మార్కెట్ లోకి టీవీఎస్ కొత్త బైక్.. ధరెంతో తెలుసా?
- భారత మార్కెట్ లోకి టీవీఎస్ కొత్త మోడల్
- లక్సరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూతో కలిసి టీవీఎస్ తొలిసారిగా తయారుచేసిన బైక్ ఇది.
ప్రముఖ మోటారు వాహనాల తయారీ సంస్థ టీవీఎస్.. భారత మార్కెట్ లోకి కొత్త మోడల్ బైక్ ని ప్రవేశపెట్టింది. టీవీఎస్ అపాచీ ఆర్ ఆర్ 310 పేరిట బుధవారం చెన్నైలో ఈ బైక్ ని విడుదల చేశారు. దీని ధర రూ.2.05 లక్షలు (ఎక్స్-షోరూమ్ చెన్నై)గా కంపెనీ నిర్ణయించింది.
కాగా ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రానికి ధరల్లో తేడా ఉండొచ్చని కంపెనీ తెలిపింది. సబ్-500 సీసీ (150- 500సీసీ) విభాగంలో మోటార్సైకిళ్లను తయారు చేసేందుకు 2013 ఏప్రిల్లో కంపెనీ బీఎండబ్ల్యూ మోటోరాడ్తో జట్టు కట్టిన సంగతి తెలిసిందే. ఈ రెండు కంపెనీల సంయుక్త ప్లాట్ఫామ్గా కొత్త బైకు నిలుస్తుందని, దీని కోసం దాదాపు రూ.400 కోట్లు వెచ్చించామని కంపెనీ అధ్యక్షుడు, సీఈఓ కేఎన్ రాధాకృష్ణన్ తెలిపారు.
మొత్తం మోటార్సైకిళ్ల అమ్మకాల్లో ప్రీమియం బైక్ విభాగం వాటా 14 శాతం ఉందని, ఏటా 10 శాతం చొప్పున వృద్ధి చెందుతోందని అన్నారు. వచ్చే ఏడాది కాలంలో 10,000 అపాచీ ఆర్ఆర్310లను విక్రయించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ సంయుక్త ఎండీ సుదర్శన్ వేణు వెల్లడించారు. ఈ నెలఖారుకు మోటార్సైకిళ్లను వినియోగదారులకు అందజేస్తామని పేర్కొన్నారు. త్వరలోనే అపాచీ 160సీసీ అధునాతన వేరియంట్ను విడుదల చేస్తామని వేణు తెలిపారు.