నువ్వు చెప్పాల్సింది మీ సైన్యానికి.. మాకు కాదు
పాకిస్థానీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదీకి.. టీం ఇండియా క్రికెటర్లు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాశ్మీర్ విషయంలో.. పాకిస్థాన్ సైన్యానికి బుద్ధి చెప్పాలని.. తమకు కాదని వారు పేర్కొన్నారు. ఇటీవల కశ్మీర్ అంశంపై ఆఫ్రీది సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కాశ్మీర్ లో అమాయకులు బలౌతున్నారని..అక్కడ తీవ్ర అణచివేత కొనసాగుతోందని ఆఫ్రీది అభిప్రాయపడ్డారు. కాగా.. అతని మాటలపై భారత క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్ లో హింసకు అసలు కారణం పాకిస్థాన్ సైన్యమేనన్నారు. తమ సైన్యానికి బుద్ధి చెప్పాల్సిందిగా సూచించారు.
‘‘మా దేశాన్ని నడిపించుకునే సామర్థ్యం మాకుంది. మేమేం చేయాలో బయటివారు చెప్పాల్సిన అవసరం లేదు.’’ అని సచిన్ అన్నారు. కాశ్మీరు మూలాలున్న రైనా ట్విట్టర్లో స్పందిస్తూ ‘‘కశ్మీరు భారత్లో అంతర్భాగం. అలాగే కొనసాగుతుంది. కాశ్మీరు ధర్మ భూమి. అక్కడే మా తాత ముత్తాతలు జన్మించారు. మా కాశ్మీరులో పాకిస్థాన్ సైన్యం ఉగ్రవాదాన్ని, పరోక్ష యుద్ధాన్ని ఆపాలని అఫ్రిది అడుగుతాడని ఆశిస్తున్నా. మాకు శాంతి కావాలి. రక్తపాతం, హింస కాదు.’’ అని అన్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లి స్పందిస్తూ మన దేశం ప్రయోజనాలతోనే తన ప్రయోజనాలుంటాయని, అందుకు విరుద్ధంగా ఏమైనా జరిగితే అందుకు తాను మద్దతు పలకనని అన్నారు. మహ్మద్ కైఫ్ స్పందిస్తూ పాక్ క్రికెటర్లు ఇంకా ఐపీఎల్లో ఆడుతున్నారని, అఫిది ఆ వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని అన్నారు. కపిల్దేవ్ స్పందిస్తూ ‘‘అసలు అతనెవరు? అతనికెందుకంత ప్రాధాన్యం ఇవ్వాలి? అటువంటి వారి వ్యాఖ్యలకు స్పందించకపోవడమే మంచిది.’’ అని అన్నారు.