ఆగస్టు 3 నుంచి తిరుమల వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు
- ఆగష్టు 3న పవిత్ర ప్రతిష్ట,
- ఆగస్టు 4న పవిత్ర సమర్పణ,
- ఆగస్టు 5న మహాపూర్ణహుతి
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 3 నుంచి 5వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలు ఆగస్టు2వ తేదీన అంకురార్పణతో ప్రారంభమవుతాయి.
ఈ ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఉదయం 9.00గంటల నుంచి 11.00 గంటల వరకు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. సాయంత్రం 6.00 గంటల నుంచి 8.00 గంటల వరకు ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను దర్శనమిస్తారు. ఆగష్టు 3న పవిత్ర ప్రతిష్ట, ఆగస్టు 4న పవిత్ర సమర్పణ, ఆగస్టు 5న మహాపూర్ణహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయి.
ఈ ఉత్సవాల సందర్భంగా ఆగస్టు 2వ తేదీ బుధవారం వసంతోత్సవం, సహస్రదీపాలంకారసేవ, ఆగస్టు 3 నుండి 5వ తేదీ వరకు తిరుప్పావడసేవ, నిజపాద దర్శనం, కల్యాణోత్సవం, ఊంజలసేవ, ఆర్జీత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకారసేవలను టిటిడి రద్దు చేసింది. ఆయా రోజుల్లో ఆర్చన, తోమాల సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు.