జనగాం లో భారీగా జెఎసి నేతల అర్ధరాత్రి అరెస్టు
కోదండరామ్ యాత్ర ను అడ్డుకునేందుకే ఈ అరెస్టులంటున్న తెలంగాణ జెఎసి నేతలు
ఆరవ దశ స్ఫూర్తి యాత్రను అడ్డుకోవడానికి టీజేఏసీ వరంగల్, జనగామ,మహబూబాబాద్ నాయకులను, కార్యకర్తలను, విద్యార్థి నాయకులను పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత అరెస్టు చేశారు. అరెస్టులింకా కొనసాగుతున్నాయి. ఇదే విధంగా జనగాం లో పోలీసులు దగ్గరుండి జెఎసి జండాలను తీసేయించారు. ఈ అరెస్టులను టీజేఏసీ తీవ్రంగా ఖండించింది. అరెస్టులతో తెలంగాణ ప్రజల చైతన్యాన్ని అడ్డుకోలేరని తక్షణం అరెస్టులు ఆపాలని కోదండ రామ్ కోరారు. అరెస్టు చేసిన వారందరినీ విడుదలచేయాలని ఆయన డిమాండ్ చేశారు.. అరెస్టయిన వారిలో సోషల్ మీడియా నాని, శ్రీను, బాల లక్ష్మి (ఉస్మానియా) సారయ్య, ప్రశాంత్( కాకతీయ)లు ఉన్నారు. మానుకోట జిల్లా జేఏసీ నేతల అక్రమ అరెస్ట్ ను వరంగల్ జెఎసి తీవ్రంగా ఖండించింది. కెసిఆర్ ప్రభుత్వానికి జేఏసీ అంటే భయం పట్టుకుందని అందుకే ఈ అరెస్టులని వరంగల్ జిల్లా టిజాక్ కన్వీనర్ బొనగాని రవీందర్ అన్నారు.‘కోదండరాం మాటలు ప్రజలకు సూటిగా చేరుతున్నాయి. ఇది తెలుకున్న ప్రభుత్వం పోరు గడ్డపై కోదండరామ్ యాత్ర కు బ్రేక్ వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర చేస్తున్నారు. అందులో భాగమే అరెస్టులు,’ అని ఆయన అన్నారు. ఈ ఉదయం 7 గంటలకు వరంగల్ లో టీజేఏసీ చైర్మన్ ప్రో.కోదండరాం ఇంటి వద్ద నుండి యాత్ర ప్రారంభం అయింది. అనంతరం జనగామ మండలం పెంబర్తి నుండి బైక్ ర్యాలీ ఉంటుంది. జనగామ అంబెడ్కర్ విగ్రహం వద్ద రోడ్ షో సమావేశాలు ఉన్నాయి. తెలంగాణలో సాగుతున్న ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి, తెలంగాణ ను కాపాడుకుందాం అనేలక్ష్యంతో కోదండరామ్ స్ఫూర్తి యాత్రను సాగిస్తున్న సంగతి తెలిసిందే.