ఫైబర్ గ్రిడ్ పాలెగాళ్లొస్తున్నారు...
టిడిపి నేతలంతా ఇక ముందు చానెళ్లమీద, వార్తల మీద కంట్రోల్ పెంచుకుని ప్రాంతీయ ఫైబర్ గ్రిడ్ పాలెగాళ్లయిపోతారా?
ఫైబర్ గ్రిడ్ పథకం ఈ రోజు రాష్ట్రపతి ప్రారంభించారు. పైకి రు. 490 లకు టివికనెక్షన్, ఇంటర్నెట్, టెలిఫోన్ కనెక్షన్ అని తేనెపూసి చెప్పినా, ఫైబర్ గ్రిడ్ తెలుగుదేశం పార్టీ భారీ రాజకీయ పథకం అని అంటున్నారు. ఇది టివి ప్రసారాలను కంట్రోల్ చేసేందుకు, ప్రత్యర్ధి చానెళ్లేవయినా వుంటే అదుపు చేసేందుకు ఉద్దేశించిన వ్యవహారమని మరొకవైపు విమర్శ వినబడుతున్నది. టివి ప్రసారాల మీద ప్రభుత్వం కంట్రోల్ ఎలా ఉంటుందో తెలుగు రాష్ట్రాల వాళ్లకి బాగా తెలుసు. ఎందుకంటే, తెలంగాణలో రెండు చానెళ్లను కేబుల్ ఆపరేటర్లు బ్యాన్ చేసిన సంగతి చూశాం. ప్రభుత్వం మ ాకు సంబంధం లేదు, అదంతా కేబుల్ ఆపరేటర్ల పని ప్రభుత్వం తప్పుకుంది. అదీ అపరేటర్ల రాజకీయం. ఆంధ్రచానెళ్ల పేరతో తెలంగాణాలో ఆ పని జరిగింది.రేపు మరొక కారణంతో ఫైబర్ గ్రిడ్ ‘అపరేటర్లు’ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే చానెళ్లను మూసేయవచ్చు. ఫలానా పార్టీ, ఫలానా నాయకుడు అభివృద్ధిని అడ్డుకుంటున్నాడని ‘దేశభక్తి’ తో ఈ పని చేయవచ్చు. ఈ అనుమానాలకు కారణాలు, ఫైబర్ గ్రిడ్ లైసెన్స్లు ఎవరికి పోతున్నాయో చూస్తే అర్థమవుతుంది.
ఆపరేటర్లను ఎంపిక చేయడానికి బిడ్డింగ్ ప్రక్రియ ఉండాలి. రాష్ట్రప్రభుత్వం దానిని పక్కన పెట్టి నచ్చినవాళ్లకు లైసెన్స్ లను అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫైబర్ గ్రిడ్ పథకం అమలు ప్రక్రియ మొత్తాన్ని అధికారపార్టీకి అనుకూలురైన కేబుల్ ఆపరేటర్ల చేతిలో పెడుతున్నారు. వీరంతా ఇక ముందు చానెళ్లమీద, వార్తల మీద కంట్రోల్ పెంచుకుని ప్రాంతీయ ఫైబర్ గ్రిడ్ పాలెగాళ్లవుతారని వేరే చెప్పనవసరం లేదు. ఎటువంటి బిడ్డింగ్, టెండర్ నిర్వహించకుండానే ఆయా సర్కిళ్లను అప్పగించి అవగాహన ఒప్పందం (ఎంవోయు) కుదుర్చుకున్నారు.
ఎంపికయిన కొన్ని పేర్లు చూడండి.
కర్నూలు కేంద్రంలో ఫైబర్ గ్రిడ్ ఏజెన్సీని డిప్యూటీ సీఎం కెఇ క్రిష్ణమూర్తి బంధువులకు అప్పగించగా, నంద్యాలలో మంత్రి భూమా అఖిల ప్రియ కుటుంబానికి చెందిన కేబుల్ సంస్థకు దక్కింది. వీళ్లుకాకుండా మరొకరికి దక్కుతుందా? అని ఉరవకుండా వైసిపి ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇదే తరహాలో అధికారపార్టీకి చెందిన కేబుల్ ఆపరేటర్లకే అప్పగించారని సమాచారం అందుతున్నదని కూడా ఆయన చెప్పారు.
శ్రీకాకుళం జిల్లాలో జల్లేపల్లి గిరిధర్, జల్లేపల్లి శ్రీధర్లకు అప్పగించారు. వీరిద్దరూ అధికార తెలుగు దేశం పార్టీకి అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నవారే. కాకినాడ, రాజమండ్రిలో కొండలరావుకు చెందిన వెంకటసాయి కేబుల్ సంస్థకు అప్పగించారు. కొండల్రావు సతీమణి ప్రస్తుతం అధికారపార్టీ తరపున మేయర్గా కొనసాగుతున్నారు. వైఎస్సార్ కడపలో జ్యోతి కేబుల్కు కూడా అప్పగించారు. ఇది అధికారపార్టీ నేత పుత్తా నరసింహారెడ్డికి చెందినది. అనంతపురం జిల్లా కేంద్రంతో పాటు రాప్తాడు, పెనుగొండ నియోజకవర్గాల్లో పరిటాల శ్రీరామ్కు చెందిన సిటీ కేబుల్కు ఫైబర్గ్రిడ్ ఏజెన్సీ అప్పగించారని తమకు తెలిసిందని ఆయన చెప్పారు.
ఇలా ఫైబర్ గ్రిడ్ లెసెన్సులన్నీ అధికార పార్టీ నేతల చేతల్లో ఉంటే ప్రతిపక్ష వాయిస్ ను అణగదొక్కడం సులువవుతుందని అధికార పార్టీ భావిస్తూ ఉందని ఆయన అన్నారు.