ హోటల్ కు వెళ్లారు. అక్కడ ఆయన తమ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. రేపటి వ్యూహాన్ని ఖరారు చేశారు.
రేపటి బలపరీక్షలో బిజెపికి చేదు అనుభవం తప్పదని ఆయన మీడియాతో అన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రలోభపెడుతున్నారని ఆయన అన్నారు. యడ్యూరప్ప ప్రోద్బలంతోనే బోపయ్యను గవర్నర్ ప్రోటెమ్ స్పీకర్ గా నియమించారని ఆయన అన్నారు. పలువురు బిజెపి ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని చెప్పారు. తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికే హైదరాబాద్ వచ్చినట్లు తెలిపారు.
ప్రోటెమ్ స్పీకర్ గా బోపయ్య నియామకాన్ని జెడిఎస్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. శుక్రవారం రాత్రి జెడిఎస్ ఎమ్మెల్యేలు కూడా బెంగళూరు బయలుదేరి వెళ్తారు.