తూర్పుగోదావరి జిల్లాలో లోయలో పడ్డ ప్రయాణికుల వాహనం
- మారేడుమిల్లి - చింతూరు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం
- అదుపుతప్పి లోయలో పడ్డ వాహనం
- ఆరుగురు ప్రయాణికుల మృతి
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని మారేడుమిల్లి - చింతూరు ఘాట్ రోడ్డుపై జరిగిన ఈ ప్రమాదంలో 6 గురు ప్రయాణికులు మృత్యువాత పడ్డారు.
ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం మారేడుమిల్లి నుంచి 11 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఆటో సరిగ్గా ఘాట్ రోడ్డు పైకి రాగానే అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనతో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా, రఘు అనే వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. మిగతా క్షతగాత్రులను అంబులెన్స్ లో కాకినాడ జీజీహెచ్కు తరలించారు. అయితే వీరిలోను మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.
ఆటో డ్రైవర్ వాహనాన్ని నిర్లక్ష్యంగా నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు భాధితులు తెలిపారు. అయితే ఈ ప్రమాదం ఘటనపై ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప జిల్లా ఎస్పీ ద్వారా సమాచారాన్ని తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు సానుభూతిని తెలిపుతున్నట్లు చినరాజప్ప ప్రకటించాడు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కాకినాడ ఆస్నత్రి వైద్యులను ఆదేశించారు.