గుడి మల్కాపూర్ లో టెన్షన్ టెన్షన్ (వీడియో)
- గుడి మల్కాపూర్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు
- బస్తీ వాసులు, పోలీసులకు మద్య వాగ్వాదం
- ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్ మెహిదీపట్నం ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గుడి మల్కాపూర్ పూల మార్కెట్ వద్ద అక్రమంగా వెలిసిన గుడిసెలను రెవెన్యూ అధికారులు పోలీసుల సాయంతో తొలగించడానికి ప్రయత్నించగా బాధితులు ఎదురుతిరిగారు. తాము గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే జీవిస్తున్నామంటూ, అన్యాయంగా ఇలా తొలగించడం తగదని పోలీస్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు, మున్సిపల్ అధికారులు వారి మాట వినకుండా తొలగింపు కొనసాగిస్తుండటంతో బస్తీవాసులు ఆందోళనకు దిగారు.
తమకు ఇక్కడి స్థలాలకు ప్రత్యామ్నాయంగా బండ్లగుడ, బోజగుట్ట లో కేటాయించిన స్థలాల్లో ఇళ్ల కట్టిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇలా ఇళ్లు కట్టియ్యక ముందే ఖాళీ చేయిస్తే తాము రోడ్డున పడతామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బస్తీలోని మహిళలు, పురుషులు అంతా కలిసి ఆందోళన చేస్తుండటంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.