అటు ఏపీ పర్స్.. ఇటు టీఎస్ వాలెట్
- క్యాష్ లెస్ విధానానికి రెడీ అయిన తెలుగు రాష్ట్రాలు
- నెల రోజులైనా ఇబ్బందుల్లోనే తెలుగు ప్రజలు
పెద్ద నోట్ల రద్దు తరువాత తెలుగు రాష్ట్రాలు క్యాష్ లెస్ జపం మొదలుపెట్టాయి. మోదీ రూట్ లో స్పీడ్ గా దూసుకెళ్తున్నాయి. ఆన్ లైన్ విధానానికి మారాలని ప్రధాని పిలుపు ఇవ్వడమే తరువాయి రెండు రాష్ట్రాలు క్యాష్ లెస్ లావాదేవీల కోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించాయి.
దేశానికి టెక్నాలిజీని తానే పరిచయం చేశానని చెప్పుకొనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో అందిరిని మించి పోయారు.
ఏపీ పర్స్ పేరుతో రాష్ట్రంలో ఆన్ లైన్ విధానంలో లావాదేవీలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఏపీ పర్స్ యాప్ తో రాష్ట్రంలోని అన్ని లావా దేవీలు ఇక ఆన్ లైన్ ద్వారా చేపట్టే అవకాశం కల్పించారు.
అలాగే, మొబైల్ బ్యాంకింగ్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విసృత ప్రచారం కల్పించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దేశంలోనే తొలి క్యాష్ లెస్ స్టేట్ గా ఏపీని నిలిపేందుకు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు.
మరో వైపు తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఏపీ తో పోటీకి దిగింది.
చంద్రబాబు అప్పుడే ఏపీ పర్స్ ను ప్రారంభిస్తే... తెలంగాణ ప్రభుత్వం మాత్రం రాష్ట్రం కోసం ప్రత్యేకంగా రూపొందించిన క్యాష్ లెస్ విధానం టీఎస్ వాలెట్ ను ఈ నెల 14 న ప్రారంభించేందుకు సిద్ధమైంది.
టీఎస్ వాలెట్ ద్వారా ఆన్ లైన్ లో లావా దేవీల నిర్వహణకు సంబంధించి సాంకేతిక ఏర్పాట్లు ఐటీ శాఖ ఇప్పటికే పూర్తి చేసింది. ఐటీ మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా దీన్ని పర్యవేక్షించినట్లు సమాచారం.
ఇలా తెలుగు రాష్ట్రాలు అంతా ఆన్ లైన్ కు రెఢీ అయిపోయాయి. ఎటొచ్చి తెలుగు ప్రజలే ఇంకా పైసా చేతికందక ఏటిఎం లు, బ్యాంకుల వద్ద బారులు తీరుతున్నారు. దీనిపై స్పందించి, ప్రజల కష్టాలు తీర్చడానికి మాత్రం ఇద్దరు ‘చంద్రులు’ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ విషయంలోనూ ఇద్దరు సీఎంలు ఏకాభిప్రాయంతోనే ఉన్నట్లున్నారు.